టీడీపీ నేతల టిడ్కో గృహాల సందర్శన ఉద్రిక్తం
ABN , First Publish Date - 2023-02-07T01:03:18+05:30 IST
పట్టణ టీడీపీ నేతలు సోమ వారం చేపట్టిన టిడ్కో గృహాల పరిశీలన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. సమాచారం తెలుసుకున్న వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ నేతల కంటే ముందుగానే టిడ్కో గృహాల్లోకి వెళ్లారు
ముందుగానే గృహాల్లో తిష్ఠవేసిన వైసీపీ కౌన్సిలర్లు
అనంతరం టీడీపీ కౌన్సిలర్లకు మాత్రమే లోనికి అనుమతి
సమస్యలను ఏకరవు పెట్టిన లబ్ధిదారులు
చిలకలూరిపేట అర్బన్, ఫిబ్రవరి 6 : పట్టణ టీడీపీ నేతలు సోమ వారం చేపట్టిన టిడ్కో గృహాల పరిశీలన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. సమాచారం తెలుసుకున్న వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ నేతల కంటే ముందుగానే టిడ్కో గృహాల్లోకి వెళ్లారు. అనంతరం టీడీపీ కౌన్సిలర్లు, నేతలను లోనికి రానీయకుండా గేటుదగ్గరే ఆపేయాల్సిం దిగా పోలీసులకు హుకుం జారీచేశారు. వైసీపీ నేతల ఈ చర్యలపై టీడీపీ మునిసిపల్ ఫ్లోర్ లీడర్ గంగా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడ్కో గృహాల సందర్శన అనగానే వైసీపీ నేతలకు అంత భయం ఎందుకని?, పోలీసులతో తమను నియంత్రించటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
అనతరం మునిసిపల్ చైర్మన్ షేక్రఫాని జోక్యం చేసుకొని కేవలం టీడీపీ కౌన్సిలర్లను మాత్రమే లోనికి అనుమతించేలా పోలీసులకు సమాచారమిచ్చారు. అనంతరం వైసీపీ, టీడీపీ కౌల్సిలర్ల బృందం టిడ్కో గృహాలను సందర్శించి, లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ క్రమంలో పలువరు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. తాగునీరు రావటం లేదని, వీధిలైట్లు వెలగటంలేదని, పాములు తిరుగుతున్నా యని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని గృహాలకు తలుపులు, కిటికీలు, కరెంటు మీటర్లు, కరెంటు స్తంబాలకు తీగలు, లైట్లు లేకపోవటంపై టీడీపీ కౌన్సిలర్లు మునిసిపల్ చైర్మన్ను ప్రశ్నించగా ‘దొంగలు పడ్డారు’ అని సమాదానం చెప్పడంతో వారంతా అవాక్కయ్యారు. గృహాలకు వైసీపీ రంగులేయటం మినహా ప్రభుత్వం ఏంచేయలేదని, టీడీపీ హయాంలో నిర్మించిన ఈ నిర్మాణాలు అన్ని సౌకర్యాలతో లబ్ధిదారులకు అందితే టీడీపీకి, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లా రావుకు ఎక్కడ మంచిపేరు వస్తుందన్న ఉద్దేశంతోనే గృహాలను ఈ విధంగా పాడుచేశారని టీడీపీ కౌనిలర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. కనీస సౌక ర్యాలు కల్పించకుండా నాలుగేళ్ల క్రితం ఎలా ఉన్నాయో అలాగే లబ్ధిదారులకు కేటాయించారని టీడీపీ కౌన్సిర్లు అన్నారు. కార్యక్రమంలో టీడీపీ కౌన్సిలర్లు పాములపాటి శివ కుమారి, కూనల ప్రమీల, జంగా సుజాత, కొత్త కుమారి, కనమర్లపూడి లక్ష్మీ తిరుపల, రాయిని హరితలతో పాటు, పార్టీ నేతలు పఠాన్ సమద్ ఖాన్, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణ సీఐ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్ఐ మోహన్, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.