CM Jagan : మార్గదర్శిపై ముప్పేట దాడి!

ABN , First Publish Date - 2023-08-17T04:13:56+05:30 IST

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై గరిష్ఠ స్థాయిలో అస్త్రశస్త్రాలను ప్రయోగించాలని జగన్‌ సర్కారు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

CM Jagan : మార్గదర్శిపై ముప్పేట దాడి!

ఇతర శాఖలనూ సిద్ధం చేసిన సీఐడీ

తాడేపల్లిలో అధికారులకు ‘భారీ శిక్షణ’

సీఐడీ, పోలీసుతోపాటు అగ్నిమాపక,

రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు హాజరు

సెల్‌ఫోన్లు లోపలికి తేకుండా జాగ్రత్తలు

రహస్య సమావేశంలో కీలక ఆదేశాలు

ఇక అన్ని బ్రాంచ్‌లలో ‘ఫైర్‌సేఫ్టీ’ సోదాలు

పెద్ద చిట్స్‌ వేసిన వారికి ‘హెచ్చరికలు’

మార్గదర్శి చిట్స్‌ ఏజెంట్లపైనా గురి

నేటి నుంచే సోదాలు జరిగే అవకాశం

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై గరిష్ఠ స్థాయిలో అస్త్రశస్త్రాలను ప్రయోగించాలని జగన్‌ సర్కారు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా చేసిన ప్రయత్నాలేవీ తాము ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో ముప్పేట దాడికి రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ దిశగా బుధవారం భారీ కసరత్తు జరిగింది. తాడేపల్లిలోని సీఎం నివాసానికి సమీపంలోని ఫంక్షన్‌ హాలులో సీఐడీ ఉన్నతాధికారులు ఓ సమావేశం నిర్వహించారు. ఇందులో... సీఐడీతోపాటు పోలీసు, రిజిస్ట్రేషన్లు, అగ్నిమాపక శాఖ, రాష్ట్ర రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని అత్యంత రహస్యంగా, పకడ్బందీగా నిర్వహించారు. ముందుగానే అందరి సెల్‌ఫోన్లను హాలు బయటే పెట్టించారు. ‘మార్గదర్శి సంస్థను మూసివేస్తాం’ అని రెండు నెలల కిందట సీఐడీ చీఫ్‌ చెప్పిన మాటలను నిజం చేయడమే లక్ష్యంగా... అధికారులకు ‘శిక్షణ’ ఇచ్చినట్లు సమాచారం. ఈ సమావేశంలో వందమందికిపైగా అధికారులు పాల్గొన్నట్లు తెలిసింది. బహుశా... గురువారం నుంచే కొన్ని రోజులపాటు రాష్ట్రంలోన్ని అన్ని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ శాఖలలో తనిఖీలు జరిపే అవకాశముంది. ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్లు, సీఐడీ అధికారులు మాత్రమే ‘మార్గదర్శి’పై సోదాలు, కేసులతో హడావుడి చేస్తున్నారు. ఇకపై... ఇతర శాఖల అధికారులను కూడా రంగంలోకి దించాలని నిర్ణయించారు. ఏదో ఒక కోణంలో, ఏదో ఒక నెపంతో వీలైనన్ని బ్రాంచ్‌లకు తాళాలు

వేయించడమే లక్ష్యంగా పని చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 37 మార్గదర్శి శాఖలున్నాయి. వీటిలో చాలా వరకు అద్దెకు తీసుకున్న భవనాలే! యజమానులను పిలిచి హెచ్చరికలు జారీ చేయాలని భావిస్తున్నారు. ఆ భవనాలకు అగ్నిమాపక శాఖ అనుమతులు లేని పక్షంలో... తక్షణం తాళాలు వేసే అవకాశం కనిపిస్తోంది. ఇక... కోటి రూపాయలకంటే ఎక్కువ విలువైన చిట్‌ వేసిన ఖాతాదారులను పిలిచి బెదిరించాలని కూడా యోచిస్తున్నారు. ‘‘మీరు వెంటనే చిట్‌ను విత్‌డ్రా చేసుకోండి. లేదంటే... నోటీసులు ఇస్తాం. మీ వ్యాపారం, మీ ఆదాయం గురించి ఆరా తీయాల్సి ఉంటుంది’’ అని హెచ్చరించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. కోటికి మించి విలువైన చిట్‌ వేసిన వాళ్లకు నోటీసులు ఇస్తామని సీఐడీ ఇదివరకే హెచ్చరించడం గమనార్హం. ఇక... మార్గదర్శి చిట్స్‌ వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తున్న ఏజెంట్లపైనా గురి పెట్టినట్లు తెలుస్తోంది. ‘ఈ నేరంలో మీరూ భాగస్వాములవుతారు జాగ్రత్త’ అంటూ వారిని బెంబేలెత్తించాలని భావిస్తున్నారు. గురువారం నుంచి పది నుంచి పదిహేను రోజులపాటు ప్రతి బ్రాంచ్‌కు ఏడెనిమిది మందితో కూడిన అధికారుల బృందం వెళ్లి తనిఖీలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇందులో... సీఐడీతోపాటు ఇతర శాఖల అధికారులూ ఉంటారు.

పతాక స్థాయికి...

‘ఈనాడు’ గ్రూప్‌నకు చెందిన మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ సంస్థ 50 సంవత్సరాలుగా నడుస్తోంది. ఇందులో అవకతవకలు జరుగుతున్నాయంటూ ‘ఈనాడు’ గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ రామోజీరావు, మార్గదర్శి మేనేజింగ్‌ డైరెక్టర్‌ శైలజా కిరణ్‌పై సీఐడీ కేసులు నమోదు చేసింది. మార్గదర్శికి చెందిన ఆస్తులను ‘సీజ్‌’ చేసింది. మార్గదర్శి చిట్స్‌ కార్యాలయాలపై సోదాలు చేపట్టి, పలువురు సిబ్బందిని అరెస్టు చేశారు. సీఐడీ తీసుకున్న చర్యలపై మార్గదర్శి ఎప్పటికప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయిస్తోంది. ఈ కేసులో సీఐడీ అధికారులు రామోజీరావు, శైలజా కిరణ్‌లను హైదరాబాద్‌లో ప్రశ్నించారు. తదుపరి విచారణలో భాగంగా ఈ నెల 16, 17న విజయవాడలో తమ ముందు విచారణకు హాజరు కావాలని సీఐడీ అధికారులు ఇద్దరికీ నోటీసులు ఇచ్చారు. అనారోగ్యంతోపాటు వృద్ధాప్యంలో ఉన్న రామోజీరావు తగిన కారణాలు చూపించి విచారణకు హాజరు కాలేదు. శైలజా కిరణ్‌ కూడా విచారణకు రాలేదు. ఇదే నేపథ్యంలో... మార్గదర్శిపై చర్యలను పతాకస్థాయికి తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే సీఐడీ ఆధ్వర్యంలో బుధవారం ‘శిక్షణ’ కార్యక్రమం నిర్వహించినట్లు సమాచారం!

Updated Date - 2023-08-17T04:16:03+05:30 IST