రాష్ట్రం భగభగ

ABN , First Publish Date - 2023-04-17T03:39:23+05:30 IST

భానుడి భగభగలకు రాష్ట్రం ఠారెత్తిపోయింది. ఆదివారం ఉదయం నుంచే అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రతకు జనం అల్లాడిపోయారు.

రాష్ట్రం భగభగ

117 మండలాల్లో వడగాడ్పులు

ఉత్తర కోస్తాలో అధిక ప్రభావం

మరో 2 రోజులు ఇదే పరిస్థితి: ఐఎండీ

విశాఖపట్నం, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): భానుడి భగభగలకు రాష్ట్రం ఠారెత్తిపోయింది. ఆదివారం ఉదయం నుంచే అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రతకు జనం అల్లాడిపోయారు. పడమర గాలుల ప్రభావంతో రాష్ర్ట్రంలోని 17 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 100 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. అనకాపల్లి, కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వడగాడ్పుల ప్రభావం ఎక్కువగా ఉంది. వడగాడ్పుల వల్ల బయటకు వెళ్లలేక ఇళ్లల్లో ఉండిపోయి ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందిపడ్డారు. చిత్తూరు జిల్లా పాలసముద్రంలో 44.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండు రోజులు రాష్ట్రంలో వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న ఐదు రోజుల వరకు పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని పేర్కొంది. కాగా, ఆదివారం ఉత్తరకోస్తా ఏజెన్సీ ప్రాంతంలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి

దేశవ్యాప్తంగా ఎండలే

దేశంలోని సుమారు 95 శాతం ప్రాంతాలు ఆదివారం ఎండ తీవ్రతకు ఠారెత్తిపోయాయి. దేశంలో నమోదైన ఎండతీవ్రత ను భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హీట్‌ మ్యాప్‌ ద్వారా తెలియజేసింది. ఈ హీట్‌మ్యాపులో దేశంలోని 95 శాతం ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 36 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యాయి.

Updated Date - 2023-04-17T03:39:23+05:30 IST