గుంటూరులో దోపిడీ దొంగల బీభత్సం
ABN , First Publish Date - 2023-03-02T03:10:13+05:30 IST
గుంటూరులో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి గంజాయి మత్తులో బీభత్సం సృష్టించారు.
ఇద్దరు సెక్యూరిటీ గార్డుల దారుణ హత్య
మరో సెక్యూరిటీ గార్డుపై హత్యాయత్నం
గంజాయి మత్తులో విచక్షణ కోల్పోయిన దుండగులు
గుంటూరు, మార్చి 1: గుంటూరులో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి గంజాయి మత్తులో బీభత్సం సృష్టించారు. ఇద్దరు సెక్యూరిటీ గార్డులను హత్య చేసి, మరో సెక్యూరిటీ గార్డుపై హత్యాయత్నం చేశారు. పట్టుకునేందుకు యత్నించిన కానిస్టేబుల్పై కూడా దాడికి యత్నించారు. అలాగే పాతగుంటూరు, కొత్తపేట తదితర ప్రాంతాల్లో పలువురిపై దాడులకు తెగబడ్డారు. గంజాయి మత్తులో ఇద్దరు యువకులు బుధవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి రెండుగంటల పాటు నగరంలో ద్విచక్ర వాహనంపై యథేచ్ఛగా తిరుగుతూ హత్యలు, దాడులు, దొంగతనాలకు తెగబడటం కలకలం రేపింది. తొలుత అమరావతిరోడ్డులోని ఐడీ ఆసుపత్రి ఎదురుగా ప్రారంభోత్సవానికి సిద్థమైన యమహా షోరూం వద్దకు దాడి చేసిన దుండగులు అక్కడ విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డు బావాజీనగర్ 6వలైనుకు చెందిన విశ్రాంత జీఆర్పీ కానిస్టేబుల్ శ్రీరామ్ కృపానిధి (66) తలపై గడ్డపారతో మోది హత్య చేశారు. అక్కడి నుంచి అరండల్పేట 10/2 లోని ప్రభుత్వ లిక్కర్ స్టోర్ వద్దకు వెళ్లి.. అక్కడ రామిరెడ్డితోట పరిధిలోని ప్రకా్షనగర్కు చెందిన బత్తుల సాంబశివరావు(62) అనే సెక్యూరిటీ గార్డును గడ్డపారతో తలపై కొట్టి హతమార్చాడు. ఆ తర్వాత మళ్లీ అరండల్పేట 10వ లైనులోకి వచ్చి ఓ మొబైల్ యాక్సెసరీస్ దుకాణం షట్టర్ తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించారు. అందులోని రెండు ట్యాబులు, ఆరు సెల్ఫోన్లు అపహరించారు. సమీపంలోని స్వగృహ ఫుడ్స్ సెక్యూరిటీ గార్డు ఏసుదానం(65) వారిని ప్రతిఘటించగా గడ్డపారతో దాడి చేయడంతో అతని తలకు బలమైన గాయాలయ్యాయి.
భయంతో అతను సమీపంలోని అరండల్పేట పోలీస్స్టేషన్కు పరుగు తీశాడు. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ఉదయ్ ఘటన స్థలానికి రాగా.. నిందితులు దాడి చేసేందుకు యత్నించారు. అయినా వారిని కానిస్టేబుల్ వెంబడించడంతో పరారయ్యారు. తెల్లవారిన తర్వాత సెక్యూరిటీ గార్డుల హత్యలు వెలుగుచూశాయి. బుధవారం వేకువజామున దొంగలు పాత గుంటూరు ేస్టషన్ పరిధిలోనూ హల్చల్ చేశారు. మణిపురం ఓవర్ బ్రిడ్జి కింద ఉన్న అశ్వినీ హాస్పిటల్ రోడ్డులో ఆరు దుకాణాల షట్టర్లు పగలగొట్టి సామగ్రి ధ్వంసం చేశారు. నిందితులు ద్విచక్రహనంపై వచ్చినట్లు స్థానికులు తెలిపారు. అక్కడ పాల ప్యాకెట్లు వేసుకునే విజయకుమార్ అలియాస్ యేసుబాబుని కూడా కర్రతో కొట్టారు. అక్కడ నుంచి పాత గుంటూరులోని ఆర్యవైశ్య కల్యాణ మండపం రోడ్లోకి వెళ్లి అక్కడ న్యూస్ పేపర్లు సర్దుకుంటున్న ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక ఏజెంట్ ఫణీంద్రను కర్రతో కొట్టి అతను సెల్ఫోన్ లాక్కుని పరారయ్యారు. కొత్తపేటలోని పశువుల ఆసుపత్రి రోడ్డులో పేపర్లు సర్దుకుంటున్న మరో ‘ఆంధ్రజ్యోతి’ ఏజెంట్ ఈశ్వర్పైనా దాడిచేసి అతని సెల్ ఫోను కూడా లాక్కుని పారిపోయారు. టూ టౌన్లో ఇద్దరు సెక్యూరిటీ గార్డులను హత్య చేసిన నిందితులే పాత గుంటూరు, కొత్తపేటల్లోనూ దాడులకు, చోరీలకు యత్నించినట్టు పోలీసులు తెలిపారు. క్లూస్ టీమ్తో పాటు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితుల్లో ఒకరిని కోబాల్డ్పేట, మరొకరిని స్వర్ణభారతినగర్ పరిధిలోని సుందరయ్యనగర్కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.