గుంటూరు రమేష్ హాస్పిటల్స్లో అరుదైన శస్త్రచికిత్స
ABN , First Publish Date - 2023-03-12T03:40:13+05:30 IST
మెదడుకు రక్తం సరఫరా చేసే కెరోటిడ్ ఆర్టరీ 90 శాతం పూడుకుపోయి ప్రాణాపాయ స్థితిలో వచ్చిన మహిళకు గుంటూరు రమేష్ హాస్పిటల్స్ వైద్య బృందం అరుదైన కెరోటిడ్ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ (కెరోటిడ్ బైపాస్) ఆపరేషన్ నిర్వహించారు.
మెదడు రక్తనాళానికి బైపాస్ సర్జరీ.. మన ప్రాంతంలో ఇదే తొలిసారి
గుంటూరు (మెడికల్) మార్చి 11: మెదడుకు రక్తం సరఫరా చేసే కెరోటిడ్ ఆర్టరీ 90 శాతం పూడుకుపోయి ప్రాణాపాయ స్థితిలో వచ్చిన మహిళకు గుంటూరు రమేష్ హాస్పిటల్స్ వైద్య బృందం అరుదైన కెరోటిడ్ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ (కెరోటిడ్ బైపాస్) ఆపరేషన్ నిర్వహించారు. ఇప్పటివరకు గుండెకు మాత్రమే చేస్తున్న బైపాస్ ఆపరేషన్ ను అరుదైన రీతిలో మెదడు రక్తనాళానికి చేయడం విశేషం. మన ప్రాంతంలో కెరోటిడ్ బైపాస్ సర్జరీ చేయడం ఇదే మొదటిసారని రమేష్ హాస్పిటల్స్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి.రమే్షబాబు వెల్లడించారు. శనివారం రమేష్ హాస్పిటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలను తెలిపారు. గుంటూరుకు చెందిన వాసిరెడ్డి సుజాత (69) ఈ ఏడాది జనవరిలో ఇంట్లో ఒక్కసారిగా కిందపడి స్పృహ కోల్పోయారు. కుటుంబీకులు ఆమెను రమేష్ హాస్పిటల్స్కు తెచ్చారు. ఆమెకు సీటీ బ్రెయిన్, ఎంఆర్ఐ యాంజియో వంటి పరీక్షలు నిర్వహించారు. మెదడుకు రక్తాన్ని తీసుకెళ్లే ధమనిలో 90 శాతం పూడికలు ఉన్నట్టు గుర్తించారు. దీనికి సాధారణంగా యాంజియోప్లాస్టి చేసి స్టెంట్ వేస్తారు. కాని ఈ మహిళ ధమనిలో క్యాల్షియం బాగా పేరుకుపోయి ఉండటంతో స్టెంట్ వేయడం వల్ల ప్రయోజనం ఉండదని భావించారు. ప్రత్యామ్నాయంగా కెరోటిడ్ బైపాస్ సర్జరీ చేయాలని నిర్ణయించారు. సీనియర్ కార్డియాలజిస్ట్ పీవీఎస్ హరిత, సీటీ సర్జన్ జయరాం పాయ్, చీఫ్ న్యూరాలజిస్ట్ కుమార్ వేలు, మత్తు వైద్యులు బికాస్ సాహుతో కూడిన వైద్యనిపుణుల బృందం అత్యంత క్లిష్టమైన కెరోటిడ్ బైపాస్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. ఆపరేషన్ అనంతరం రోగి కోలుకున్నారని, మూడో రోజు డిశ్చార్జి చేశామని డాక్టర్ రమే్షబాబు తెలిపారు. అరుదైన ఆపరేషన్ చేసిన వైద్య బృందాన్ని ఆయన అభినందించారు. ఆపరేషన్ చేసిన వైద్య బృందాన్ని సుజాత కుటుంబీకులు సత్కరించారు.