MLA Sridhar Reddy: 908 కోట్లకు టోకరా!

ABN , First Publish Date - 2023-07-21T02:43:43+05:30 IST

విజయ్‌ మాల్యా... నీరవ్‌ మోదీ... మెహుల్‌ చోక్సీ! బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి... విదేశాలకు చెక్కేసిన బడా వ్యాపార వేత్తలు వీళ్లు! ఇప్పుడు... ‘ఏపీ నీరవ్‌ మోదీ’ ఒకరు బయటపడ్డారు. బ్యాంకులను ఆయన రూ.908 కోట్లకు ముంచేశారు. ఆయనే... పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే దుద్దికుంట శ్రీధర్‌రెడ్డి! ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి సన్నిహితుడు!

MLA Sridhar Reddy: 908 కోట్లకు టోకరా!

అబ్యాంకులను గుల్ల చేసిన పుట్టపర్తి ఎమ్మెల్యే..

కుటుంబ సమేతంగా వందల కోట్ల అప్పులు

ఐపీ పెట్టేందుకు సిద్ధమవుతున్న ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి

వడ్డీతో కలిపి 908 కోట్లకు చేరిన రుణాలు

తిరిగి చెల్లించకుండా బ్యాంకులకు ముప్పుతిప్పలు

తెలంగాణలోని బ్యాంకుల నుంచే అప్పులు

వచ్చేనెలలో ఆస్తుల వేలానికి బ్యాంకుల నోటీసు

తనఖా పెట్టిన ఆస్తుల విలువ రూ.54 కోట్లే...

మరి.. వందల కోట్లు అప్పు ఎలా ఇచ్చారో!?

(అమరావతి-ఆంధ్రజ్యోతి): విజయ్‌ మాల్యా... నీరవ్‌ మోదీ... మెహుల్‌ చోక్సీ! బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి... విదేశాలకు చెక్కేసిన బడా వ్యాపార వేత్తలు వీళ్లు! ఇప్పుడు... ‘ఏపీ నీరవ్‌ మోదీ’ ఒకరు బయటపడ్డారు. బ్యాంకులను ఆయన రూ.908 కోట్లకు ముంచేశారు. ఆయనే... పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే దుద్దికుంట శ్రీధర్‌రెడ్డి! ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి సన్నిహితుడు! దుద్దికుంట శ్రీధర్‌ రెడ్డి 2014లో హిందూపురం లోక్‌సభ స్థానానికి వైసీపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. 2019లో పుట్టపర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన ఏపీ, తెలంగాణ, కర్ణాటకతోపాటు ఆఫ్రికాలోని ఉగాండాలోనూ కాంట్రాక్టులు, వ్యాపారాలు చేస్తున్నారు. బ్యాంకులకు ఆయన ‘మోస్ట్‌వాంటెడ్‌.’ ఆయన దర్శనం కోసం బ్యాంకర్లు కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తుంటారు. కానీ ఆయన చిక్కరు.. దొరకరు! వివిధ బ్యాంకులకు రూ.908.20కోట్ల రుణం ఎగవేశారు. రాజకీయ నేపథ్యం, సీఎంతో సాన్నిహిత్యం ఉండటంతో... శ్రీధర్‌ రెడ్డిని టచ్‌ చేసేందుకు బ్యాంకర్లు బెదిరిపోతున్నారు. ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి 2014కు ముందే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. అయినప్పటికీ బ్యాంకులు ఏం చూసి అన్ని వందలకోట్లు అప్పుగా ఇచ్చాయి? ఆ డబ్బులను ఆయన ఎక్కడ పెట్టుబడులు పెట్టారు? బ్యాంకులకు తిరిగి చెల్లించకుండా ఎందుకు మొఖం చాటేస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాల్లేవ్‌!

ఇవీ మూలాలు...

శ్రీధర్‌ రెడ్డిది ఉమ్మడి అనంతపురం జిల్లా నల్లమాడ మండలం నల్లసింగయ్యగారి పల్లి స్వగ్రామం. ఆయన తల్లి స్వగ్రామం కడప జిల్లా పులివెందులలోని బలపనూరు! వైఎస్‌ రాజశేఖరరెడ్డిది కూడా ఇదే ఊరు. శ్రీధర్‌ రెడ్డి తొలుత కస్టమ్స్‌ విభాగంలో ఇన్‌స్పెక్టర్‌గా ఉన్నారు. ఉద్యోగం వదిలేసి కాంట్రాక్టులు, వ్యాపారాలు మొదలుపెట్టారు. భారీస్థాయి బ్యాంకు రుణాలు తీసుకొని వివిధ రాష్ట్రాల్లో కాంట్రాక్టులు చేపట్టారు. వైసీపీలో చేరి... కీలకనేతగా మారారు. 2014లో హిందూపురం ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. 2019లో పుట్టపర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రాంతంలో సోలార్‌ ప్రాజెక్టు నెలకొల్పారు. ఆయనకు ఎస్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌ పేరిట కంపెనీ ఉంది. ప్రస్తుతం ఇది సాయిసుధీర్‌ ఇన్‌ఫ్రాగా మారినట్లు తెలిసింది. తెలంగాణలోని బ్యాంకుల నుంచి శ్రీధర్‌రెడ్డి భారీగా అప్పులు తీసుకున్నారని... వడ్డీతో కలిపి ఆ మొత్తం 908కోట్లకు చేరిందని బ్యాంకింగ్‌ వర్గాలు చెబుతున్నాయి. రుణాల కోసం తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేస్తామని నోటీసు ఇచ్చినా స్పందించలేదని తెలిసింది. ఇదే విషయాన్ని రిజర్వ్‌ బ్యాంకుకు నివేదించినట్లు తెలిసింది. తనఖా పెట్టిన ఆస్తులను తక్షణమే వేలం వేయాలని ఆర్‌బీఐ ఆదేశించినట్లు తెలిసింది. ఈ ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతను కెనరా బ్యాంకుకు అప్పగించారు.

వచ్చేనెల 18న ఆస్తులు ఈ-వేలం

ఎమ్మెల్యే తనఖా పెట్టిన ఆస్తులపై అధ్యయనం పూర్తిచేసి వాటి భౌతిక స్థితిని గుర్తించాక వేలం ప్రక్రియను ప్రారంభించారు. ఆస్తులు వేలం వేయాలని గత నెల 30న నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఈ నెల 2న అధికారిక ప్రకటన చేశారు. ఆ తర్వాత కూడా ఎమ్మెల్యే స్పందించడం లేదని బ్యాంకింగ్‌ వర్గాలు తెలిపాయి. తనఖా పెట్టిన ఆస్తుల్లో ఎక్కువగా రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లోని భూములు ఉన్నాయి. కర్ణాటకతో పాటు అనంతపురం జిల్లాలో ఇంజనీరింగ్‌ కంపెనీ పేరిట ఉన్న ఆస్తులను ఆగస్టు 18న ఇ-వేలం వేస్తామని కెనరా బ్యాంకు ఇచ్చిన నోటీసులో పేర్కొంది. అయితే ఈ ఆస్తుల విలువ రూ.54.73 కోట్లు మాత్రమే. కాగా, రుణాల ఎగవేతకు సిద్ధపడ్డ ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి ఐపీ పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది!

Updated Date - 2023-07-21T02:43:43+05:30 IST