దళిత క్రైస్తవులకు దగా!
ABN , First Publish Date - 2023-03-25T02:41:38+05:30 IST
రాష్ట్రంలోని దళిత క్రైస్తవులను దగా చేసేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్రప్రభుత్వం సాధ్యం కాదని తేల్చి.. సుప్రీంకోర్టులో ప్రస్తుతం నలుగుతున్న దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర అసెంబ్లీ వేదికగా మభ్యపెట్టే ప్రకటన చేసింది.
ఎస్సీ రిజర్వేషన్ కల్పన పేరిట సరికొత్త మోసం
హడావుడిగా అసెంబ్లీలో తీర్మానం.. కేంద్రానికి పంపిస్తున్నామన్న సీఎం
ఇప్పటికే అది సాధ్యం కాదన్న కేంద్రం.. సుప్రీంకోర్టులో అఫిడవిట్
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలోని దళిత క్రైస్తవులను దగా చేసేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్రప్రభుత్వం సాధ్యం కాదని తేల్చి.. సుప్రీంకోర్టులో ప్రస్తుతం నలుగుతున్న దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర అసెంబ్లీ వేదికగా మభ్యపెట్టే ప్రకటన చేసింది. శాసనసభ బడ్జెట్ సమావేశాల చివరిరోజున హడావుడిగా తీర్మానం చేసిం ది. దానిని కేంద్రానికి పంపిస్తున్నామని ప్రకటించింది. సాధ్యం కాని వాటిని, తమ పరిధిలో లేని వాటికి తీర్మానాలు చేయడం రాష్ట్ర సర్కారుకు మామూలు వ్యవహారమైపోయింది. ఏదో ఒక కాగితం రాసి తాము చేశామంటూ జనాలను నమ్మించడం తప్ప వైసీపీ సర్కార్ ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో దిశ చట్టం పేరిట చేసిన హడావుడిని ఎస్సీ రిజర్వేషన్ల విషయంలోనూ మొదలుపెట్టారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి దళిత క్రిస్టియన్లను, దళిత ముస్లింలను ఎస్సీలుగా గుర్తించి.. ఆ మేరకు రిజర్వేషన్లు వర్తింపచేయాలనే అంశం దశాబ్దాలుగా చర్చలో ఉంది. దీనిపై క్రైస్తవ సంఘాలు ఏళ్ల తరబడి పోరాటాలు చేస్తూనే ఉన్నాయి. హిందూమతానికి చెందిన దళితులు.. క్రైస్తవ మతం స్వీకరిస్తే వారిని వెనుకబడిన తరగతి వర్గాల(బీసీ-సి) కింద పరిగణించాలని చట్టం చెబుతోంది. ఈ చట్టం మొదట్నించీ అమల్లో ఉన్నప్పటికీ చాలా రాష్ట్రాలు అమ లు చేయడం లేదు. ఎక్కడైనా కోర్టుల్లో కేసులు పడినప్పుడు మాత్రమే దానిని అమలు చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చట్టానికి పదును పెంచింది.
దళితులెవరైనా క్రైస్తవ మతం స్వీకరిస్తే వారికి ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వరాదంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాస్తోంది. అలా సర్టిఫికెట్లు పొందిన కేసులకు సంబంధించి కేంద్ర అధికారుల ఒత్తిడి నేపఽథ్యంలో మన రాష్ట్రంలో బాపట్లలో పోలీసులు చర్యలు కూడా తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఈ చట్టం పటిష్టంగా అమలు చేసేందుకు కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిత శాఖ చర్యలు తీసుకుంది. అయితే మన రాష్ట్రంలో ఈ చట్టం అమలు చేసిన పరిస్థితులు కూడా పెద్దగా లేవు. క్రైస్తవ సంఘాలు ఎప్పటి నుంచో ముఖ్యమంత్రి జగన్కు దీనిపై విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నాయి. నాలుగేళ్లుగా ఈఅంశంపై ఒక్కమాట కూడా మాట్లాడని జగన్, ఎన్నికలకు ఒక ఏడాది ముందు హడావుడిగా దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేయించడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ క్రైస్తవ కోటా విషయంలో సానుకూలంగా లేదన్న విషయం జగన్కు కూడా తెలుసు. నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే జగన్ ఇటీవల ప్రధానమంత్రి మోదీని కలిసినప్పుడు ఈ అంశంపై ఎందుకు చర్చించలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.
సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసులు..
పలు దళిత, క్రైస్తవ సంఘాలు ఈ అంశంపై సుప్రీంకోర్టులో ఇప్పటికే పలు వ్యాజ్యాలు దాఖలు చేశాయి. ఈ ఏడాది జనవరి 19న సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. 2007లో జస్టిస్ రంగనాథ మిశ్రా కమిషన్ దళిత క్రిస్టియన్, దళిత ముస్లింలకు రిజర్వేషన్ ఫలాలు అందించాలంటూ సిఫారసు చేస్తూ ఇచ్చిన నివేదికను తిరస్కరించింది. ఆ నివేదిక లోపభూయిష్టమంటూ తోసిపుచ్పింది. ఈ అంశంపై తాము జస్టిస్ కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలో కమిషన్ను గత అక్టోబర్లో ఏర్పాటు చేసినట్టు చెప్పింది. రెండేళ్లలో ఈ కమిషన్ తన నివేదిక ఇస్తుందని కోర్టుకు కేంద్రం తెలిపింది. రాజ్యాంగంలోని క్లాజ్ 3 ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ను హిందూమతంలోని అంటరానితనం, వివక్షకు గురైన ఎస్సీ, ఎస్టీ వర్గాలకు వర్తింపచేయాల్సి ఉంటుందని తన అఫిడవిట్లో పేర్కొంది. ఇదీ వాస్తవం. ఇందుకు భిన్నం గా జగన్ క్రిస్టియన్లను మభ్యపెట్టేందుకే.. కేంద్రానికి తీర్మానం చేసి పంపుతున్నామని ప్రకటించారని పలువురు విమర్శించారు.
‘దిశ’కు దిక్కు లేదు...
తెలంగాణలో ఒక ఘటనను ఆసరా చేసుకుని రాష్ట్ర అసెంబ్లీలో ‘దిశ’ బిల్లును జగన్ ప్రవేశపెట్టించారు. దీనిపై తీర్మానం చేయించి కేంద్రానికి పంపించారు. ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం తిరుగు టఫాలో వెనక్కి పంపింది. రాష్ట్రంలో ఆ చట్టం అమల్లో లేదు. అయినా రాష్ట్ర ప్రభుత్వం దిశచట్టం అమలవుతున్నట్లు, దిశ పోలీసుస్టేషన్లు ఏర్పాటు చేశామంటూ బడ్జెట్ ప్రసంగంలోనూ ఆర్భాటాలు చేసింది. గ్రామ పంచాయతీల్లో మొక్కలు పెంపకం విషయంలో సర్పంచ్లను బాధ్యులను చేస్తూ అసెంబ్లీలో చట్టం చేశారు. మొక్కలను 80 శాతం సంరక్షించకపోతే సర్పంచ్లను తొలగిస్తామని చెప్పారు. కానీ, ఒక్క సర్పంచ్పైనా ఈ చట్టం అమలైన దాఖలాల్లేవు. 70 శాతం స్థానికులకు పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇవ్వాలని ఏకంగా చట్టమే చేశారు. రాష్ట్రంలో ఎక్కడా ఈ చట్టాన్ని అమలు చేయడం లేదు. కాంట్రాక్టు పనుల్లో 50 శాతం మహిళలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు నామినేటెడ్ కింద కల్పించాలని ఆర్భాటంగా చట్టం చేశారు. ఒక్కరికూడా నామినేటెడ్ పనులు అప్పగించలేదు.