కొండను కొల్లగొట్టి..
ABN , First Publish Date - 2023-03-31T00:42:02+05:30 IST
పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం గ్రామంలో క్రౌంచగిరి పుణ్యక్షేత్రంపై సాక్షాత్తు కలియుగదైవం వేంకటేశ్వరస్వామి స్వయంభువుగా వెలిశారని భక్తుల నమ్మకం.
అమరావతి, మార్చి30: పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం గ్రామంలో క్రౌంచగిరి పుణ్యక్షేత్రంపై సాక్షాత్తు కలియుగదైవం వేంకటేశ్వరస్వామి స్వయంభువుగా వెలిశారని భక్తుల నమ్మకం. క్రౌంచగిరిని చుట్టూ పవిత్ర కృష్ణమ్మ ప్రవహిస్తూ ఉత్తరవాహిని తీర్ధంగా పేరుగాంచింది. ఇంతటి ప్రసిద్ధి చెందిన ఆలయం ఉన్న కొండపై అక్రమార్కులు కన్నేశారు. కొండకు వాయువ్య భాగాన వందలసంఖ్య లారీలతో గ్రావెల్ క్వారీయింగ్ చేసి తరలిస్తున్నారు. వైకుంఠపురం ఇసుకరీచ్ అనుమతి పొందిన కాంట్రాక్టర్లు, అధికారపార్టీ నాయకులు ఇసుకరీచ్లో రహదారుల నిర్మాణానికి ఈ కొండ నుంచి గ్రావెల్ తవ్వి తరలిస్తున్నారు. గతంలో అనేకసార్లు గ్రావెల్ క్వారీయింగ్పై ఆంధ్రజ్యోతిలో కథనాలు రావడంతో కొంతకాలం నిలుపుదల చేశారు. అయితే గత కొన్నినెలలుగా ఇసుకరీచ్ నిర్వహిస్తున్న సంస్థ ప్రతినిధులు, ప్రస్తుతం రీచ్ నిర్వహిస్తున్న అధికారపార్టీ నాయకులు కొండను ఎక్స్వేటర్స్తో గ్రావెల్ను తవ్వి నదిలో వాహనాల రాకపోకలకు తరలించారు. వైకుంఠపురం బ్యారేజి నిర్మాణానికి అప్పటి సీఎం చంద్రబాబునాయుడు శంఖుస్థాపన చేసిన శిలాఫలకం ఇక్కడ ఉంది. గతంలో కృష్ణానదికి వరదలు వచ్చిన సమయంలో ఈ క్రౌంచగిరి తుళ్లూరు మండలంలోని గ్రామాలకు ముంపు వాటిల్లకుండా రక్షణ గోడగా నిలిచింది. అలాంటి కొండకు గ్రావెల్ క్వారీయింగ్ చేస్తున్నా అధికారులకు, ప్రజాప్రతినిధులకు చీమకుట్టినట్లు కూడా లేదని స్థానికులు అంటున్నారు.