కల్తీ మాటలతో రైతులను మభ్యపెడుతున్న ప్రభుత్వం
ABN , First Publish Date - 2023-06-05T00:28:24+05:30 IST
జగన్ ప్రభుత్వం కల్తీ మాటలతో రైతులను మభ్యపెట్టి వారి బతుకుల్లో మట్టి కొడుతుందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. ఆదివారం చుండూరు మండలం పెదగాదెలవర్రులో ఏరువాక పౌర్ణమి ఉత్సవాలను ఆయన ప్రారంభించారు.
మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
పెదగాదెలవర్రులో ఏరువాక పౌర్ణమి ఉత్సవాలు
చుండూరు, జూన్ 4: జగన్ ప్రభుత్వం కల్తీ మాటలతో రైతులను మభ్యపెట్టి వారి బతుకుల్లో మట్టి కొడుతుందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. ఆదివారం చుండూరు మండలం పెదగాదెలవర్రులో ఏరువాక పౌర్ణమి ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ జగన్ పాలనలో రైతులకు కష్టాలు, అప్పులే మిగిలాయన్నారు. రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే మన రాష్ట్రం మూడో స్థానంలోనూ, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉందన్నారు. ఎక్కువ అప్పులున్న రైతు కుటుంబాల్లో రాష్ట్రం మొదటి స్ధానంలో ఉందని తెలిపారు. ఇప్పటికే మూడు వేల మంది రైతులు రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇవన్ని అధికారిక లెక్కలు చెబుతున్నాయన్నారు. రైతుల సంక్షేమ విషయంలో చంద్రబాబు ఎంత ముందు చూపుతో వ్యవహరించారనీ, ఇరిగేషన్కు చంద్రబాబు రూ.68వేల కోట్లు ఖర్చు చేస్తే జగన్రెడ్డి రూ.20 వేల కోట్లు కేటాయించాడని, టీడీపీ ప్రభుత్వం రైతులకి 30 వేల ట్రాక్టర్లు పంపిణీ చేస్తే జగన్ 3 వేల ట్రాక్టర్లు పంపిణీ చేసి సరిపుచ్చుకున్నాడని అన్నారు. రాష్ట్రంలో 15 లక్షల మంది కౌలు రైతులు ఉంటే లక్ష మందికి మాత్రమే ఈ ప్రభుత్వం రైతు భరోసా అందించింది. వైకాపా ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల్లో కల్పిస్తానని చెప్పిన సదుపాయాల్లో 90 శాతం నేటికి నెరవేర్చలేదని ఆనందబాబు తెలిపారు. రూ.3 వేల కోట్లతో ధరల స్ధిరీకరణ నిధిని, 4 వేల కోట్లతో ప్రకృతి విఫత్తు నిధిని ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటానని చెప్పిన జగన్ ఆ సంగతి ఎప్పడో మరచిపోయాడు. ఇటీవల అకాల వర్షాలు, విఫత్తులతో రైతులు తీవ్రంగా నష్టపోయి కొన్ని చోట్ల ఆత్మహత్యలకు కూడా పాల్పడితే జగన్రెడ్డి తన రాజకోటను వదిలి పొలాల్లోని రైతులను పరామర్శించిన పాపాన పోలేదు. రైతులను అడుగడుగునా మోసం చేస్తున్న జగన్ పాలనకు చరమ గీతం పాడటానికి రైతులు సిద్ధంగా ఉన్నారని ఆనందబాబు తెలిపారు. ఈ ఏరువాక పౌర్ణమి కార్యక్రమం సందర్భంగా చంద్రబాబు చిత్రపటానికి ఆనందబాబు ధాన్యాభిషేకం చేశారు.