గుంటూరు చానల్ను పర్చూరు వరకు పొడిగించాలి
ABN , First Publish Date - 2023-02-10T00:28:27+05:30 IST
గుంటూరు చానల్ను పర్చూరు వరకు పొడిగించాలని కోరుతూ అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కె.ఎ్స.లక్ష్మణరావు గురువారం కలెక్టర్ కె.విజయకృష్ణన్కు వినతిపత్రం అందజేశారు.
కలెక్టర్ కె.విజయకృష్ణన్కు ఎమ్మెల్సీ లక్ష్మణరావు వినతి
బాపట్ల, ఫిబ్రవరి 9: గుంటూరు చానల్ను పర్చూరు వరకు పొడిగించాలని కోరుతూ అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కె.ఎ్స.లక్ష్మణరావు గురువారం కలెక్టర్ కె.విజయకృష్ణన్కు వినతిపత్రం అందజేశారు. 50గ్రామాల ప్రజలకు తాగునీరు, సాగునీరు అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని చానల్ను పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. 85 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు సాగు, తాగు నీటి కోసం పోరాటం చేస్తూనే ఉన్నారన్నారు. కరువు, వరదలకు ప్రసిద్ధి చెందిన ఈప్రాంతం పూర్తిగా వర్షాధారంపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారన్నారు. భూగర్భజలాలు కూడా లేక బోరులు వేసినా ఉప్పునీరు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణానదికి 40మైళ్ళ దూరంలో అతి దగ్గరగా ఉన్న ఈ ప్రాంతం పాలకుల నిర్లక్ష్యానికి గురైందన్నారు. నల్లమడ వాగులోకి ఎప్పుడైన వచ్చే సాగర్ మురుగునీరు, కలుషితనీటిపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 1936 నుంచి పెదనందిపాడు హైలెవల్ ఛానల్ నిర్మిస్తామని ప్రభుత్వాలు వాగ్దానాలు చేస్తూనే ఉన్నాయన్నారు. ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు ఇవ్వాలని బ్రిటీష్ ప్రభుత్వం 1936లో నిర్ణయించిందన్నారు. 2వ పంచవర్ష ప్రణాళికలో పెదనందిపాడు హైలెవల్ చానల్ నిర్మాణాన్ని చేర్చి నిధుల కొరత పేరుతో చివరి నిమిషంలో తొలగించారని వివరించారు. 1961లో అసెంబ్లీ తీర్మానం చేసి ఆమోదించారన్నారు. వై.ఎ్స.రాజశేఖరరెడ్డి పత్తిపాడులో 2006లో జరిగిన సభలో మెట్ట ప్రాంతాలకు నీరు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అదేవిధంగా ఈ ఏడాది జనవరి 1వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి కూడా మరోసారి హామీనిచ్చారని కాబట్టి హామీ అమలు జరిగేవిధంగా చూడాలని కోరారు.
కార్యక్రమంలో నల్లమడ రైతు సంఘం నాయకులు నరిశెట్టి ఆచార్యులు, ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం జిల్లా కార్యదర్శి రామారావు, సీపీఎం కార్యదర్శి సీహెచ్ గంగయ్య, ఎల్వీ నాగేశ్వరరావు, జగన్నాధం, నర్రా శ్రీను, మానం సాంబశివరావు, చెన్నుపాటి కిషోర్, ముద్దన విజయ్ తదితరులు ఉన్నారు.