సీఎంవోకు ఫైనాన్స్ కమిషన్ ఫైల్
ABN , First Publish Date - 2023-02-21T03:23:54+05:30 IST
స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటుకి సంబంధించి దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) సోమవారం హైకోర్టులో విచారణకు వచ్చింది.
స్పష్టత కోసం గవర్నరే పంపించారు.. హైకోర్టుకు వెల్లడి
అమరావతి, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటుకి సంబంధించి దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) సోమవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎ స్జీపీ) ఎస్. సుమన్ స్పందిస్తూ.. కమిషన్ ఏర్పాటు విషయంలో కొన్ని అంశాలపై స్పష్టత కోరుతూ సంబంధిత ఫైలును ఈ నెల 18న గవర్నర్.. ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపారని తెలిపారు. పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచేందుకు సమయం ఇవ్వాలని కోరారు. ఆ వాదనలు నమోదు చేసిన ధర్మాసనం, తదుపరి విచారణ నాటికి కమిషన్ ఏర్పాటు పురోగతిని న్యాయస్థానం ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. విచారణను 4వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్. జయసూర్యతో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలిచ్చింది. స్టేట్ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ.. టీడీపీ అధికార ప్రతినిధి, న్యాయవాది వెంకటరెడ్డి హైకోర్టులో పిల్ వేశారు.