డీవీసీ హాస్పిటల్‌లో అత్యాధునిక కార్డియో వైద్య సేవలు

ABN , First Publish Date - 2023-04-11T23:34:07+05:30 IST

గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటుచేసిన డీవీసీ హాస్పిటల్‌లో అత్యాధునిక కార్డియాలజి వైద్యసేవలు అందుబాటులో ఉంచడం అభినందనీయమని ఆయుష్‌ హాస్పిటల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌చౌదరి అన్నారు.

డీవీసీ హాస్పిటల్‌లో అత్యాధునిక కార్డియో వైద్య సేవలు
సమావేశంలో మాట్లాడుతున్న ఆయుష్‌ హాస్పిటల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌చౌదరి

అనతి కాలంలోనే వెయ్యి కార్డియాలజి చికిత్సలు

డాక్టర్‌ శ్రీనివాస్‌చౌదరి

చేబ్రోలు, ఏప్రిల్‌ 11: గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటుచేసిన డీవీసీ హాస్పిటల్‌లో అత్యాధునిక కార్డియాలజి వైద్యసేవలు అందుబాటులో ఉంచడం అభినందనీయమని ఆయుష్‌ హాస్పిటల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌చౌదరి అన్నారు. డీవీసీ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో కార్డియాలజి విభాగంలో వెయ్యి కేసులు చికిత్సలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. డాక్టర్‌ శ్రీనివాస్‌చౌదరి మాట్లాడుతూ డీవీసీ హాస్పిటల్‌, ఆయుష్‌ హాస్పిటల్‌ సంయుక్తంగా కార్డియాలజి సేవలను గ్రామీణ ప్రాంతంలో అందిస్తున్నట్లు చెప్పారు. కేవలం మెట్రోపాలిటిన్‌ నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉండే అత్యాధునిక క్యాథల్యాబ్‌లు, వైద్యసేవలు డీవీసీ హాస్పిటల్‌ సమకూర్చుకుని నిరుపేదలకు అత్యుత్తమ వైద్యాన్ని ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తుందన్నారు. ఇటీవల 65 ఏళ్ల వ్యక్తి గతంలో బైపాస్‌ చేయించుకుని తిరిగి తీవ్ర హార్ట్‌ ఎటాక్‌కు గురయ్యాడరన్నారు. అతనికి వైద్యం అందించడాన్ని సవాల్‌గా తీసుకుని డీవీసీ హాస్పిటల్‌లో చికిత్సను అందించినట్లు చెప్పారు. ఒకసారి బైపాస్‌ సర్జరి చేయించుకున్న వారికి రెండోసారి బైపాస్‌ చేసే అవకాశం లేకున్నా.. డీవీసీ హాస్పిటల్‌లో అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్య సదుపాయాలను వినియోగించుకుని క్లిష్టతరమైన విధానం ద్వారా రోగికి చికిత్స అందించినట్లు చెప్పారు. దీనివలన ఏడు రోజుల్లో సదరు రోగి పూర్తిగా కోలుకుని డిస్చార్జ్‌ అయినట్లు తెలిపారు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ముందస్తు మెడికల్‌ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. షుగర్‌, బీపీ, థైరాయిడ్‌ వంటి సమస్యలున్న వారిలో కరోనా తదనంతర కాలంలో హార్ట్‌ ఎటాక్‌లు, పక్షవాతాలకు గురవుతున్నట్లు భావిస్తున్నట్లు చెప్పారు. ఛాతి నొప్పిని ఎక్కువ మంది గ్యాస్‌ నొప్పిగా భావించి నిర్లక్ష్యం చేయడం వలన ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న హాస్పిటల్‌ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలు, జిల్లాలోని పాడి రైతుల కోసం అత్యాధునిక కార్పొరేట్‌ వైద్యాన్ని తక్కువ ధరకు అందించాలనే లక్ష్యంతో ధూళిపాళ్ల వీరయ్యచౌదరి ట్రస్టు ద్వారా హాస్పిటల్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. చిన్నజీయర్‌స్వామి చేతులమీదుగా ప్రారంభమైన డీవీసీ హార్ట్‌ కేర్‌ సెంటర్‌ వెయ్యి చికిత్సలు పూర్తవడం సంతోషించదగ్గ పరిణామమన్నారు. కరోనా సమయంలో పేదలకు అత్యుత్తమ వైద్య సేవలను అందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్డియాలజి విభాగం వైద్యులు డాక్టర్‌ రాంకిషోర్‌,

డాక్టర్‌ రఘురాం, డాక్టర్‌ సుదర్శన్‌, హాస్పిటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ధూళిపాళ్ల జ్యోతిర్మయి, మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ చల్లగండ్ల శ్రీనివాస్‌, చీఫ్‌ ఆపరేషనల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కరణం నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-11T23:34:07+05:30 IST