జూన్ 20 నుంచి సీపీఎం మహాపాదయాత్ర
ABN , First Publish Date - 2023-05-28T04:03:35+05:30 IST
పోలవరం నిర్వాసితులకు పూర్తిస్థాయి పునరావాసం కల్పించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.
● పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారమే లక్ష్యం
● కార్యదర్శి వర్గంలోకి రాంభూపాల్, వీ ఉమామహేశ్వరరావు
అమరావతి, మే 27(ఆంధ్రజ్యోతి): పోలవరం నిర్వాసితులకు పూర్తిస్థాయి పునరావాసం కల్పించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. రానున్న వర్షాకాలంలో మరోసారి గోదావరి వరదలు ముంచెత్తే ప్రమాదం ఉన్నందున సహాయ కార్యక్రమాల కోసం ముందస్తు చర్యలు చేపట్టి యంత్రాంగాన్ని సమాయత్తం చేయాలని సూచించింది. శుక్రవారం విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు శనివారం మీడియాకు వెల్లడించారు. ‘‘గత జూలైలో వచ్చిన వరదల నుంచి ఆ ప్రాంత ప్రజలు ఇంతవరకు కోలుకోలేదు. వారందరికీ నష్టపరిహారం చెల్లించడంతోపాటు ఈ ఏడాది సెప్టెంబరు నాటికి 18 ఏళ్లు నిండిన వారందరికీ పునరావాస ప్యాకేజీ అందించాలి. ఈ డిమాండ్ల సాధన కోసం జూన్ 20 నుంచి విజయవాడకు మహా పాదయాత్ర నిర్వహించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది’’ అని శ్రీనివాసరావు తెలిపారు. కాగా, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గంలోకి కొత్తగా వీ రాంభూపాల్, వీ ఉమామహేశ్వరరావును తీసుకున్నారు. ఇప్పటివరకు ఆహ్వానితులుగా ఉన్న కిల్లో సురేంద్ర, కే సుబ్బరావమ్మను పూర్తిస్థాయి కార్యదర్శివర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఇంతవరకు రాష్ట్ర కమిటీ ఆహ్వానితులుగా ఉన్న కే ఉమామహేశ్వరరావు, అల్లూరి సీతారామరాజు జిల్లా పార్టీ కార్యదర్శి పి.అప్పలనర్స, ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవిలను రాష్ట్ర కమిటీ సభ్యులుగా కో–ఆప్ట్ చేసుకున్నారు.