కక్షసాధింపులు ఆపాలి
ABN , First Publish Date - 2023-03-05T03:38:24+05:30 IST
జగన్ ప్రభుత్వం ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు ఆపకపోతే ప్రతిఘటన తప్పదని వామపక్ష పార్టీలు హెచ్చరించాయి.
లేదంటే ప్రతిఘటన తప్పదు: వామపక్షాలు
అమరావతి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): జగన్ ప్రభుత్వం ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు ఆపకపోతే ప్రతిఘటన తప్పదని వామపక్ష పార్టీలు హెచ్చరించాయి. ఉపాధ్యాయులు, ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా ఈనెల 9, 10 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేయాలని తమ పార్టీల శ్రేణులకు పిలుపునిచ్చాయి. ఈ మేరకు సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, వి.శ్రీనివాసరావు శనివారం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ప్రభుత్వం వేధింపులకు స్వస్తి చెప్పి, వారికి సకాలంలో జీతాలు చెల్లించాలని, సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీఈఆర్టీ డైరెక్టరు ప్రతాప్రెడ్డి, కడప ఆర్జేడీ సహా మరికొందరు ఉన్నతాధికారులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతుంటే కట్టడి చేయలేని ప్రభుత్వం.. ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదంటూ ఆదేశించడం దుర్మార్గమైన చర్య అని ఖండించారు.
రామలక్ష్మి మృతికి సంతాపం
రచయిత్రి, ఆరుద్ర సతీమణి కూచి రామలక్ష్మి మృతికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు సంతాపం ప్రకటించారు. అనేక కథలు, నవలలు, విమర్శనా వ్యాసాలతోపాటు పలు తెలుగు సినిమాల కు కథలు, మాటలు అందించిన రామలక్ష్మి తన రచన లలో అంతర్లీనంగా స్త్రీ వాదాన్ని బలంగా వ్యక్తపరిచే వారని పేర్కొన్నారు. ఆమె మృతి సాహిత్య రంగానికి తీరని లోటని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.