ఆంధ్రుల సంపద అమరావతి
ABN , First Publish Date - 2023-01-18T00:59:12+05:30 IST
అమరావతి ఆంధ్రుల సంపద అని 33 వేల ఎకరాల భూములిచ్చిన రైతులు తెలిపారు.
తుళ్లూరు, జనవరి 17: అమరావతి ఆంధ్రుల సంపద అని 33 వేల ఎకరాల భూములిచ్చిన రైతులు తెలిపారు. నేటి పాలకులు రాజధానిని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ రైతులు, మహిళలు, రైతు కూలీలు చేస్తున్న ఆందోళనలు మంగళవారం 1,127వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ నేటి ప్రభుత్వం మానవత్వం లేకుండా పరిపాలన చేస్తోందన్నారు. గత ప్రభుత్వంలో శరవేగంగా నిర్మాణ జరుగుతున్న రాజధాని అమరావతిని, ఆ తర్వాత సీఎం జగన్రెడ్డి మూడు ముక్కల ఆటతో ఆపేశారని ఆరోపించారు. ప్రత్యేక హోదాను తెస్తామని చెప్పి దాని ఊసే లేకుండా చేశార న్నారు. మూడు రాజఽధానుల పేరుతో ఐదు కోట్ల మంది తెలుగు ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధిపొందాలని చూడవద్దన్నారు. అభివృద్ధి కోసం పాటుపడాలని విన్నవించారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. బిల్డ్ అమరావతి అంటూ దీపాలు వెలిగించి నినాదాలు చేశారు. రాజధాని 29 గ్రామాలతో పాటు, తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లో అమరావతి రైతులకు మద్దతుగా దీక్షలు చేశారు.