న్యాయం రైతుల పక్షానే ఉంది
ABN , First Publish Date - 2023-05-02T00:42:50+05:30 IST
రాజధానికి భూములు ఇచ్చిన రైతుల పక్షానే న్యాయం ఉందని రైతులు, రైతుకూలీలు, మహిళలు పేర్కొన్నారు.
తుళ్లూరు(తాడికొండ)మే 1:: రాజధానికి భూములు ఇచ్చిన రైతుల పక్షానే న్యాయం ఉందని రైతులు, రైతుకూలీలు, మహిళలు పేర్కొన్నారు. బిల్డ్ అమరావతి-సేవ్ అమరావతి పేరిట రాజధానిగ్రామాల్లో 1231 రోజులుగా రైతులు, రైతు కూలీలు, మహిళలు సోమవారం నిరసనలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తానని, ఉద్యోగులకు ఐఆర్, సీపీఎస్ రద్దు, నవరత్నాల అమలు, ఇసుక కొరత కారణంగా లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ఆంధ్రరాష్ట్రానికి నేనున్నానని చెప్పిన మోదీ ఇప్పుడు మూడు రాజధానుల ప్రకటన చేసిన తరువాత ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. జగన్మోహనరెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో తప్పుడు ఫిర్యాదులు చేశారన్నారు. రాజధానిలో పంట పోలాలను తగులబెట్టించారు. ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాయటం, హైకోర్టు, సుప్రీంకోర్డుల్లో వైసీపీ నేతలచే కేసులు వేయించారని గుర్తు చేశారు. రాజధానిగా అమరావతి ఉండటం జగన్మోహనరెడ్డికి మొదటి నుంచి ఇష్టం లేదని, ప్రజలను మోసం చేయటానికి తాడేపల్లిలో ఇల్లు నిర్మించుకున్నారని విమర్శించారు. అధికారం చేతికి రాగానే మూడు రాజధానులంటూ రాగం తీస్తున్నారని పేర్కొన్నారు. రాజధాని గ్రామాలైన తుళ్లూరు, వెలగపూడి, మందడం, దొండపాడు, నెక్కల్లు, వెంకటపాలెం తదితర గ్రామాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి.