బ్యాంక్ గ్యారెంటీ ల గోల్మాల్
ABN , First Publish Date - 2023-06-02T04:20:28+05:30 IST
రోడ్లు భవనాల శాఖలో పెద్దగా పనులు, బడ్జెట్ లేకున్నా... తరచూ అవినీతి, అక్రమాలు, నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
● ఆర్అండ్బీలో నిధులు పక్కదారి
● సీఎం సహా విభాగాధిపతులకు ఫిర్యాదు
● ఎస్ఈ సొంతఖాతాకు
మళ్లించారని ఆరోపణలు
● ఫిర్యాదును పక్కనపడేసిన ఆర్అండ్బీ
● శాఖాపరమైన విచారణ బుట్టదాఖలు
(అమరావతి–ఆంధ్రజ్యోతి)
రోడ్లు భవనాల శాఖలో పెద్దగా పనులు, బడ్జెట్ లేకున్నా... తరచూ అవినీతి, అక్రమాలు, నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ శాఖలో తాజాగా మరో వివాదం రాజుకుంటోంది. బ్యాంక్ గ్యారెంటీల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలు చుట్టుముట్టాయి. నెల్లూరు కేంద్రంగా బ్యాంక్ గ్యారెంటీల గోల్మాల్ జరిగిందని ఆరోపిస్తూ వైఎస్ఆర్ యూత్ ఫోర్స్ పేరిట ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు పంపించిన లే ఖ ఈ వివాదానికి ఆజ్యం పోసింది. రూ.43 కోట్ల వర్క్కు సంబంధించిన బ్యాంక్ గ్యారెంటీలను ఓ సూపరింటెండెంట్ ఇంజనీర్ విత్డ్రా చేసి, తన సొంత ఖాతాలో వేసుకుని వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని ఆ ఫిర్యాదులో ఆరోపించారు. ఈ విషయం వెలుగుచూడటంతో ఓ ఉన్నతాధికారి సహకారంతో తిరిగి డబ్బులు సర్దుబాటు చేసి, ప్రభుత్వ ఖాతాలో జమ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. కాగా ఈ ఫిర్యాదు ఆర్అండ్బీ ముఖ్యకార్యదర్శి, ఈఎన్సీ, ఇతర అధికారులకు కూడా అందింది. సరైన అడ్రస్, ఇతర సమాచారం లేకుండా వచ్చిన ఫిర్యాదుగా పరిగణించి పక్కన పడేసినట్లు ఉన్నతాధికార వర్గాల ద్వారా తెలిసింది. ఆ ఫిర్యాదులోని అంశాలను నిశితంగా పరిశీలిస్తే ఆర్అండ్బీ నెల్లూరు సర్కిల్ వ్యవహారాలు బాగా తెలిసిన వారే దాన్ని రాసినట్లుగా ఉంది. అధికారులు మాత్రం గుర్తుతెలియని వ్యక్తుల పేరిట వచ్చిన ఫిర్యాదుగా పరిగణిస్తూ పక్కన పడేశారు. కనీసం శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.