అంబటి అవినీతికి అడ్డాగా సత్తెనపల్లి
ABN , First Publish Date - 2023-02-07T01:26:54+05:30 IST
సత్తెనపల్లి పట్టణంలో పేదవాడు గృహ నిర్మాణం చేస్తే అనుమతులు లేవని కూల్చివేసిన మునిసిపల్ అధికారులు, పట్టణ పరిధిలోని చెక్ పోస్టు వద్ద నేషనల్ హైవే రహదారిపై 42 గదులు కట్టినా పట్టించుకోకుండా లంచాల మత్తులో జోగుతున్నారని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి సాంబశివరావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి
సత్తెనపల్లి, ఫిబ్రవరి 6: సత్తెనపల్లి పట్టణంలో పేదవాడు గృహ నిర్మాణం చేస్తే అనుమతులు లేవని కూల్చివేసిన మునిసిపల్ అధికారులు, పట్టణ పరిధిలోని చెక్ పోస్టు వద్ద నేషనల్ హైవే రహదారిపై 42 గదులు కట్టినా పట్టించుకోకుండా లంచాల మత్తులో జోగుతున్నారని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి సాంబశివరావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సత్తెనపల్లి పట్టణం మంత్రి అంబటి రాంబాబు హయాంలో అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారి పోయిందన్నారు. అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ అంబటి రాంబాబు అవినీతికి పాల్పడుతున్నారన్నారు. సత్తెనపల్లి పట్టణంలోని నూర్బాషా శ్మశాన వాటిక పరిధిలో ఉన్న నేషనల్ హైవే స్థలంలో మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో అనధికారికంగా హైవే స్థలాన్ని ఆక్రమించి 41 గదులు నిర్మించారు. ఇది అవినీతికి పరాకాష్ట అన్నారు. దీని పై మునిసిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి రాఘవరావును వివరణ కోరితే 42 గదులకు పురపాలక సంఘం నుంచి ఎటువంటి అనుమతులు లేవని చెప్పారన్నారు. అనధికారికంగా స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేయటంతో ఒక్కొక్క షాపు వద్ద నుంచి ఆక్రమణ ఫీజు వసూలు చేస్తున్నామన్నారు.