ఎక్స్రే సేవలు దైవాదీనం!
ABN , First Publish Date - 2023-08-02T00:54:07+05:30 IST
రాజమహేంద్రవరం ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో ఎక్స్రే సేవలు దైవాదీనంగా మారాయి. ఇక్కడి ఎక్స్రే మెషీన్ (కంప్యూటరైజ్డ్ రేడియోగ్రఫీ సిస్టం - సీఆర్) ఎప్పుడు పనిచేస్తుందో ఎప్పుడు మొరాయిస్తుందో ఎవరికీ తెలి యదు.
13 ఏళ్ల పాత మెషీన్తో కుస్తీ
రోజుకు 150 వరకూ ఎక్స్రేలు
క్షతగాత్రుల ఇక్కట్లు
కొత్త మిషన్ కావాలని డిమాండ్
రాజమహేంద్రవరం అర్బన్, ఆగస్టు 1 : రాజమహేంద్రవరం ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో ఎక్స్రే సేవలు దైవాదీనంగా మారాయి. ఇక్కడి ఎక్స్రే మెషీన్ (కంప్యూటరైజ్డ్ రేడియోగ్రఫీ సిస్టం - సీఆర్) ఎప్పుడు పనిచేస్తుందో ఎప్పుడు మొరాయిస్తుందో ఎవరికీ తెలి యదు. పాత సిస్టం కావడంతో తరచూ మరమ్మతులకు గురవుతోంది. చివరకు అక్కడ పనిచేసే రేడియోగ్రాఫర్లు కూడా ఏ రోజు ఎక్స్రే తీస్తాం అనేది ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. దీంతో ఎక్స్రే కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తున్న బాధితుల పరిస్థితి అయోమయంగా మారుతోంది. ఆసుపత్రి వైద్యాధికారులు సైతం ఉన్నంతలో తాత్కాలికంగా మరమ్మతులు చేయించడం మినహా కొత్త సీఆర్ ఏర్పాటు విషయంలో ముందుకెళ్లలేకపోతున్నారు.
13 ఏళ్ల నాటి సీఆర్ మెషినరీ ...
రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి జీజీహెచ్గా అప్గ్రేడ్ అయింది. వైద్యుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఎక్స్ రే ఓపీ కూడా ఎక్కువైంది. అదృష్టవశాత్తూ సీఆర్ మెషీన్ సక్రమంగా పనిచేస్తే సగటున రోజుకు 130 నుంచి 150 వరకూ ఎక్స్ రే తీస్తుంటారు. వీటిలో సుమారు 100 ఎక్స్ రేలు అవుట్ పేషెంట్లకు చెందినవే ఉంటున్నాయి. ప్రస్తుతం ఉన్న ఎక్స్ రే మెషీన్ ఓల్డు పాటర్న్లో ఉండడం, పాతది కావడం, 13 ఏళ్లకు పైబడి వినియోగించడంతో మెషినరీ సామర్థ్యం బాగా తగ్గింది. ఎక్స్రేలో క్లారిటీ తగ్గిపోయి గీతలు మాదిరిగా వస్తున్నాయని చెబుతున్నారు. కొత్త మెడికల్ కాలేజీ అడ్మిషన్లు పూర్తయితే ఎక్స్ రే సేవలు మరింత పెరుగుతాయని, ఈ నేపథ్యంలో ఆధునిక సాంకేతికతో కూడిన కంప్యూటరైజ్డ్ రేడియోగ్రఫీ సిస్టమ్ - సీఆర్ సిస్టం తప్పనిసరి అని అంటున్నారు. దీనికితోడు ఎక్స్ రే తీసేందుకు ఉపయోగించే కేసెట్లు కూడా పాతవి కావడంతో అరిగిపోయి పిక్చర్ క్వాలిటీ తగ్గిపోతున్నదని చెబుతున్నారు. ఆసుపత్రి, మెడికల్ కాలేజీల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కనీసం 300 ఎంఏ ఆ పైన సామర్థ్యం కల్గిన పెద్ద మెషీన్ కావాల్సి ఉంటుందని టెక్నిషియన్స్ అంటున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న సీఆర్ మెషీన్ కేవలం 60 ఎంఏ సామర్థ్యం మాత్రమే కావడం గమనార్హం. ప్రస్తుతం ముగ్గురు పర్మినెంట్ రేడియోగ్రాఫర్స్ మాత్రమే ఉన్నారు. జీజీహెచ్కు కనీసం 20 మంది టెక్నీషియన్స్ అవసరం ఉంటుందని సమాచారం. ఈ నేపథ్యంలో ఎక్స్ రే సమస్యకు ఎప్పటికి మోక్షం కలుగుతుందనేది వేచిచూడాలి.