భార్యను వేధిస్తున్నాడని హత్య

ABN , First Publish Date - 2023-08-02T00:25:37+05:30 IST

తన భార్యను వేధిస్తున్నాడన్న కక్షతో సెంట్రింగ్‌ మేస్త్రిని అతని వద్ద పనిచేసే మరో మేస్త్రి కుమారుడి సాయంతో హత్య చేశాడు. గత నెల 29వ తేదీ రాత్రి అనపర్తి మండలం మహేంద్రవాడలో జరిగిన సెంట్రింగ్‌ మేస్త్రి సత్తి నారా యణరెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం అనపర్తిలోని సర్కిల్‌ కార్యాయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్య కేసు వివరాలను రాజమహేంద్రవరం ఈస్ట్‌జోన్‌ డీఎస్పీ కిశోర్‌కుమార్‌ వెల్లడించారు.

భార్యను వేధిస్తున్నాడని హత్య

అనపర్తి, ఆగస్టు 1: తన భార్యను వేధిస్తున్నాడన్న కక్షతో సెంట్రింగ్‌ మేస్త్రిని అతని వద్ద పనిచేసే మరో మేస్త్రి కుమారుడి సాయంతో హత్య చేశాడు. గత నెల 29వ తేదీ రాత్రి అనపర్తి మండలం మహేంద్రవాడలో జరిగిన సెంట్రింగ్‌ మేస్త్రి సత్తి నారా యణరెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం అనపర్తిలోని సర్కిల్‌ కార్యాయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్య కేసు వివరాలను రాజమహేంద్రవరం ఈస్ట్‌జోన్‌ డీఎస్పీ కిశోర్‌కుమార్‌ వెల్లడించారు. మహేంద్రవాడకు చెందిన సత్తి నారా యణరెడ్డి సెంట్రింగ్‌ పనులు నిర్వహిస్తుంటాడు. అతడు తన వద్ద మేస్త్రిగా పనిచేసే కర్రి నాగిరెడ్డి ఇంటికి తరచూ వెళ్లి వస్తుండేవాడు. ఇటీవల నారాయణరెడ్డి ఫోన్‌ చేసి వేధిస్తున్నాడని, తనతో గడపాలని ఇబ్బంది పెడుతున్నాడని నాగిరెడ్డి భార్య చెప్పింది. దీంతో నారాయణరెడ్డిపై కక్ష పెంచుకుని ఎలాగైనా హతమార్చాలని పథకం వేశాడు. శనివారం రాత్రి మద్యం తాగేందుకు రావాలని నాగిరెడ్డి పిలవడంతో నారాయణరెడ్డి పుంతరోడ్డులో ఉన్న కొబ్బరి తోటలోకి వెళ్లాడు. అప్పటికే నాగిరెడ్డి తన మైనర్‌ కుమారుడితో కాపు కాసి ఉన్నాడు. ఇద్దరూ మద్యం తాగుతుండగా కుమారుడు నారాయణరెడ్డిని కదల కుండా పట్టుకోగా నాగిరెడ్డి ఐరన్‌ రాడ్డుతో తల వెనుక భాగంలో పలు సార్లు మోదడంతో నారాయణరెడ్డి అక్కడిక్కడే మృతి చెందాడు. అయితే హత్య కేసు నిందితుల కోసం పోలీసులు జల్లెడ పట్టడంతో దొరికిపోతామన్న భయంతో తండ్రీ కొడుకులు మంగళవారం వీఆర్‌వో ఐ.శ్రీనివాస్‌ వద్ద లొంగిపోవడంతో వారిని పోలీసులకు అప్పగించారు. నాగిరెడ్డిని, అతడి మైనర్‌ కుమారుడిని అరెస్ట్‌ చేసి హత్యకు ఉపయోగించిన రాడ్‌ను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన సీఐ శ్రీనివాస్‌, ఎస్‌ఐ అప్పారావు, ఏఎస్‌ఐ వీర్రాజు, హెచ్‌సీలు రఘు, ఐ.శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లను ఎస్పీ సుధీర్‌ కుమార్‌రెడ్డి అభినందించినట్టు డీఎస్పీ తెలిపారు.

Updated Date - 2023-08-02T00:25:37+05:30 IST