వాల్తేరు వీరయ్యతో అసలైన సంక్రాంతి
ABN , First Publish Date - 2023-01-18T01:09:13+05:30 IST
రెండు దశాబ్దాలుగా సినీ రంగంలో ఉన్నప్పటికీ తాను ఈ ఏడాది అసలైన సంక్రాంతి వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా జరుపుకొంటున్నానని కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన సినీ ఎడిటర్ చోటా కె ప్రసాద్ తెలిపారు.
కడియం, జనవరి 17: రెండు దశాబ్దాలుగా సినీ రంగంలో ఉన్నప్పటికీ తాను ఈ ఏడాది అసలైన సంక్రాంతి వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా జరుపుకొంటున్నానని కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన సినీ ఎడిటర్ చోటా కె ప్రసాద్ తెలిపారు. వాల్తేరు వీరయ్య అధిక కలెక్షన్లు సాధించడంతో ప్రసాద్కు మంచి గుర్తింపు వచ్చింది. సంక్రాంతికి దుళ్ల వచ్చిన ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగకు ఏటా స్వగ్రామం వస్తున్నామని, అసలైన సంక్రాంతి ఈ ఏడాది జరుపుకొంటున్నానన్నారు. సినీరంగంలో ప్రముఖ కెమెరామెన్ చోటా కె నాయుడు, శ్యామ్ కె నాయుడు ఈయనకు బాబాయ్లు. బాల్యం నుంచి చిరంజీవి అభిమాని అయిన ప్రసాద్ సినీరంగంలోకి రావాలనేది కోరిక తన బాబాయ్ చోటా కె.నాయుడు అందించిన సహకారంతో ఎడిటర్గా స్థిరపడ్డారు. ప్రముఖ ఎడిటర్ గౌతంరాజువద్ద ఎనిమిదేళ్ల పాటు అసిస్టెంట్ ఎడిటర్గా పనిచేస్తూ 150 సినిమాల ఎడిటింగ్ షెడ్యూల్లో కీలకంగా వ్యవహరించారు. 36 సినిమాలకు ఎడిటర్గా వ్యవహరించారు. వాల్తేరు వీరయ్య సినిమా ఎడిటింగ్లో ప్రసాద్ కనపరిచిన ప్రతిభ చిరంజీవితో పాటు అందర్నీ ఆకర్షించింది. ప్రసాద్ను చిరంజీవి అభినందించారు.