అటెన్‌షన్‌!

ABN , First Publish Date - 2023-04-03T01:03:08+05:30 IST

పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని డీఈవో అబ్రహాం తెలిపారు. సోమవారం నుంచి 18వ తేదీ వరకూ పరీక్షలు జరుగుతాయన్నారు.

అటెన్‌షన్‌!
సర్వం సిద్ధం : అనపర్తి జీబీఆర్‌ స్కూల్‌లో పరీక్షలకు సిద్ధమైన రూమ్‌

నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు

126 కేంద్రాలు.. 26,129 మంది విద్యార్థులు

అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసిన విద్యాశాఖ

రాజమహేంద్రవరం(ఆంధ్రజ్యోతి), ఏప్రిల్‌ 2 : పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని డీఈవో అబ్రహాం తెలిపారు. సోమవారం నుంచి 18వ తేదీ వరకూ పరీక్షలు జరుగుతాయన్నారు. ఈ మేరకు విద్యుత్‌, మునిసిపల్‌, రవాణా శాఖలతో సమన్వయం చేసుకుంటూ అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నా రు. ఆదివారం మరోసారి పరీక్షా కేంద్రా లను పరిశీలించామని విద్యాధికారులు తెలిపారు. దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామ న్నారు. జిల్లాలో మొత్తం 126 పరీక్షా కేంద్రాల్లో 26,129 మంది పరీక్షలకు హాజరవుతా న్నారు. 22,732 మంది రెగ్యులర్‌, 3,397 మంది ప్రైవేటు, 99 మంది ఓపెన్‌ స్కూల్‌ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు. ఉద యం 9.30 గంటల నుంచి మధ్యా హ్నం 12.45 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయన్నారు. ఫ్లైయింగ్‌ స్క్వాడ్లు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తుంటాయని తెలిపారు. పరీక్షా హాల్లోకి సిబ్బందితో పాటు ఎవరికీ సెల్‌ఫోన్లు, ఎలకా్ట్రనిక్‌ వాచీలు, ఎలక్ర్టానిక్‌ గాడ్జట్లకు అనుమతించమని పేర్కొ న్నారు. పరీక్షల సమయంలో దగ్గరలోని జిరాక్స్‌ సెంటర్లు కచ్చితంగా మూసేయాలన్నారు. హాల్‌ టికెట్‌ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా పరీక్షా కేంద్రానికి చేరుకోవచ్చునని పేర్కొన్నారు. నూతనంగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లాలో తొలిసారి పది పరీక్షలు జరుగుతుండడంతో చిన్న తప్పునకు కూడా ఆస్కారం ఇవ్వొద్దని కలెక్టర్‌ డాక్టర్‌ కే.మాధవీలత ఆదేశాల మేరకు ప్రణాళికా బద్ధంగా ఏర్పాట్లు చేశామన్నారు. ఇదిలా ఉండగా ఓపెన్‌ స్కూల్‌ ఇంటర్మీడియట్‌ పరీక్షలు సోమవారం నుంచి 17 వరకూ జరగనున్నాయి.

ఆందోళన చెందవద్దు : కార్తీక్‌, మానసిక వైద్యుడు

పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు కాస్త ముందుగానే బయలుదేరితే చివరి నిమిషంలో ఒత్తిడి ఉండదు. ఆదరాబాదరాగా వెళితే ఆ ప్రభావం పరీక్షపై పడొచ్చు. అరగంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకుంటే మం చిది. ముందుగా ప్రశ్నపత్రం ప్రశాంతంగా చూసుకొని రాయడం మొదలు పెట్టాలి. సమయాన్ని వృథా చేయరాదు. ఇంటి వద్ద పెద్దవాళ్లు ధైర్యం చెప్పి పిల్లలను ఆహ్లాదంగా పంపించాలి. వాళ్లు ఆందోళన పడి పిల్లలను అయోమయానికి గురయ్యేట్లు చేయవద్దు. పరీక్షల సమయంలో మధ్యాహ్నం పడుకోవడం అంత మంచిదికాదు. దానివల్ల రాత్రులు నిద్రరాదు. ఉదయం పరీక్షా హాల్లో కునుకుపాట్లు వచ్చే అవకాశం ఉంది. సాత్వికాహారం, త్వరగా జీర్ణమయ్యేవి తీసుకోవడం మంచిది. పడని ఆహారపదార్థాలు ఏమైనా ఉంటే మానివేయడం బెటర్‌. భయం, ఆందోళన వీడి మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి.సెల్‌ఫోన్లు, టీవీలు చూడరాదు. పది పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు బెస్టాఫ్‌ లక్‌.

నిమిషం ఆలస్యమైనా గెంటేయవద్దు...

ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి అనుమతించరు.. పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా చేరుకోవాలని ఏ విద్యార్థీ కోరుకోడు. అయితే, అనుకోని కారణాల వల్ల బయలుదేరడం కాస్త ఆలస్యం కావొచ్చు. లేదంటే దూర ప్రాంతాల నుంచి రావడం వల్ల కావొచ్చు. విషయం తెలుసుకున్న తర్వాతే ఆ నిమిషాన్ని పరిగణనలోకి తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. పరీక్షలకు వెళ్లే విద్యార్థులు తారసపడి సహాయం కోరితే ఆటో వాలాలు, వాహనదారులు కాస్త మానవత్వంతో ఆలోచించి వాళ్లను పరీక్షా కేంద్రాల వద్దకు తీసుకువెళితే కాస్త తొందరగా వెళతారు.

Updated Date - 2023-04-03T01:03:08+05:30 IST