బలభద్రపురంలో తెలుగు రాష్ట్రాల్లో మూడో ఆదివరాహస్వామి ఆలయం నిర్మాణం
ABN , First Publish Date - 2023-01-25T01:40:39+05:30 IST
బలభద్రపురంలోని శ్రీదేవి, భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో రూ.30 లక్షల వ్యయంతో కోనేరు, సుదర్శనమూర్తి, ఆదివరహాస్వామి ఆలయాలను నిర్మించినట్టు ఆలయ కమిటీ అధ్యక్షుడు మల్లిడి గంగారెడ్డి మంగళవారం విలేకరులకు తెలిపారు.
రేపు ప్రారంభం
బిక్కవోలు, జనవరి 24: బలభద్రపురంలోని శ్రీదేవి, భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో రూ.30 లక్షల వ్యయంతో కోనేరు, సుదర్శనమూర్తి, ఆదివరహాస్వామి ఆలయాలను నిర్మించినట్టు ఆలయ కమిటీ అధ్యక్షుడు మల్లిడి గంగారెడ్డి మంగళవారం విలేకరులకు తెలిపారు. సాధారణంగా వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో స్తంభాలపై వరహాస్వామిని చెక్కుతారు. అయితే తిరుమలలోను, తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా కమాన్పూర్లో వరహాస్వామివారి ఆలయాలున్నాయి. మూడో ఆలయాన్ని తిరుమలలో మాదిరిగా తమ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్మించామని గంగారెడ్డి తెలిపారు. అలాగే ఏటా నిర్వహించే స్వామి వారి వార్షికోత్సవంలో స్వామి వారి చక్రస్నానానికి వీలుగా కోనేరు నిర్మించామని, కోనేరు మధ్యలో సుదర్శనమూర్తిని ప్రతిష్ఠించడానికి ఆలయం నిర్మించామన్నారు. 26న ఆలయాల్లో స్వామి విగ్రహ ప్రతిష్ఠతోపాటు కోనేరును ప్రారంభిస్తామని, భారీఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు.