రాజమహేంద్రవరంలో తెలుగుదేశం మహానాడు
ABN , First Publish Date - 2023-03-29T01:47:08+05:30 IST
తెలుగుదేశం పార్టీ మహానాడును రాజమహేంద్రవరంలో మే నెల 27, 28వ తేదీల్లో నిర్వహించడానికి పార్టీ అధిష్ఠానం నిర్ణ యించింది.
మే నెల 27, 28 తేదీల్లో నిర్వహించే అవకాశం
100 ఎకరాల స్థలం అవసరమని అంచనా
ఏడాదిలో ఎన్నికల నేపథ్యంలో ప్రాధాన్యం
రాజమహేంద్రవరం, మార్చి28(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ మహానాడును రాజమహేంద్రవరంలో మే నెల 27, 28వ తేదీల్లో నిర్వహించడానికి పార్టీ అధిష్ఠానం నిర్ణ యించింది. ఎన్నిరోజులనేది ఇంకా స్పష్టత లేదు. ఎన్నికలు ఏడాది కాలంలో రానున్న నేపఽథ్యంలో ఇక్కడ మహానాడు నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల పట్టభద్రులు, ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా వరస విజయాలు సాధించి, మంచి జోష్ మీద ఉన్న తెలుగుదేశం పార్టీ మహానాడు నుంచే ఎన్నికల శంఖారావం పూరించే అవకాశం ఉంది. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలకు రాజకీయ కేంద్రంగా ఉన్న రాజమహేంద్రవరంలో సభ అంటే తెలుగుదేశం పార్టీకి శుభమేననే అంచనా లు ఇప్పటికే మొదలయ్యాయి. గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కంచుకోట వంటివి. గత ఎన్నికలలో ఎక్కువ చోట్ల ఓడినా కేడర్లో ఎక్కడా ఆత్మస్థయిర్యం తగ్గలేదు. మరింత పట్టుదల పెరిగింది. అంతేకాక జనసేనతో కూడా కలిసి పయనించే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతుండడం వల్ల కూడా మహానాడుకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. మహానాడుకు సుమారు 100 ఎకరాల స్థలం అవసరం అవుతుందని అంచనా వేస్తున్నారు. రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో సభాస్థలిని ఎంపిక చేసే అవ కాశం ఉంది. ఇంకా రెండు నెలల సమయం ఉంది కాబట్టి త్వరలో స్థలాన్ని కూడా ఖరారు చేయనున్నారు. ఇక టీడీపీ అగ్రనేతలు వరుసగా రాజమహేంద్రవరం రావడానికి కార్యక్రమాలు ఖరారు చేసుకుంటున్నారు. పార్టీ అధిష్ఠానం ఒక విజయోత్సవంగా నిర్వహించాలని చూస్తోంది.