ఖైదీల ‘పరో’ పాట్లు!
ABN , First Publish Date - 2023-03-26T01:30:18+05:30 IST
నేరం రుజువై కోర్టు ఓ వ్యక్తికి జీవిత ఖైదు విధించింది. అయితే అతడి నేరానికి కుటుంబం నిరంతరం కుమిలిపోకూడదు. పిల్లలపై తండ్రి ఎడబాటు ప్రతికూల ప్రభావం చూపకూడదు..
మూడు నాలుగు సార్లు దరఖాస్తుచేసినా రావట్లే..
ఆవేదనలో కుటుంబ సభ్యులు
చిన్న కారణాలూ ప్రతిబంధకాలే..
(రాజమహేంద్రవరం -ఆంధ్రజ్యోతి)
నేరం రుజువై కోర్టు ఓ వ్యక్తికి జీవిత ఖైదు విధించింది. అయితే అతడి నేరానికి కుటుంబం నిరంతరం కుమిలిపోకూడదు. పిల్లలపై తండ్రి ఎడబాటు ప్రతికూల ప్రభావం చూపకూడదు.. మనిషి సంఘజీవి కాబట్టి శిక్ష అనుభవించే క్రమంలో సమాజానికి దూరం కాకూడదు అనే ఉద్దేశంతో జీవిత ఖైదీలకు కల్పించిన వెసులుబాటు నీరుగారిపోతోంది. కుటుంబ సంబంధాలు తెగిపోకుండా, తండ్రి లేదా తల్లి వాత్సల్యానికి పిల్లలు ఏళ్లపాటు దూరం కాకుండా జరిగిన ఏర్పాటు.. అక్కరకు రాకుండాపోతోంది. ఇటు ఖైదీలూ నాలుగు గోడల మధ్య మానసిక వేదన పడుతున్నారు. పర్లో, పరోల్ రాకపోవడంతో తమ కుటుంబాలు విచ్ఛిన్నమవు తాయనే భయాన్ని దిగమింగుతూ కాలం వెళ్లదీస్తున్నారు.
ఫర్లో/పర్లో/ఫర్లౌ.. పరోల్.. అంటే ఖైదీని జైలు నుంచి కొద్దిరోజులపాటు ఇంటికి పంపించడం. పర్లోకి ఎలాంటి కారణాలూ చూపనవసరం లేదు. బలమైన, అత్యవసర కారణం ఉంటేనే పరోల్ లభిస్తుంది. రెండేళ్లు శిక్ష పూర్తి చేసుకున్న సత్ప్రవర్తన కలిగిన ఖైదీకి గరిష్ఠంగా 14 రోజులపాటు, ఆ మరుసటి సంవత్సరం నుంచి ఏడాదికి నెలరోజుల చొప్పున పర్లో ఇచ్చే అవ కాశం ఉంది. దీనివల్ల ఇంటికి వెళ్లే ఖైదీ కొద్దిరోజులపాటు కుటుంబ సభ్యు లతో గడపడంతో ఇతడికి, వాళ్లకి కూడా మానసిక సాంత్వన చేకూరు తుంది. భార్యాబిడ్డలు జీవించడానికి ఏదైనా దారి ఏర్పాటుచేసుకొనే అవకా శం ఉంటుంది. పిల్లల పెళ్లిళ్లు, చదువులు వంటి బాధ్యతలు నెరవేర్చవచ్చు.
ఎలా ఇస్తారు..
జీవిత ఖైదు పడి రెండేళ్లు శిక్ష అనుభవించిన వారికి పర్లో వర్తిస్తుంది. ఖైదీలు దరఖాస్తు చేసిన తర్వాత.. అతడు జైలుకు వచ్చినప్పటి నుంచీ ప్రవర్తనను అంచనా వేసి పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాత జైలు అధికా రులు నిరభ్యంతర నివేదిక కోసం పోలీస్లకు విన్నవిస్తారు. ఎస్ఐ స్థాయి నుంచి ఎస్పీ వరకూ వివిధ దశలు దాటుకొని వచ్చే ఆ నివేదిక జైలు అధి కారులకు చేరుతుంది. పోలీస్లు నిరభ్యంతరం తెలిపినవి మాత్రమే జైళ్ల శాఖ డీజీకి వెళతాయి. ఆయన అనుమతి పొందిన అనంతరం పర్లోపై ఏ ఖైదీ అయినా తాత్కాలికంగా ఇంటికి వెళ్లడానికి అవకాశం లభిస్తుంది.
ప్రతిబంధకం ఎక్కడ ?
పర్లోకి సిఫారసు చేసే క్రమంలో పోలీస్ శాఖది కీలకపాత్ర. వారు అభ్యంతరం లేవనెత్తితే పర్లో రాదు. జైలు నుంచి పర్లోపై వచ్చిన వ్యక్తి వల్ల బాధితులకు, వాళ్ల వల్ల ఇతడికి హాని జరక్కూడదు.. ఇలా కొన్ని నిబంధ నలతో చెక్ లిస్ట్ ఉంటుంది. ఎస్ఐ స్థాయి నుంచి ఈ నివేదిక ఎస్పీకి అక్క డి నుంచి జైలు అధికారులకు చేరుతుంది. కొన్ని అతి తీవ్రమైన నేరాల విషయంలో కూడా పర్లో రాకపోవచ్చు. అయితే, ఉరిశిక్ష పడిన తర్వాత దానిని కోర్టు జీవిత ఖైదుగా మార్చిన ఖైదీలకు కూడా పర్లో వచ్చిన సంద ర్భాలు ఉన్నాయి. 2020లో కేంద్రం హోంమంత్రిత్వ శాఖ జారీ చేసిన ఓ సర్క్యులర్ కూడా పర్లో, పరోల్ రాకపోవడానికి కారణమవుతోందని తెలు స్తోంది. రౌడీషీట్ ఉందని కారణంగా చూపుతూ పోలీసులు తిరస్కరిస్తు న్నారు. ఫ్యామిలీ కేసుల్లో రౌడీషీట్ ఉందంటూ కారణం చూపిన సందర్భా లున్నాయి. నిజానికి ఫ్యామిలీ కేసుల్లో రౌడీషీట్ ఉండదని చెబుతున్నారు.
అప్పుడు రాని ఇబ్బందులు..
ఒక వ్యక్తిని నిందితుడిగా కోర్టుకు చూపిన తర్వాత విచారణ ప్రారంభ మవుతుంది. నేరం రుజువై శిక్ష పడడానికి ముందే కోర్టు బెయిల్ మంజూ రు చేయవచ్చు. అలాంటి సందర్భంలో ఏళ్లపాటు బెయిల్పై ఉన్నప్పుడు రాని ఇబ్బందులు ఏళ్లు గడిచిన తర్వాత జైలు నుంచి పర్లోపై వెళితే ఎందు కు వస్తాయనేది మరో సందేహం. జైలులో రెండేళ్లలో ఏ ఒక్క చిన్నతప్పు చేసినా, బాధ్యతారహితంగా ప్రవర్తించినా జైలు అధికారులు పర్లోకి సిఫా రసు చేసే అవకాశం లేదు. సాధారణంగా ఖైదీలను జైలు అధికారులు రోజూ గమనిస్తూనే ఉంటారు. ఆ లెక్కన పూర్తిగా సత్ప్రవర్తన కలిగి, వారి నడవడికతో సంతృప్తి చెందిన పిదప నిబంధనలను అనుసరించి జైలు అధికారులు పర్లోకి సిఫారసు చేస్తారు. అలాంటప్పుడు ఖైదీలు పర్లో పాట్లు ఎందుకు పడుతున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనిపై నైతికత, మాన వత్వం కోణాల్లో ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని కొందరి వాదన.
గతంలో కోర్టులు ఏమన్నాయంటే..
ఖైదీలకు పర్లో తిరస్కరించడంపై కుటుంబ సభ్యులు కోర్టుకు వెళ్లిన సం దర్భంగా పంజాబ్, హరియాణా హైకోర్టు, మరో కేసులో రాజస్థాన్ హైకోర్టు ’పర్లోలో ఖైదీ బయట ఉన్నప్పుడు నేరం చేసే అవకాశం ఉందనడం పర్లో తిరస్కరించడానికి తగిన కారణం కాదు’ అని వ్యాఖ్యానించాయి.
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో..
రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారంలో పర్లో కోసం, పరోల్ కోసం దరఖాస్తులు చేసుకున్న వారిలో సగం మందికి కూడా అనుమతులు రావడం లేదు. అయితే దీనికి అనేక ప్రతిబంధకాలను కారణంగా చూపుతున్నారు. అత్యవసర కారణాలైతే పరోల్ ఇస్తారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు పర్లో ఇస్తారు.. ఇప్పటివరకు ఇచ్చిన జాబితా ఇది...
పర్లో దరఖాస్తులు అనుమతి
2019 176 26
2020 99 14
2021 118 39
2022 87 45
పరోల్ దరఖాస్తులు అనుమతి
2019 126 43
2020 127 51
2021 166 63
2022 191 45
ఉదాహరణకు..
ఓ హత్య కేసులో అప్పికొండ అయ్యప్ప(ఏ4), కొడమంచిలి రాజు (ఏ2)లకు 2019లో జీవిత ఖైదు పడి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. వీళ్లిద్దరూ ఇంటర్ వరకూ చదువుకున్నారు. నాలుగుసార్లు పర్లోకి పెట్టినా పని జరగలేదు. అక్కాబావా ప్రమా దంలో మరణిస్తే తొమ్మిదేళ్ల నుంచీ తన పిల్లలతోపాటే వారి పిల్లలనూ అయ్యప్ప సాకుతు న్నాడు. రాజు భార్య చనిపోగా కూతురు నానమ్మ దగ్గర ఉంటూ ఇంటర్ చదువుతోంది.
అయ్యప్ప తల్లి అప్పికొండ రమణి ఏమన్నారంటే..
నా కోడలు చాలా ఇబ్బందులు పడుతోంది. చిన్న హోటల్ నడుపుతూ నన్నూ, నా భర్తనూ, నలుగురు పిల్లల్ని చూస్తోంది. నా కూతురు చనిపోయినప్పుడు కూడా అయ్యప్పకు పరోల్ రాలేదు. నా భర్తకు ఇటీవలే ఆపరేషన్ అయ్యింది. అప్పుడూ దరఖాస్తు చేశాం. ఫలితం లేదు. పర్లోపై అయ్యప్పను పంపితే ఇంటి వద్ద కొన్ని పనులు చక్కబెట్టి వెళతాడు. వృద్ధులమైన మాకూ ధైర్యంగా ఉంటుంది. పర్లో ఇవ్వకుండా కుటుంబ సభ్యులు వేదన చెందేలా చేయడం సబబు కాదు.
సత్ప్రవర్తన కలిగిన వాళ్లకే..
ఎస్.రాజారావు, సూపరింటెండెంట్, సెంట్రల్జైలు
కొంతమంది అనుకోని పరిస్థితుల్లో జైలుకు వస్తారు. అలాంటి వారు వ్యాపారాలకు, కుటుంబాలకు దూరమై కుంగిపోతున్నారు. మేము వాళ్లకు కౌన్సెలింగ్ ఇస్తాం. కుటుంబ బాంధవ్యాలు పాడవకుండా ఉండటానికి పర్లో మంచి అవకాశం. మేం రెండేళ్లపాటు పూర్తిగా గమనించిన తర్వాతే సత్ప్రవర్తన కలిగిన వాళ్లను మాత్రమే పర్లో, పరోల్కి సిఫారసు చేస్తాం. ఏదైనా తప్పు చేసి పనిష్మెంటుకు గురైతే మేమే రికమండ్ చేయం. పర్లో, పరోల్ మేం సిఫారసు చేసిన తర్వాత ఆశగా కుటుంబ సభ్యులు ఎదురు చూస్తుంటారు.