కుష్ఠువ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి
ABN , First Publish Date - 2023-07-18T01:08:03+05:30 IST
కుష్ఠువ్యాధి నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఇంటింటి సర్వేలో ఆరోగ్య సిబ్బంది వ్యాధి నియంత్రణ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రాం అడిషనల్ డైరెక్టర్ యాస్మిన్ అన్నారు.
నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రాం అడిషనల్ డైరెక్టర్ యాస్మిన్
కంబాలపేట యూపీహెచ్సీ, బిక్కవోలు పీహెచ్సీ తనిఖీ
రాజమహేంద్రవరం అర్బన్/బిక్కవోలు, జూలై 17: కుష్ఠువ్యాధి నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఇంటింటి సర్వేలో ఆరోగ్య సిబ్బంది వ్యాధి నియంత్రణ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రాం అడిషనల్ డైరెక్టర్ యాస్మిన్ అన్నారు. సోమవారం కుష్ఠువ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం కంబాలపేట యూపీహెచ్సీతోపాటు బిక్కవోలు పీహెచ్సీని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. సర్వేలో ప్రజలకు అవగాహన కల్పించే ప్లిప్కార్డు, పోస్టర్ తదితర మెటీరియల్ను పరిశీలించి కేసు డిటెక్షన్ క్యాంపైన్, ఎల్సీడీసీ సర్వే తీరును సమీక్షించారు. కార్యక్రమంపై ఆశా, ఏఎన్ఎంలను ప్రశ్నించి పలు సూచనలు చేశారు. యూపీహెచ్సీలో ప్రదర్శించిన సేఫ్ డెలివరీ కేలండర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అనుమానిత మచ్చలున్న వారిని ఏ విధంగా పరీక్ష చేస్తున్నదీ, సర్వే చేస్తున్న విధానం గురించి చర్చించడం జరిగిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ను కుష్ఠురహిత రాష్ట్రంగా చేయడానికి అందరూ కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె వెంట జిల్లా లెప్రసీ, టీబీ కంట్రోల్ అధికారిణి డాక్టర్ వసుంధర, డీఎన్ఎంవో డాక్టర్ పి.లక్ష్మీదేవి, యూపీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ ప్రియాంక, పీహెచ్సీ వైద్యులు రాజీవ్, దుర్గాదేవి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.