భూముల ధరలు బాదుడే బాదుడు
ABN , First Publish Date - 2023-06-01T01:25:22+05:30 IST
అనుకున్నట్టే.. బాదేశారు. రిజిస్ట్రేషన్ల శాఖకు ఈ ఏడాది భారీ లక్ష్యాలను విధించారు. వాటిని చేరుకోవడానికి భూముల మార్కెట్ ధరలను ప్రభుత్వం పెంచేసింది. ఈ ధరలు గురువారం నుంచి అమలు లోకి రానున్నాయి. ‘అదనపు ఆదాయం’ ఒక్కపైసా వదులుకోవడానికి ఇష్టపడని ప్ర భుత్వం మూడు రోజుల నుంచి సర్వర్లతో దోబూచులాట ఆడించింది.
ఇష్టానుసారం పెంచేసిన ప్రభుత్వం 8 నేటి నుంచి అమల్లోకి..
ఏకంగా 30 నుంచి 100 శాతం వరకూ పెంచివేస్తూ ఆదేశాలు
భారీగా పెరగనున్న రిజిస్ట్రేషను, స్టాంపు డ్యూటీల చార్జీలు
సదుపాయాలున్నచోట గజం కొనుక్కోవాలన్నా గగ్గోలే
రాజమహేంద్రవరం(ఆంధ్రజ్యోతి), మే 31: అనుకున్నట్టే.. బాదేశారు. రిజిస్ట్రేషన్ల శాఖకు ఈ ఏడాది భారీ లక్ష్యాలను విధించారు. వాటిని చేరుకోవడానికి భూముల మార్కెట్ ధరలను ప్రభుత్వం పెంచేసింది. ఈ ధరలు గురువారం నుంచి అమలు లోకి రానున్నాయి. ‘అదనపు ఆదాయం’ ఒక్కపైసా వదులుకోవడానికి ఇష్టపడని ప్ర భుత్వం మూడు రోజుల నుంచి సర్వర్లతో దోబూచులాట ఆడించింది. బుధవారం రాత్రి సమయంలో సంబంధిత అధికారులు రిజిస్ట్రేషన్ల చార్జీలు పెంచుతూ ఆదేశాలి చ్చేశారు. జాయింట్ కలెక్టర్, సంబంధిత సబ్ రిజిస్ట్రారు, మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్, రుడా వైస్ చైర్మన్ సంతకాలు చేయగానే కొత్త బాదుడు అమలులోకి వచ్చింది. గృహ, వాణిజ్య విభాగాలుగా చేసి ధరలను పెంచేశారు. 30 శాతం నుంచి నూరు శాతం వరకూ ఈ పెరుగుదల ఉంది. దీంతో రిజిస్ట్రేషను, స్టాంపు డ్యూటీలూ పెరగనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో అభివృద్ధి జరిగిన, జరుగుతున్న ప్రాంతాల్లో సామాన్యుడు ఓ వంద గజాల స్థలం కొనుక్కొనే పరిస్థితి కూడా కనిపించడం లేదు.
రాజమహేంద్రవరంలో.. : రాజమహేంద్రవరం అర్బన్ రిజిస్ట్రారు పరిధిలోని రిజిస్ట్రేషను వార్డుల వారీగా ధరలు పెంచారు. బర్మా కాలనీలో చదరపు గజం ధర రూ.14 వేలుండగా రూ.20 వేలు చేశారు. పోలీస్ క్వార్టర్స్ ఏరియా రూ.11 వేల నుంచి రూ.15 వేలు, పద్మావతి నగర్ రూ.12 వేల నుంచి రూ.16 వేలు, వీఎల్పురం, శ్రీనగర్, ఆల్బ్యాంకు కాలనీ, ఆర్టీసీ కాలనీ, లోలుగు కాలనీ, మోడల్ కాలనీలో రూ. 24 వేల నుంచి ఏకంగా రూ.35 వేలు, అయ్యప్పనగర్, రహమత్నగర్ రూ.19 వేల నుంచి రూ.25 వేలు, గాదాలమ్మనగర్ రూ.11 వేల నుంచి రూ.15వేలు, మోరం పూడి, సాయినగర్, హనుమాన్నగర్ రూ.14 వేల నుంచి రూ.19 వేలు, స్వరాజ్య నగర్ రూ.14 వేల నుంచి రూ.22 వేలకు పెంచగా, కమర్షియల్ ప్రాంతాల్లో బ్లాకుల వారీగా రూ.10 వేల దాకా పెంచారు. అపార్టుమెంట్లలో ఫ్లోర్ల వారీగా బాదేశారు.
పిడింగొయ్యి సబ్రిజిస్ట్రార్ పరిధిలో.. : రూరల్ పరిధిలోకి వచ్చే పిడింగొయ్యి సబ్రిజిస్ట్రార్ పరిధిలోనూ పెరుగుదల భారీగానే ఉంది. రోడ్డుపక్కన, లోపలికి, కాస్త దూరంగా విభజించి 30 శాతం నుంచి 100శాతం వరకూ భూముల ధరలు పెంచా రు. గ్రామాల్లో రూ.6,500 నుంచి రూ.9 వేల వరకూ చదరపు గజం ఉండేది. ఇప్పు డు పిడింగొయ్యిలో 1 నుంచి 4వ వార్డు వరకూ రెసిడెన్షియల్ రూ.10 వేలు, ఐదో వార్డులో రూ.14 వేలు, 6 నుంచి 10 వరకూ 12, 13లో రూ.20 వేలు, 11, 14 వార్డు ల్లో రూ.35 వేలకు పెంచారు. కోలమూరులో 1 నుంచి 18వ వార్డు వరకూ రూ.10 వేలు, కాతేరులో 1 నుంచి 8 వార్డుల్లో రూ.14వేలు, గాడాలలో ఎక్కడైనా రూ.6 వేలు చేశారు. కమర్షియల్ కేటగిరీ కింద పిడింగొయ్యిలో 6వ వార్డులో రూ.25 వేలు, 11వ వార్డులో రూ.40 వేలు, 14లో రూ.50 వేలకు పెంపుదల ఉంది. కోలమూరులో 1 నుంచి 18 వార్డుల్లో రూ.16వేలు, కాతేరులో 1 నుంచి 8 వరకూ రూ.17వేలు చేశారు.