ఇద్దరు ఎంఎన్‌వోలపై చర్యలు

ABN , First Publish Date - 2023-03-19T01:31:34+05:30 IST

మెడికల్‌ సర్టిఫికెట్‌కు లంచం అడిగిన వ్యవహారంలో ఇద్దరు ఎంఎన్‌వో (జనరల్‌ డ్యూటీ అటెండెంట్లు)లపై రాజమహేంద్రవరం ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి అధికారులు చర్యలు చేపట్టారు.

ఇద్దరు ఎంఎన్‌వోలపై చర్యలు

జీతం లేకుండా నెలరోజులు విధులు

సెప్టిక్‌వార్డులో విధులు నిర్వర్తించాలని ఆదేశం

రాజమహేంద్రవరం అర్బన్‌, మార్చి 18 : మెడికల్‌ సర్టిఫికెట్‌కు లంచం అడిగిన వ్యవహారంలో ఇద్దరు ఎంఎన్‌వో (జనరల్‌ డ్యూటీ అటెండెంట్లు)లపై రాజమహేంద్రవరం ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి అధికారులు చర్యలు చేపట్టారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు, శనివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన వార్త నేపథ్యంలో అధికారులు విచారణ చేపట్టారు. ఎంఎన్‌వోల విధులు పర్యవేక్షించే సంబంధిత సూపర్‌వైజర్‌ను సూపరింటెండెంట్‌ తన ఛాంబర్‌కు పిలిపించి పూర్తి సమాచారం తెలుసుకున్నారు. ఇద్దరు ఎంఎన్‌వోలను బాధ్యులుగా గుర్తించి ఇద్దరిపైనా చర్యలకు ఉపక్రమించారు. ఇద్దరూ నెలరోజుల పాటు జీతం లేకుండా పనిచేయాలని ఆదేశాలిచ్చారు. అంతే కాకుండా ఇద్దరు ఎంఎన్‌వోలకు పనిష్మెంటుగా సెప్టిక్‌ వార్డులో డ్యూటీలు వేయాల్సిందిగా సంబంధిత సూపర్‌వైజర్‌ను ఆదేశించినట్టు సమాచారం.ప్రభుత్వాసుపత్రి ఆర్‌ ఎంవో దగ్గర రెగ్యులర్‌గా విధులు నిర్వర్తించే ఎంఎన్‌వో అత్యవసర పనిపై బయటకు వెళ్లిన సమయంలో ఈ వ్యవహారం చోటుచేసుకుంది. ఇదిలా ఉండగా మెడికల్‌ సర్టిఫికెట్లు జారీలో ఆసుపత్రి ఫ్యాకల్టీ, స్టాఫ్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాలని రాజమహేంద్రవరం ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రమేష్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరైనా వ్యక్తిగతంగా సర్టిఫికెట్లు జారీ చేస్తే స్ర్కూట్నీ కోసం రిఫర్‌ చేసిన సమయంలో దాన్ని ఇన్‌ వేలిడ్‌గా భావించడం జరుగుతుందని తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

Updated Date - 2023-03-19T01:31:34+05:30 IST