రూ.21.58 కోట్లు మింగేశారు
ABN , First Publish Date - 2023-07-06T00:26:24+05:30 IST
మొన్న జయలక్ష్మి సొసైటీ నిర్వాహకులు రూ.582 కోట్ల స్వాహా చేసి 21,895మంది డిపాజిటర్ల నెత్తిన శఠగోపం పెట్టి పరారయ్యారు. ఇప్పుడు కార్తికేయ సొసైటీ నిర్వాహకులు రూ.21.58కోట్లు స్వాహాకు పాల్పడి డిపాజిట్దారులను మోసం చేశారు. ఈ రెండు సొసైటీల ఆర్థిక మోసాలు కాకినాడలోనే జరగడం విశేషం.
డిపాజిటర్ల నెత్తిన కార్తికేయ సొసైటీ శఠగోపం
కాకినాడలో మరో చిట్ ఫండ్ కంపెనీ ఆర్థిక మోసం
రూ.10కోట్ల విలువైన ఆస్తులు సీజ్
నిర్వాహకులపై టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు
సర్పవరం జంక్షన్, జూలై 5: మొన్న జయలక్ష్మి సొసైటీ నిర్వాహకులు రూ.582 కోట్ల స్వాహా చేసి 21,895మంది డిపాజిటర్ల నెత్తిన శఠగోపం పెట్టి పరారయ్యారు. ఇప్పుడు కార్తికేయ సొసైటీ నిర్వాహకులు రూ.21.58కోట్లు స్వాహాకు పాల్పడి డిపాజిట్దారులను మోసం చేశారు. ఈ రెండు సొసైటీల ఆర్థిక మోసాలు కాకినాడలోనే జరగడం విశేషం. అత్యధిక వడ్డీల ఆశచూపి డిపాజిటర్లను నట్టేట ముంచిన జయలక్ష్మి సొసైటీ వ్యవహారం గతేడాది ఏప్రిల్ 7న చోటుచేసుకుంది. కార్తికేయ సొసైటీలో జరిగిన ఆర్థికమోసంపై గతేడాది నవంబరులో వెలుగులోకి వచ్చింది. జయలక్ష్మి సొసైటీ అనుభవంతో రంగంలోకిదిగిన సహకారశాఖ అధికారులు రికార్డులను తనిఖీ చేసి ప్రాథమిక దర్యాప్తు చేసి నిర్వాహకులు రూ.10కోట్లకు ఎటువంటి లెక్కాపత్రం చూపకుండా సొంతానికి వాడేసుకున్నట్లు నిర్ధారించారు. మిగతా రూ.9కోట్లను ఫేక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై రుణాలు ఇచ్చినట్లు చూపించి నొక్కేశారు. సెక్షన్ 51 ప్రకారం విచారణ పూర్తి చేసిన తర్వాత సొసైటీలో అక్రమాలు చోటుచేసుకున్నాయని, వీటికి బాధ్యులుగా చైర్మన్, డైరెక్టర్లుగా నిర్ధారించారు. విచారణ నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్ ద్వారా ప్రాసిక్యూషన్ అనుమతితో నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని జిల్లా సహకారశాఖ అధికారి బీకే దుర్గాప్రసాద్ ఫిర్యాదు చేశారు. రూ.10కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసి డాక్యుమెంట్ల వివరాలను సంబంధిత రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపించారు. డిపాజిటర్లందిరికీ న్యాయం చేస్తామని, రూ.10కోట్ల ఆస్తులు సీజ్ చేశామని, వీరి కుటుంబ సభ్యుల ఆస్తులను కూడా ఎటాచ్ చేసి రికవరీ చేస్తామని తెలిపారు.
డిపాజిటర్లను ముంచేసిన కార్తికేయ సొసైటీ
జిల్లా ప్రధాన కేంద్రమైన కాకినాడలో 2003లో ది కార్తికేయ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీని 14 మంది పాలక మండలితో ఏర్పాటు చేశారు. సొసైటీ అధ్యక్షుడు కేవీవీ సత్యనారాయణ, డైరెక్టర్లుగా కె.పద్మావతి, కుమారులు కె.వెంకటేష్, కె.శంకర్లతోపాటు సీహెచ్ గంగరావు, బి.విజయకుమార్, జి.వీరేంద్ర, టి.పుష్షరాజ్యం, అంజుమ్ సల్తానా, డి.సింహాద్రిరావు, ఐ.పార్వతి, ఎం.సాంబశివరావు, మేనేజర్ ఎంఏ హుస్సేన్ ఉన్నారు. సొసైటీ నిర్వాహకులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వందలాదిమంది నుంచి హౌసింగ్ రుణాలకోసం డిపాజిట్లు సేకరించారు. హౌసింగ్ లోన్లు మంజూరు చేస్తూ కార్యకలాపాలు సాగిస్తున్నారు. అత్యధిక వడ్డీ, ఆకర్షణీయ ఆశచూపించి రూ.21.58కోట్ల పైబడి డిపాజిట్లు సేకరించారు. కొన్నేళ్లపాటు సొసైటీ కార్యకలాపాలు సక్రమంగా జరిగాయి. ఫిక్స్డ్ డిపాజిట్లకు వడ్డీలు ఇవ్వడం, హౌసింగ్కోసం రుణాలు ఇవ్వడం, రికవరీలు సక్రమంగా నిర్వహించారు. ఫిక్స్డ్ చేసిన బాండ్లకు నగదు ఇవ్వకపోవడం, ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేయడంతో గతేడాది నవంబరులో డిపాజిటర్లు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జిల్లా సహకారశాఖ అధికారి బీకే దుర్గాప్రసాద్ తక్షణమే కార్తికేయ సొసైటీకి చేరుకుని రికార్డులను పరిశీలించారు. డిపాజిటర్లు దాచుకున్న సొమ్ముకు యాజమాన్యం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం, రికార్డులు చూపించకపోవడంతో ఈ విషయాన్ని రాష్ట్రసహకారశాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సొసైటీ వ్యవహారంపై సెక్షన్ 51 ప్రకారం సహకారశాఖ రిజిస్ట్రార్ల బృందం ఆధ్వర్యంలో విచారణ నిర్వహించారు.
రూ.21.58కోట్లు స్వాహా
కార్తికేయ సొసైటీ నిర్వాహకులు 343మంది డిపాజిట్దారులనుంచి సేకరించిన రూ.21.58 కోట్లను పక్కా ప్రణాళికతో, బినామీల ద్వారా కొట్టేశారు. ఇందులో చైర్మన్, డైరెక్టర్లు కలిసి రూ.10 కోట్ల రుణాలకు లెక్కా పత్రం లేకుండా నిబంధనలకు విరుద్ధంగా అడ్డుగోలుగా దోచేశారు. 240 మంది డిపాజిట్లకు చెందిన రూ.10కోట్ల వివరాలు ఎక్కడా కూడా క్యాష్బుక్, లెడ్జర్లో పోస్టింగ్ లేకుండా జాగ్రత్త పడ్డారు. మరో రూ.9కోట్లను కూడా నకిలీ ఫిక్స్డ్ డిపాజిట్లు సృష్టించి, వీటిపై రుణాలు తీసేసుకుని సొంతానికి వాడేసుకున్నారు.
రూ.10కోట్ల విలువైన ఆస్తుల ఎటాచ్
ఆర్థికమోసానికి పాల్పడిన కార్తికేయ సొసైటీ చైర్మన్, డైరెక్టర్ల నుంచి(ఇందులో భార్య, ఇద్దరు కుమారులు)లకు చెందిన రూ.10కోట్ల విలువైన ఆస్తులు కాకినాడ సూర్యారావుపేట, ప్రతాప్నగర్, వాకలపూడిలోని జీప్లస్ టూ భవనంలోని సొసైటీ భవనం, రెండు స్థలాలను సహకారశాఖ అధికారులు అటాచ్ చేశారు. ఈ ఆస్తులపై ఎటువంటి క్రయవిక్రయలు జరగకుండా అధికారులు కాకినాడ రిజిస్ట్రార్, సర్పవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సమాచారం ఇచ్చి నిషేధిత జాబితాలో చేర్పించారు. ఆర్థికమోసం కేసుకు బాధ్యులుగా నిర్ధారణ అయిన 14మంది సొసైటీ నిర్వాహకులపై సెక్షన్ 64 యాక్ట్ కింద నోటీసులు జారీ చేసి క్రిమినల్ కేసులు తీసుకోవాలని కోరుతూ డీసీవో టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు
-బీకే దుర్గాప్రసాద్, జిల్లా సహకారశాఖ అధికారి, కాకినాడ
బాఽధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వంనుంచి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటు న్నాం. కార్తికేయ సొసైటీ అక్రమాలపై సెక్షన్ 51 ప్రకారం చట్టబద్ధ విచారణ జనవరిలో నిర్వహించాం. సొసైటీ చైర్మన్, డైరెక్టర్ల నుంచి రికవరీకి చర్యలు తీసుకున్నాం. ఇందులో భాగంగానే రూ.100 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసి సంబంధిత రిజిస్ట్రార్ కార్యాలయాలకు నిషేధం విధించేలా ఉత్తర్వులు జారీ చేశాం. వీరి కుటుంబసభ్యుల పేరిట ఉన్న ఆస్తులను కూడా త్వరలో సీజ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. క్రిమినల్ చర్యల కోసం టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాం. ఫిర్యాదు మేరకు నిర్వాహకులపై సెక్షన్ 120బి, 420, 406, 409 తదితర ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. వీటితోపాటు సహకారశాఖ చట్టంలోని 79, 83 సెక్షన్లు అదనంగా కలిపాం.