రేపు దేవస్థానం భూమికి వేలం
ABN , First Publish Date - 2023-07-14T00:56:52+05:30 IST
రాజమహేంద్రవరం రూరల్ మండలం కాతేరు గ్రామంలో గోదావరి గట్టుకు దిగువన ఉన్న మార్కండేయస్వామి, కేశవస్వామి దేవస్థానాల కు చెందిన భూమి ఇంతకాలం ఇసుక ర్యాంప్లకు సబ్ లీజులకు ఇచ్చారని రద్దుచేసి మళ్లీ వేలం పాటకు దేవదాయశాఖ సిద్ధమైంది.
మళ్లీ ఇసుక ర్యాంపులకు కేటాయించేందుకు అధికారుల ఆరాటం?
రాజమహేంద్రవరం రూరల్, జూలై13: రాజమహేంద్రవరం రూరల్ మండలం కాతేరు గ్రామంలో గోదావరి గట్టుకు దిగువన ఉన్న మార్కండేయస్వామి, కేశవస్వామి దేవస్థానాల కు చెందిన భూమి ఇంతకాలం ఇసుక ర్యాంప్లకు సబ్ లీజులకు ఇచ్చారని రద్దుచేసి మళ్లీ వేలం పాటకు దేవదాయశాఖ సిద్ధమైంది. ఈనెల 15న ఆయా భూములకు వేలంపాట పెట్టాలని ప్రకటించి కూడా ఏ కారణం చేత ఈ భూములు లీజులు రద్దుచేశారో అదే సబ్ లీజులకు మళ్లీ ఇచ్చేందుకు ఇసుక ర్యాంప్ నిర్వహిస్తున్న వారు సిద్ధమవుతున్నారు. ఏడాదికి కేవలం రూ20, 30వేలకు సర్వే నంబరు 44/1లో ఉన్న 0.63 ఎకరాలు, 44/2లో ఉన్న 0.82 ఎకరా భూములను వేలంపాటలో గుట్టుచప్పుడు కాకుండా దక్కించుకుని దానిని ఇసుక ర్యాంప్లు నిర్వహించే సొసైటీలకు 6 నుంచి 8లక్షలకు అద్దెలకిచ్చి లక్షలు సంపాదిస్తున్నారు. అదే భూముల్లో అక్రమఇసుక వ్యాపారాలు చేస్తున్నారు. అది వెలుగులోకి వస్తే ఈ లీజులను దేవదాయశాఖ ప్రత్యేక అధికారాలతో రద్దు చేసింది. ఈసారీ కూడా వేలం పాటలో సదరు ర్యాంప్ల నిర్వాహకులు దక్కించుకుని మళ్లీ పాతపాటే పాడేటట్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో దేవదాయశాఖ ఈ భూములపై ఎలాంటి నిబంధనలు పెడుతుందో, ప్రధాన లీజుదారుడు సబ్ లీజులకు ఇచ్చే అవకాశం, అక్రమ ఇసుక ర్యాంప్ల నిర్వహణకు ఇచ్చే అవకాశాలు లేకుండా ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందో వేచిచూడాలి. చట్ట ప్రకారం దేవదాయశాఖ భూములలో వ్యవసాయం, మరేదైనా పంటలు, ఫలాసాయం వంటి వాటికి మాత్రమే అనుమతులు ఉంటాయి. కానీ ఇసుక ర్యాంప్ల నిర్వహణకు సొసైటీలకు లీజ్లు ఇచ్చే అవకాశం లేదు. మరి ఈ దఫా ఏం జరుగుతుందో వేచి చూడాలి.