ధాన్యం కొనుగోళ్లు నిల్
ABN , First Publish Date - 2023-11-06T00:18:44+05:30 IST
ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతుకు వేదనే మిగులుతుంది. అన్నదాతలను కష్టాలు వెంటాడుతున్నాయి. సంచుల కొరత, రవాణా సమస్య, హమాలీ జట్టు కూలీల సొమ్ములు పెంపుదల వంటి అంశాలు గోరుచుట్టుపై రోకలిపోటులా రైతులను కలవరానికి గురి చేస్తున్నాయి. రెండు రోజులుగా మారుతున్న వాతావరణ పరిస్థితులతో చేతికందిన పంటను ఎలా ఒబ్బిడి చేసుకోవాలో తెలియక సతమతమవుతున్నారు.
సామర్లకోట, నవంబరు 5: ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతుకు వేదనే మిగులుతుంది. అన్నదాతలను కష్టాలు వెంటాడుతున్నాయి. సంచుల కొరత, రవాణా సమస్య, హమాలీ జట్టు కూలీల సొమ్ములు పెంపుదల వంటి అంశాలు గోరుచుట్టుపై రోకలిపోటులా రైతులను కలవరానికి గురి చేస్తున్నాయి. రెండు రోజులుగా మారుతున్న వాతావరణ పరిస్థితులతో చేతికందిన పంటను ఎలా ఒబ్బిడి చేసుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. ధాన్యం కొనుగోలులో ధాన్యం నమూనాలు విశ్లేషణ నుంచి రవాణా దిగుమతులు వంటి అన్ని పనులూ అధికారులే చూసుకుంటారని ప్రభుత్వం ఆర్భాటపు ప్రకటనలు గుప్పిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటుందని పలువురు రైతులు వాపోతున్నారు. శని, ఆదివారాలలో ఉదయం నుంచి మబ్బులతోనూ, చలిగాలులతోనూ వాతావరణం మారడంతో రైతుల్లో గుబులు నెలకొంది. శుక్రవారం సామర్లకోట మండలంలో జిల్లా స్థాయిలోనే మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి జిల్లా వ్యాప్తంగా కొనుగోళ్లు ప్రారంభించామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే 24 గంటలలోనే శనివారం నాటికి సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. శనివారం వాతావరణ పరిస్థితులకు రైతులు తమ వద్ద ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయించేందుకు ముందుకు వచ్చినా రైతు భరోసా కేంద్రాల వద్ద సర్వర్ పనిచేయడం లేదంటూ ఒకరు, ఆదివారం తీసుకుంటాం ఇంకా ఆరబెట్టండి అని మరొకరు చెప్పి రైతులను వెనక్కి పంపించేశారు. ఆదివారం కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు కలవరపడుతున్నారు. ఏవేవో సాకులు చెబుతూ ఆర్బీకేల సిబ్బంది రైతులతో ఆటలాడుకుంటున్నారని వేట్లపాలానికి చెందిన పది ఎకరాలు సాగుచేస్తున్న గండ్రోతుల శ్రీను అనే రైతు వాపోయాడు. తన వద్ద సుమారు 380 బస్తాల ధాన్యం ఉందని తీసుకోమంటే సర్వర్ పనిచేయడం లేదని చెప్పారని వాపోయాడు. మారుతున్న వాతావరణ పరిస్థితులతో ఈ ధాన్యాన్ని ఎక్కడ దాచుకోవాలో తెలియడం లేదని శ్రీను వాపోయాడు. అసలు ధాన్యం కొనుగోలు బాధ్యతలు పూర్తి స్థాయిలో వ్యవసాయ శాఖ చూస్తుందా, రెవెన్యూ శాఖ చూస్తుందా, సివిల్ సప్లయ్స్ శాఖ చూస్తుందా అనే అనుమానాలు రైతుల్లో వ్యక్తం అవుతున్నప్పటికీ ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వ ధాన్యం కొనుగోలు వ్యవహారం తూతూమంత్రంగా సాగుతుందని పలువురు రైతులు వాపోతున్నారు. ప్రారంభం రోజున మాత్రమే అతి కష్టం మీద 112 క్వింటాళ్ల ధాన్యాన్ని పెదబ్రహ్మదేవంలో కొనుగోలు చేశారు. రెండు, మూడో రోజుల్లో సామర్లకోట మండలంలో కెనాల్ రోడ్లో ఒక్క కిలో ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయకపోవడం గమనార్హం. హమాలీ, రవాణాలకు సంబంధించి బస్తాకు గత ఏడాది రూ.60 వరకూ వసూలు చేయగా అది నేడు బస్తాకు రూ.100 వరకూ పెంపుదల చేశారు. రైతులు సరఫరా చేసిన ధాన్యానికి సంబంధించి హమాలీ, రవాణా బిల్లులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ బిల్లుల మంజూరులో జాప్యం వల్ల రైతులే ముందుగా హమాలీ, రవాణా చార్జీలు పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఏకంగా బస్తాకు రూ. 40లు పెంచారని రైతులు వాపోతున్నారు. నిబంధనలు ప్రకారం ప్రభుత్వమే భరించే ఈ సొమ్ములకు ప్రతి జిల్లాకు రూ. కోటి నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తున్నప్పటికీ వాటి జాడ కానరావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ముందుగా పెట్టుబడులు పెట్టిన రైతులకు ఆ డబ్బు తిరిగి వస్తుందో, లేదో తెలియని పరిస్థితి ఉంది.