అడుగు తడబడితే..నీటిలో ప్రాణాలు!
ABN , First Publish Date - 2023-07-21T01:11:41+05:30 IST
ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగే గానీ యంత్రాంగం రం గంలోకి దిగేట్లు కనిపించడం లేదు. అల సత్వం ప్రమాదానికి దారి తీసేలా ఉంది.
రాజమహేంద్రవరం, జూలై 20 (ఆంధ్రజ్యోతి): ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగే గానీ యంత్రాంగం రం గంలోకి దిగేట్లు కనిపించడం లేదు. అల సత్వం ప్రమాదానికి దారి తీసేలా ఉంది. రాజమహేంద్రవరం వద్ద అఖండ గోదావరి ప్రవహి స్తుంది. దీని వల్ల ప్రవాహం ఒడి ఎక్కువగా ఉంటుంది. గోదావరికి వరదపోటు మొదలైంది. నెమ్మదిగా ఉధృతి పెరుగుతోంది. ఎగువన భద్రాచలంలో కూడా ప్రమాద హెచ్చరికల స్థాయికి చేరు కుంది. ఆ ప్రవాహం దిగువకు పరుగులు పెడుతోంది. అయితే జిల్లా యంత్రాంగం ఇంకా ముందస్తు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించలేదని పిస్తోంది. జిల్లా వ్యాప్తంగా గోదావరి పరీవాహక ప్రాంతంలో ప్రమాదకరమైన రేవులు ఉన్నాయి. గోదావరి వరద ప్రారంభం నుంచే వాటి వద్ద రక్షణ చర్యలు చేపడతారు. బారికేడ్లు కట్టడం, సూచన బోర్డులు, పడవలు, గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయడం, సిబ్బందిని పహారా పెట్టడం, గట్లపై ఎవరైనా సంచరిస్తే హెచ్చరించడం వంటివి చేస్తుంటారు. అయితే ప్రస్తుతం అవేమీ కనిపించడం లేదు. వరద ప్రారంభమయ్యాక ఎర్రనీరు రావడంతో ఆ ప్రవాహాన్ని చూడడానికి జనం ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలో ప్రమాదాల బారిన పడిన ఘటనలు ఉన్నాయి. కాళ్లు తడుపుకోడానికి, గోదావరి నీళ్లు తలపై చల్లుకోడానికి ప్రవాహం దగ్గరకు వెళ్తారు.ఏ మాత్రం అదుపుతప్పితే ఊహించని ఘటనలు ఎదురవుతాయి.కోటిలింగాల ఘాట్ మొదలు కొని, గణపతి ఘాట్, దుర్గా ఘాట్, పుష్కరాల రేవు, లాచీల రేవు, మార్కండేయ ఘాట్, దోబీ ఘాట్, గౌతమి ఘాట్ తదితర రేవులు ఉన్నాయి. వరద పెరిగినప్పుడు ప్రవాహం ఎక్కు వగా ఉంటుంది. ఏ మాత్రం ఆదమరుపుగా ఉన్నా ప్రాణాలు దక్కవు. గట్ల చివర నిల్చుంటే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్టే. ముఖ్యంగా పిల్లల విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. దీంతో ప్రవాహం వద్దకు ఎవరూ వెళ్లకుండా కర్రలు అడ్డంగా కట్టి బారికేడింగ్ ఏర్పాటు చేస్తారు. మరీ ప్రమాదకరమైన ఘాట్ల వద్ద పహారా ఏర్పాటు చేస్తారు. ఇదంతా వరద మొదలైన నాటి నుంచే జరుగుతుంది. కానీ ఈ సారి ఎందుకనో యంత్రాంగం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. దోబీ ఘాట్, లాంచీ రేవు వద్ద మరీ ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. రక్షణ ఏర్పాట్లు లేకపోవడంతో గోదావరి గట్టు చివర్ల వరకూ సందర్శకులు వెళుతున్నారు. ఏ మాత్రం జారినా ప్రాణాలు గోదావరిలో కలిసిపోయినట్లే.