Share News

గట్టు చూస్తే.. గుండె జారిపోద్ది ఒట్టు!

ABN , Publish Date - Dec 18 , 2023 | 01:02 AM

ఏటిగట్లు ఆధునికీకరణ ఏనాడో మర్చిపోయారు.. గతంలో గోదావరి వస్తుందంటే చాలు ఏటిగట్లు ఆధునీకరించేవారు. గత నాలుగన్నరేళ్లు ఏమైందో ఏమో కానీ అసలు ఆ ఊసే లేదు.

గట్టు చూస్తే.. గుండె జారిపోద్ది ఒట్టు!
పెరవలి మండలం తీపర్రులో జారిన ఏటిగట్టు

పెరవలి, డిసెంబరు 17 : ఏటిగట్లు ఆధునికీకరణ ఏనాడో మర్చిపోయారు.. గతంలో గోదావరి వస్తుందంటే చాలు ఏటిగట్లు ఆధునీకరించేవారు. గత నాలుగన్నరేళ్లు ఏమైందో ఏమో కానీ అసలు ఆ ఊసే లేదు. జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతం ఎక్కువ.. రాజమహేంద్రవరం కొవ్వూరు మధ్య ఉన్న అఖండ గోదావరి ధవళేశ్వరం బ్యారేజీ దాటిన తరువాత చిన్న చిన్న పాయలుగా విడిపోయి ప్రవహిస్తోంది. దీంతో గోదావరి వరద పెరుగుతుందంటే జిల్లా వాసుల గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. ఎందుకంటే ఎక్కడ గోదావరి గట్టు తెగినా జీవితాలు గోదారే.. మళ్లీ 1986 పునరావృతం అవుతోంది. కొవ్వూరు మండలం వాడపల్లి, ధవళేశ్వరం, పెరవలి మండల పరిధిలో కానూరు, ఉసులుమర్రు, తీపర్రు, కాకరపర్రు, ముక్కామల, ఖండవల్లి, మల్లేశ్వరం గ్రామాల పరిధిలో గోదావరి ఏటిగట్టు ఉంది. గత వర్షాలకే జిల్లా వ్యాప్తంగా ఏటిగట్లు దెబ్బతిన్నాయి.అయితే ఇటీవల తుఫాన్‌ కారణంగా కురిసిన కుండపోత వర్షానికి ఏటిగట్టు పైనుంచి నీరు కిందకు జారే క్రమంలో చాలా చోట్ల మట్టి కూడా కోతకు గురైంది. జిల్లాల వ్యాప్తంగా చాలా చోట్ల జరగడంతో ఏటిగట్టు బలహీనపడిందని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో గోదావరి గట్లను పటిష్టం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. వరదలు వస్తే ప్రమాదం సంభవించే అవకాశం ఉందని భయపడుతున్నారు.

Updated Date - Dec 18 , 2023 | 01:02 AM