..ప్చ్.. కంగారెత్తిపోయాం!
ABN , First Publish Date - 2023-11-20T00:21:25+05:30 IST
ఉత్కంఠ.. ఉద్వేగం.. ఉద్విగ్నం.. నిరాశ.. హుషారు.. చిరు ఆశ.. చివరికి ఆవేదన.. ఇదీ ఆదివారం జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్ క్లుప్తంగా.

తీవ్ర నిరాశలో క్రికెట్ అభిమానులు
మ్యాచ్ ఆరంభంలో కేకలు..ఈలలు
కాసేపటికే చల్లబడిన అభిమానం
భారీ స్ర్కీన్ల వద్ద ఆవహించిన నిశ్శబ్దం
చివరికి ఖాళీగా మిగిలిన గ్రౌండ్లు
కన్నీళ్లు పెట్టుకున్న క్రీడాభిమానులు
ఎక్కడా తగ్గని బెట్టింగ్ బాబులు
జిల్లాలో వందల కోట్లు ఆడేసిన వైనం
రాజమహేంద్రవరం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) : ఉత్కంఠ.. ఉద్వేగం.. ఉద్విగ్నం.. నిరాశ.. హుషారు.. చిరు ఆశ.. చివరికి ఆవేదన.. ఇదీ ఆదివారం జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్ క్లుప్తంగా. ఏదేమైనా క్రికెట్ అభిమానులు భయపడినట్లే జరిగింది.మూడోసారీ అభిమానుల కల చెది రింది. ప్రపంచ కప్లో భారత్ టీంని ఆవహించిన ఫైనల్ ఫోబియాదే మళ్లీ గెలుపైంది. కంగారు గెలిచింది.. ఇం డియా ఓడింది. ఈ వరల్డ్కప్లో మంచి ఫాంతో అన్ని మ్యాచ్లలో తీవ్ర ప్రతిభ చూపిన ఇండియా టీం చివరిలో చతికిలపడింది. అభిమానుల కళ్లు నీళ్లతో నిండిపోయాయి. ఆరు వికెట్ల తేడాతో లక్ష్యాన్ని ఛేదించిన ఆస్ట్రేలియా.. ప్రపంచ విజేతగా ఆరోసారి క్రికెట్ శిఖరాన్ని సునాయా సంగా అధిరోహించింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ప్రపంచకప్ ఫైనల్ బరిలో భారత్ ఉండడంతో జిల్లా అంతా టీవీలకు అతుక్కు పోయింది. హోటళ్లు, బార్లు, వాణిజ్య సముదాయాలు, షాపింగ్ మాల్స్, షోరూంలు ఇలా ఎక్కడ చూసినా టీవీల్లో మ్యాచ్ రన్నవుతూ కనిపించింది. టీవీ షోరూం లలో అన్ని టీవీల్లోనూ క్రికెట్ కొనసాగింది. రాజకీయ నాయకులు ఇతర వ్యక్తులు అక్కడక్కడా ఏర్పాటు చేసిన భారీ స్ర్కీన్ల వద్ద యువత జాతరను మైమరపించారు. అరుపులు, కేకలు, కేరింతలు, ఈలలు, గోలలతో హోరెత్తి పోయింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకొని వ్యూహాన్ని రక్తికట్టించింది. బ్యాటింగ్కి దిగిన మన వీరు లను యావత్ భారతం దీవించింది. అయితే సహజంగా ఒంటబట్టిన ఫైనల్ ఫోబియా తలచుకొంటే గుండెల్లో దడ బయలుదేరింది. మ్యాచ్ మొదలైన మొదటి ఓవర్ కాస్త నీరసంగా గడిచింది. బౌలింగ్కి పూర్తిగా సహకరించే పిచ్ కావడంతో బ్యాటింగ్ కాస్త వెనక్కి తగ్గక తప్పని పరిస్థితి. 8వ బాల్లో రోహిత్ మొదటి ఫోర్ కొట్టడడంతో యువత కేరింతలు అహ్మదాబాద్కి వినిపించాయి. అంతే దూకుడు గా తర్వాత బౌండరీకి పంపించడంతో అరుపులు ఆకాశా న్నంటాయి. 23వ బాల్ని నేరుగా ప్రేక్షకుల గ్యాలరీకి పంపి మొదటి సిక్స్ నమోదు చేయడంతో అభిమానులు ఉర్రూతలూగారు. నాలుగో ఓవర్లో సినీ హీరో నాని తెలుగు కామెంట్రీ మైక్ అందుకొని హుషారుకు కాసింత ఆజ్యం పోశారు. తీరా పరుగుల వేట మొదలైందని సంబరపడుతున్న తరుణంలో ఐదో ఓవర్లో మొదటి వికెట్ గిల్ రూపంలో పెవీలియన్ దారి పట్టడం తో క్రికెట్ స్ర్కీ న్లకు అంటుకు పోయిన కళ్లు ఉసూరుమన్నాయి. అక్కడి నుంచి స్కోరు నెమ్మదించింది. 76 స్కోరు ఉండగా రోహిత్, వెంటనే 81 వద్ద శ్రేయాస్ తిరుగుముఖం పట్టడంతో అభిమానుల్లో డీలా మొద లైంది. అయితే, 2011 ప్రపంచ కప్లో 274 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి భారత్ విజేతగా నిలిచిన విషయం జగద్వితమే. అప్పట్లో క్రికెటర్ల ఆరాధ్య రూపమైన సచిన్ ఆ మ్యాచ్లో కేవలం 18 పరుగులు చేసి ఔటయ్యే సమయానికి మన స్కోరు 31 మాత్రమే. భారత్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే సెహ్వాగ్ ఏమీ కొట్టకుండానే వెను దిరిగడంతో టీం ఇండియా కష్టాల్లో పడింది. ఇలా అప్పటి రోజులను గుర్తు చేసుకుంటూ ఊరడించుకొని భారత్ టీంకి మౌనంగా ధైర్యం చెప్పారు. మొత్తానికి పోరాడి 240 పరుగులు చేసి భారత్ జట్టు ఆలవుట్ అయ్యింది. అస్ట్రేలియా బ్యాటింగ్ మొదలు పెట్టిన తర్వాత భారత్ అభిమానులు కాస్త కంగారు పడ్డారు. మొదట్లో స్కోరు లాగించినా వికెట్లు పడడం ప్రారంభం కావడంతో వారికి ఊరట లభించింది. 47 పరుగుల వద్ద ఏడు ఓవర్లకు మూడో వికెట్ ఎగిరిపోవడంతో బూమ్ బూమ్ బూమ్రా అంటూ అరుపులు బూమ్రా కు వినిపించేలా మారు మోగాయి. అదే అటలో చివరి ఆనందం.. ఆ తరువాత అంతా నిరాశే.. ఎందుకంటే అప్పటి నుంచి ఒక్క వికెట్ పడలేదు.. మెల్లమెల్లగా క్రికెట్ అభిమానులంతా జారు కున్నారు.. చాలా మంది చివరి వరకూ ఏదో ఒక మ్యాజిక్ జరగబో తుందా అని ఎదురుచూశారు. ఎటు వంటి మ్యాజిక్ లేదు. అంతా నిరాశే.. రాజమహేంద్రవరంలో జాంపేట వద్ద ఉన్న చర్చిగ్రౌండ్ ఒక స్ర్కీన్, ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్లో మరొక భారీ స్ర్కీన్ ఏర్పాటు చేశా రు.ఆయా స్ర్కీన్ల వద్దకు వేలాది మంది క్రికెట్ అభిమా నులు చేరారు.ఆరంభంలో అరుపులు కేకలతో దద్దరిల్లిన గ్రౌండ్లు చివరికి భరించలేని నిశ్శబ్దం ఆవహించింది.
‘లెక్క’ లేకుండా ఆడేశారు!
జోరుగా సాగిన బెట్టింగ్
ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్ బేజారు లేకుండా జోరుగా సాగింది. సెల్ఫోన్లలో వందల కోట్ల అక్రమ వ్యాపారం అడ్డూ అదుపూ లేకుండా సాగిం ది. ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ మొదటి నుంచీ తీవ్ర ఉత్కంఠతో సాగడం బుకీలకు బాగా కలిసొచ్చింది. మొదట్లో భారత్ దూకుడుగా ఆడినా గిల్, రోహిత్ అవుట్ కావడంతో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. అసలు భారత్ స్కోరు 300 కూడా దాటదని ఒకరు, 325 దాటుతుందని మరొకరు.. ఇలా ఎవరి అంచనాలతో వాళ్లు పందేల్లో పైసలు పెట్టారు. రోహిత్ వేగం పెంచడంతో అర్ధ శతకం, శతకం బాదేస్తాడంటూ బాలుబాలుకూ రేట్లు కొనసాగాయి. అస్ట్రేలియా బ్యాటింగ్ మొదలు పెట్టాక భారత్ బౌలింగ్పై బెట్టింగ్ జోరందుకొంది. బౌలర్ను బట్టి ధరలు, బౌండరీకో ఽరేటు, వికెట్లో వెల.. ఇలా క్రికెట్ బెట్టింగ్ భూతం యువతను మత్తెక్కించి చిత్తుచేసింది. బెట్టింగ్లు పాల్పడేందుకు యువత లాడ్జి రూమ్లను బుక్ చేసుకున్నట్టు తెలిసింది. దీంతో నగరంలో లాడ్జిలలో రూమ్లే లేకుండాపోయాయి. పోలీసుల నిఘా అనేది ఎక్కడా ఉన్నట్టు కనిపించలేదు. అసలు బెట్టింగ్ పట్టిం చుకున్నట్లే పరిస్థితి లేదని విమర్శలు వినిపించాయి. ఎందుకనో ఈసారి క్రికెట్ బెట్టింగ్ విషయంలో పోలీసులు బాగా ఉదారంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. గత మ్యాచ్లకు పోలీసులు తప్పనిసరిగా బెట్టింగ్ అను మానిత ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టేవారు. ఈ సారి అటువంటిదేం లేదు. మామూళ్ల మత్తులో జోగుతున్న పోలీసులు ఆ వైపు దృష్టి సారించకపోవడం గమనార్హం.