చక్రద్వారబంధంలో విషాదం
ABN , Publish Date - Dec 22 , 2023 | 12:29 AM
బిల్డింగ్పై ఆటలు ఆడుకునేందుకు వెళ్లిన ఇద్దరు చిన్నారులను వాటర్ ట్యాంకు మృత్యువు రూపంలో బలి గొంది. చిన్నారులిద్దరికి పక్కపక్క ఇళ్లు కావడంతో ఆడుకునేందుకు భవనం పైకి ఎక్కి ప్రమాదవశాత్తూ ట్యాంకులో పడి ప్రాణాలు విడిచారు.
వాటర్ ట్యాంకులో పడి ఇద్దరు చిన్నారుల మృతి
రాజానగరం, డిసెంబరు 21: బిల్డింగ్పై ఆటలు ఆడుకునేందుకు వెళ్లిన ఇద్దరు చిన్నారులను వాటర్ ట్యాంకు మృత్యువు రూపంలో బలి గొంది. చిన్నారులిద్దరికి పక్కపక్క ఇళ్లు కావడంతో ఆడుకునేందుకు భవనం పైకి ఎక్కి ప్రమాదవశాత్తూ ట్యాంకులో పడి ప్రాణాలు విడిచారు. రాజానగరం మండలం చక్రద్వారబంధం గ్రామంలో గురువారం సాయంత్రం జరిగిన ఈ విషాద సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కమ్మిల రాము కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈయనకు ఒక పాప, బాబు ఉన్నారు. బాబు జశ్వంత్(3) ఓ ప్రైవేటు పాఠశాలలో నర్సరీ చదువు తున్నాడు. ఇదే ఇంటిని ఆనుకుని ఉన్న ఇంటిలో గట్టెం శ్రీను నివసిస్తున్నాడు. అతనికి కుమార్తె వినిత (3) ఉంది. గురువారం సాయంత్రం జశ్వంత్ స్కూల్ నుంచి ఇంటికి రాగానే వినిత, జశ్వంత్ కలిసి ఆడుకునేందుకు శ్రీను భవనం పైకి ఎక్కారు. శ్రీను ఇంటిపై ఉన్న భారీ నీటి తొట్టెకు అమర్చిన నిచ్చెన ఎక్కి ప్రమాదవ శాత్తూ పడిపోయారు. ఎంతసేపటికి పిల్లలు కనిపించకపోవడంతో అంతా వెతికి డాబా పైకి ఎక్కి చూసే సరికి నీటిలో పడి ఉన్నారు. అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారులిద్దరినీ జీఎస్ఎల్ ఆస్పత్రి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. శ్రీను తండ్రి గట్టెం సుబ్బారావు కొన్నేళ్లుగా ట్రాక్టర్ల ద్వారా నీటిని విక్రయిస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే డాబాపై దాదాపు రెండు ట్యాంకర్ల నీటి పరిమాణం కలిగిన భారీ నీటి తొట్టెను నిర్మించాడు. ట్యాంకుకు నిచ్చెన అమర్చి ఉండడంతో చిన్నారులు ఆడుకుంటూ నిచ్చిన ఎక్కుతూ నీటి తొట్టెలో ప్రమాదవశాత్తూ పడిపోయి ప్రాణాలు కోల్పోయారు. చిన్నారులిద్దరూ డాబాపై ఉన్న ట్యాంకులో పడి మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుము కున్నాయి.