2047కి బలమైన ఆర్థిక శక్తిగా భారత్
ABN , First Publish Date - 2023-12-11T00:32:57+05:30 IST
భారతదేశాన్ని 2047కల్లా ప్రపంచంలోనే బలమైన ఆర్థిక శక్తిగా నిలిపే విధంగా ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో ని కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు చేపడుతుందని కేంద్ర పౌర విమానయాన, ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింథియా పేర్కొన్నారు.
కోరుకొండ, డిసెంబరు 10 : భారతదేశాన్ని 2047కల్లా ప్రపంచంలోనే బలమైన ఆర్థిక శక్తిగా నిలిపే విధంగా ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో ని కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు చేపడుతుందని కేంద్ర పౌర విమానయాన, ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింథియా పేర్కొన్నారు. కోరుకొండ మండలం దోసకాయపల్లిలో ఆదివారం జరిగిన వికసిత భారత్ సంకల్ప యాత్రలో ఆయన మాట్లాడారు. మహిళా సాథికారతకు పంట పొలాల్లో డ్రోన్లు ఉపయోగించి విత్తనాలు, ఎరువులు వెదజల్లే కార్యక్రమంలో 17 వేల మంది మహిళలకు డ్రోన్ అక్క పథకం కింద ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. మీలో ఎంత డ్రోన్ అక్కలు ఉన్నారని చేతులు ఎత్తమని కేంద్రమంత్రి కోరారు. డ్రోన్ పరికరాన్ని 80 శాతం సబ్సిడీతో కేంద్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు. 20 శాతం మాత్రమే లబ్ధిదారులు వాటాగా చెల్లించాలన్నారు. దేశ వ్యాప్తంగా 9.50 కోట్ల మంది మహిళలకు ఉచితంగా పీఎం ఉజ్వల యోజన కింద ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా తాగునీరు ఇస్తున్నామన్నారు.సమావేశంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందీశ్వరి, డాక్టర్ కె.మాధవీలత, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంద్రవంజిత్, జేసీ ఎం. తేజభరత్, ఆర్డీవో చైత్రవర్షిణి, డీపీవో జె.సత్యనారాయణ, డీఏవో ఎస్.మధుసూధనరావు, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి ఎస్డీజీ గోవింద్ తదితరులు పాల్గొన్నారు.