మెల్లమెల్లగా!
ABN , First Publish Date - 2023-01-18T00:24:33+05:30 IST
పంట సాగు చేయాలంటే నీళ్లు ఒకటే ఇస్తే సరిపోతుందా.. రైతు భరోసా రూ.2 వేలతో నారుమడులు పూర్తయిపోతాయా.. చేతినిండా సొమ్ములుంటేనే నాట్లు పడతాయ్.. లేదంటే రైతులకు పాట్లే.. ప్రస్తుతం అన్నదాత పరిస్థితి ఇలాగే ఉంది..
నాట్లు వేసేందుకు రైతుల పాట్లు
తగ్గిన సాగు వేగం
జిల్లాలో 44 శాతమే నాట్లు
మిగిలింది 56 శాతం
తాళ్లపూడిలో అత్యల్పం
నెలాఖరుకి అనుమానమే
మిగిలిన ఖరీఫ్ ధాన్యం
ఇంకనూ రూ.60 కోట్లు బాకీ
గోదావరిలో తగ్గుతున్న నీరు
అయోమయంలో రైతాంగం
పంట సాగు చేయాలంటే నీళ్లు ఒకటే ఇస్తే సరిపోతుందా.. రైతు భరోసా రూ.2 వేలతో నారుమడులు పూర్తయిపోతాయా.. చేతినిండా సొమ్ములుంటేనే నాట్లు పడతాయ్.. లేదంటే రైతులకు పాట్లే.. ప్రస్తుతం అన్నదాత పరిస్థితి ఇలాగే ఉంది.. ఖరీఫ్ పండింది.. ప్రభుత్వానికి విక్రయించాడు.. అయితే చాలా మందికి సొమ్ములు పడలేదు. ఇదిలా ఉంటే ఇంకా సగం ధాన్యం కొనుగోలు చేయకుండానే వదిలేశారు. దీంతో నాట్లు ఆలస్యమవుతున్నాయి.. రబీకి నవంబరు 29వ తేదీనే ముందస్తుగానే నీరు విడుదల చేశామని అధికార పార్టీ నాయకులు జబ్బలు చరుచుకున్నా నాట్లు మాత్రం ఇంకా పడుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ జిల్లాలో 44 శాతం మాత్రమే నాట్లు పడ్డాయ్.. మిగిలిన 56 శాతం సా..గుతున్నాయ్..
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
రబీ వరి సాగుకు కష్టాలు తప్పవేమో! ముం దస్తుగా నీరు విడుదల చేసినా నాట్లు బాగా ఆలస్యం అవుతున్నాయి. ఇప్పటికే నాట్లు పూర్తయి ఉంటే రబీ ఆశలు బాగుండేవి.ఇప్పటికి కేవలం జిల్లాలో 44 శాతం మాత్రమే నాట్లు పడ్డా యి.ఈ నెలాఖరుకి పూర్తవుతాయో లేదో కూడా చెప్పలేని పరిస్థితి. వైసీపీ ప్రభు త్వం ముందస్తు దాళ్వా అని చెబుతూ నవంబరు 29వ తేదీనే కాలువలకు నీరు విడుదల చేసింది. కానీ గోదావరిలో నీరు ఖాళీ అయిపోవడం తప్పితే ప్రయోజనం ఏమీ కనిపించలేదు. కాలువలు తెరిచినంత మాత్రాన రబీ సాగుకు రైతు ముం దుకు వెళ్లలేడు కదా.ఖరీఫ్ ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయకుండా రబీని ప్రారంభించడం ఇబ్బందికరంగా మారింది. పైగా ఖరీఫ్ కోతలు ఆలస్యమయ్యాయి.ఆ ప్రభా వం రబీ పంటపై పడింది. డిసెంబరు నెలలో నాట్లు పూర్తయితే రబీ అను కున్న సమయానికి పూర్తయ్యేది. ఇది నాలుగు నెలల పంట. ఇప్పటికింకా 44 శాతమే నాట్లు వేశారు. ఇంకా 56 శాతం నాట్లు వేయాల్సి ఉంది. నెలాఖరుకి పూర్తయినా ఏప్రిల్ చివరకు గానీ పంట రాదు. దీంతో నీటి సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉంది. జిల్లాలో సాధాణంగా రబీ ఆయ కట్టు 56,433 హెక్టార్లు. ఇది కేవలం వరికి సంబంధించినది మాత్రమే. జిల్లా రబీ ఆయకట్టు పూర్తిగా డెల్టా కాలువలపై ఆధారపడిలేదు. మెట్ట, ఏజెన్సీ , డెల్టా ప్రాంతాలన్నీ కలసి ఉన్నాయి ఎక్కువగా బోరు బావుల మీద ఆధారపడి ఉంది. ఈ పంట కోసం ఇప్పటి వరకూ 1721 హెక్టార్లలో నారు వేశారు. నేరుగా వెదజల్లే పద్ధతిలో 1242 హెక్టార్లు, సాధారణ ఊడ్పుల కింద 2,869 హెక్టార్లలో మాత్రమే నాట్లు పడ్డాయి. లైన్ నాట్లు 1000 హెక్టార్లలో వేశారు. మొత్తం 25,111 హెక్టార్లలో నాట్లు పూర్తయ్యాయి.జిల్లాలో సగం ధాన్యం కూడా కొనుగోలు చేయలేదు.కొన్న ధాన్యానికి ఇంకా రూ.60కోట్లకు పైగా డబ్బులు రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.
50 శాతం దాటని నాట్లు
జిల్లాలో 19 మండలాలు ఉన్నాయి. రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో వరిసాగు లేదు. రూరల్లో 939 హెక్టార్ల ఆయకట్టు ఉంది. 41 హెక్టార్లలో నారు మడులు వేశారు. 777 హెక్టార్లలో సాధారణ ఊడ్పులు చేశారు. ఇది 83 శాతం.
కడియం మండలంలో 2,324 హెక్టార్ల ఆయకట్టు ఉంది. 80 హెక్టార్లలో నారు మడులు ఉన్నాయి. వెదజల్లే పద్ధతిలో 40 హెక్టార్లు, 1100 హెక్టార్లలో సాధారణ ఊడ్పులు చేశారు.1140 హెక్టార్లలో నాట్లు వేశారు.ఇది 49 శాతం.
రాజానగరం మండలంలో 3264 హెక్టార్ల ఆయకట్టు ఉంది. 163 హెక్టార్లలో నారుమడులు వేశారు. 2,126 హెక్టార్లలో సాధారణ ఊడ్పులు చేశారు. మొత్తం 2126 హెక్టార్లలో నాట్లు పూర్తయ్యాయి. ఇది 65 శాతం.
అనపర్తి మండలంలో 3,836 హెక్టార్ల ఆయకట్టు ఉంది. 23 హెక్టార్లలో నారుమడి వేశారు. వెదజల్లే పద్ధతిలో 498 హెక్టార్లు, 1931 హెక్టార్లలో ఊడ్పు లు చేశారు.మొత్తం 2429 హెక్టార్లలో నాట్లు పూర్తయ్యాయి. ఇది 63 శాతం.
బిక్కవోలు మండలంలో 6218 హెక్టార్ల ఆయకట్టు ఉంది. 12 హెక్టార్లలో నాట్లు వేశారు. వెదజల్లే పద్ధతిలో 700 హెక్టార్లు 1400 హెక్టార్లలో సాధారణ ఊడ్పు లు చేశారు. మొత్తం 2100 హెక్టార్లలో నాట్లు పూర్తయ్యాయి. ఇది 34 శాతం.
కోరుకొండ మండలంలో 1786 హెక్టార్ల ఆయకట్టు ఉంది.30 హెక్టార్లలో నారు మడులు వేశారు.760 హెక్టార్లలో సాధారణ ఊడ్పులు చేశారు. ఇది 43 శాతం.
గోకవరం మండలంలో 1455 హెక్టార్ల ఆయకట్టు ఉంది. 72 హెక్టార్లలో నారు మడులు వేశారు.690 హెక్టార్లలో సాధారణ ఊడ్పులు చేశారు. ఇది 47 శాతం.
సీతానగరం మండలంలో 2305 హెక్టార్ల ఆయకట్టు ఉంది.30 హెక్టార్లలో నారుమడులు వేశారు.825 హెక్టార్లలో ఊడ్పులు చేశారు. ఇది 36 శాతం.
రంగంపేట మండలంలో 831 హెక్టార్ల ఆయకట్టు ఉంది. 25 హెక్టార్లలో నారుమడులు వేశారు. 460 హెక్టార్లలో ఊడ్పులు చేశారు.ఇది 55 శాతం.
చాగల్లు మండలంలో 3421 హెక్టార్ల ఆయకట్టు ఉంది. 155 హెక్టార్లలో నాట్లు వేశారు. మొత్తం 1700 హెక్టార్లలో నాట్లు పూర్తయ్యాయి. ఇది 50 శాతం.
దేవరపల్లి మండలంలో 2416 హెక్టార్ల ఆయకట్టు ఉంది. 62 హెక్టార్లలో నాట్లు వేశారు. 809 హెక్టార్లలో సాధారణ ఊడ్పులు చేశారు. ఇది 33 శాతం.
గోపాలపురం మండలంలో 1569 హెక్టార్ల ఆయకట్టు ఉంది. 20 హెక్టార్లలో నాట్లు వేశారు.మొత్తం 440 హెక్టార్లలో నాట్లు పూర్తయ్యాయి. ఇది 28 శాతం.
కొవ్వూరు మండలంలో 4489 హెక్టార్ల ఆయకట్టు ఉంది. 166 హెక్టార్లలో నాట్లు వేశారు.2200 హెక్టార్లలో సాధారణ ఊడ్పులు చేశారు. ఇది 49 శాతం.
నిడదవోలు మండలంలో 7235 హె క్టార్ల ఆయకట్టు ఉంది.270 హెక్టార్లలో నాట్లు వేశారు.2650 హెక్టార్లలో సాధారణ ఊడ్పులుచేశారు. ఇది 37 శాతం.
పెరవలి మండలంలో 3557 హెక్టార్ల ఆయకట్టు ఉంది. 82 హెక్టార్లలో నాట్లు వేశారు. మొత్తం 1725 హెక్టార్లలో నాట్లు పూర్తయ్యాయి. ఇది 48 శాతం.
తాళ్లపూడి మండలంలో 3224 హెక్టార్ల ఆయకట్టు ఉంది. 150 హెక్టార్లలో నారుమడి వేశారు. 728 హెక్టార్లలో నాట్లు వేశారు. 23 శాతం. జిల్లాలో అతితక్కువ నాట్లు పడిన మండలం ఇదే.
ఉండ్రాజవరం మండలంలో 5057 హెక్టార్ల ఆయకట్టు ఉంది. 240 హెక్టార్లలో నారుమడులు వేశారు.2,552 హెక్టార్లలో ఊడ్పులు చేశారు. ఇది 50 శాతం.
నల్లజర్ల మండలంలో 2507 హెక్టార్ల ఆయకట్టు ఉంది.100 హెక్టార్లలో నారు వేశారు. 1000 హెక్టార్లలో లైన్ ఊడ్పులు చేశారు. ఇది 40 శాతం.
నీటి ఎద్దడి తప్పదా?
నిర్ణీత గడువు ప్రకారం మార్చి 31వ తేదీకి కాలువలు కట్టేస్తారు. తర్వాత వేసవిలో కాలువల పనిచేయవలసి ఉంది. కానీ ప్రస్తుతం రబీ నాట్లు ఆలస్యం కావడం వల్ల ఏప్రిల్ చివరి వరకూ రబీ ఉంటుంది. అందువల్ల మార్చి 31న కాలువలు కట్టే పరిస్థితి లేదు. ఇప్పటికే గోదావరిలో నీటిమట్టం 8.65 అడుగులుగా ఉంది. ఇన్ఫ్లో 8వేలు క్యూసెక్కులు ఉంది. తూర్పు డెల్టాకు 2650, సెంట్రల్ డెల్టాకు 1720, పశ్చిమ డెల్టాకు 4600 క్యూసెక్కులు వస్తుంది. ఇదంతా సీలేరు నీరు. తర్వాత నీటి కొరత ఏర్పడితే సమస్య తప్పదు. దీనికి ఇప్పటి నుంచే అధికారులు సరైన నీటి వినియోగ పద్ధతులను రైతులకు బోధించి పంట గట్టెకిస్తారో లేక పంటకు ఇబ్బంది వస్తుందో చూ డాలి మరి. పంట ఆలస్యం కావడం వల్ల జూన్ 1న కాలువలు తెరవకపోతే ఖరీఫ్ కూడా ఆలస్యం అవుతుంది.