ఆకట్టుకున్న ‘నాన్నా...నేనొచ్చేస్తా’, ‘మనసున మనసై’ నాటిక ప్రదర్శనలు
ABN , First Publish Date - 2023-04-02T01:53:28+05:30 IST
ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లిలో శ్రీగొల్లపల్లి చెల్లయ్య మెమోరియల్ నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉభయ తెలుగు రాష్ర్టాల ఆహ్వాన నాటికల పోటీలు ఘనంగా జరుగుతున్నాయి
ఏలేశ్వరం, ఏప్రిల్ 1: ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లిలో శ్రీగొల్లపల్లి చెల్లయ్య మెమోరియల్ నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉభయ తెలుగు రాష్ర్టాల ఆహ్వాన నాటికల పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. కళాపరిషత్ చైర్మన్, జిల్లా ఎంపీపీల సమాఖ్య అధ్యక్షుడు గొల్లపల్లి నరసింహమూర్తి (బుజ్జి) అధ్యక్షతన రెండో రోజు ప్రదర్శనగా గుంటూరు జిల్లా నుంచి అమృతలహరి దర్శకత్వంలో గంటి రాజేశ్వరి మూలకథ, తాళాబత్తుల వెంకటేశ్వరావు రచన సహకారంతో ‘నాన్నా నేనొచ్చేస్తా’ అనే నాటికను మొదట ప్రదర్శించారు. పెళ్లిచేసి పుట్టింటి నుంచి అత్తారింటికి పంపిన తమ కూతురు నాన్నా నేనొచ్చేస్తా అన్న మాటలకు స్వస్తిపలికి, నాన్నా మీరు మా ఇంటికి ఎప్పుడొస్తారని ఆహ్వానం పలికే మంచి రోజులు రావాలని కోరుతూ పండంటి కాపురంతో పవిత్రమైన భార్యభర్తల బంధం గురిం చి వివరిస్తూ ప్రదర్శన కొనసాగింది. అలాగే ఏలూరు జిల్లా నుంచి ఎండీ ఖాతావల్లి దర్శకత్వంలో చింతపల్లి మల్లేశ్వరరావు, పి.కృష్ణహితే్షల రచనా సహకారంతో ‘మనసున మనసై’ అనే సందేశాత్మక నాటిక ప్రదర్శన కొనసాగింది. కష్టపడి పెంచిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో చూడకుండా ఆదరించని కుమారుల తీరును ఇందులో కళ్లకు కట్టినట్టు చూపారు. ఎంపీపీ బుజ్జి ఆధ్వర్యంలో కమిటీ ప్రతినిధులు కళాకారులకు బహుమతులు, పారితోషకాన్ని అందించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి గంగాధరరావు, సుంకర సత్తిబాబు, గొల్లపల్లి కృష్ణవంశీ, శెట్టి వెంకటఅప్పారావు, కర్రి కృష్ణ, గొల్లపల్లి చిన్నా, మౌళి, సప్పా అచ్చిరాజు పాల్గొన్నారు.