CM Jagan Tour: మూడు రోజుల పాటు వైఎస్సార్ జిల్లాలో జగన్ పర్యటన... షెడ్యూల్ ఇదే..

ABN , First Publish Date - 2023-07-07T14:05:17+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారైంది.

CM Jagan Tour: మూడు రోజుల పాటు వైఎస్సార్ జిల్లాలో జగన్ పర్యటన... షెడ్యూల్ ఇదే..

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) వైఎస్సార్ జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రేపటి (శనివారం) నుంచి జూలై 10 వరకు మూడు రోజుల పాటు వైఎస్సార్ జిల్లాలో సీఎం పర్యటించనున్నారు. జూలై 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. రేపు మధ్యాహ్నం 2:05 గంటలకు వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్‌కు సీఎం చేరుకోనున్నారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద జగన్ నివాళులర్పించనున్నారు. అనంతరం ఇడుపులపాయలో ముఖ్యమంత్రి నివాసానికి సీఎం చేరకుంటారు.

రెండోరోజు ఇలా...

వైఎస్సార్ జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా 9న ఉదయం 9:20 గంటలకు గండికోట చేరుకోనున్న జగన్.. గండికోట వద్ద ఒబెరాయ్‌ హోటల్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆపై వ్యూ పాయింట్‌ను పరిశీలించనున్నారు. ఆ తర్వాత పులివెందుల చేరుకుని నూతనంగా నిర్మించిన మున్సిపల్‌ ఆఫీసు భవనాన్ని సీఎం జగన్ ప్రారంభోత్సవం చేయనున్నారు. అనంతరం పులివెందుల, రాణితోపు చేరుకుని నగరవనాన్ని ప్రారంభిస్తారు. అక్కడ నుంచి గరండాల రివర్‌ ఫ్రెంట్‌ చేరుకుని... గరండాల కెనాల్‌ డెవలప్‌మెంట్‌ ఫేజ్‌ –1 పనులను ప్రారంభించనున్నారు. ఆపై పులివెందులలోని నూతనంగా నిర్మించిన (వైఎస్‌ఆర్‌ ఐఎస్‌టీఏ) స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఆ తర్వాత పులివెందులలోని ఏపీ కార్ల్‌లో ఏర్పాటు చేసిన న్యూ టెక్‌ బయో సైన్సెస్‌‌ను ప్రారంభించనున్నారు. తిరిగి మధ్యాహ్నం 2:30 గంటలకు పులివెందులలో వైఎస్‌ఆర్‌ స్పోర్ట్స్‌ అకాడమీకి సీఎం జగన్ ప్రారంభోత్సవం చేయనున్నారు. కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి ఇడుపులపాయ చేరుకోనున్నారు.

మూడోరోజు పర్యటన వివరాలు

మూడోరోజూ జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి ఉదయం 9 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి కడప చేరుకోనున్నారు. కడప పట్టణంలోని రాజీవ్‌ మార్గ్, రాజీవ్‌ పార్కులను ప్రారంభించనున్నారు. అనంతరం కడప నుంచి కొప్పర్తి బయలుదేరి వెళ్లనున్నారు. కొప్పర్తి పారిశ్రామికవాడలో అల్ డిక్సన్‌ యూనిట్‌ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఆ తర్వాత కొప్పర్తి నుంచి కడప చేరుకుని అక్కడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1:30 గంటలకు తాడేపల్లికి ముఖ్యమంత్రి జగన్ చేరుకోనున్నారు.

Updated Date - 2023-07-07T14:05:17+05:30 IST