‘లైవ్ స్టాక్ మిషన్’లో యువత భాగస్వాములు కావాలి
ABN , First Publish Date - 2023-09-22T00:46:17+05:30 IST
జాతీయ లైవ్ స్టాక్ మిషన్ పథకంలో యువత భాగస్వాములై పశుగణాభివృద్ధితో ప్రయోజనం పొందాలని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి ప్రభాకర్ సూచించారు.
చిత్తూరు (సెంట్రల్), సెప్టెంబరు 21: జాతీయ లైవ్ స్టాక్ మిషన్ పథకంలో యువత భాగస్వాములై పశుగణాభివృద్ధితో ప్రయోజనం పొందాలని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి ప్రభాకర్ సూచించారు. ఔత్సాహికులైన నిరుద్యోగ యువతకు గురువారం చిత్తూరులోని అంబేడ్కర్ భవన్లో జాతీయ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ పథకం కింద మేకలు, పొట్టేళ్లు గొర్రెలు, నాటుకోళ్లు అభివృద్ధి.. పాతరగడ్డి దాణా తయారీ యూనిట్లు రాయితీపై మంజూరు చేయనున్నట్లు చెప్పారు. వంద మేకలు, ఐదు పొట్టేళ్ల యూనిట్కు గరిష్ఠంగా రూ.10 లక్షలు, ఇలా ఐదు వందల గొర్రెలు/మేకలు 25 పెట్టేళ్లు/ మేకపోతులకు రూ.50 లక్షల వరకు రాయితీ ఇస్తామన్నారు. అనుభవం గల వ్యక్తిగత పశుపోషకులు, రైతు ఉత్పాదకత సంస్థలు, స్వయం సహాయక సంఘాలు, జాయింట్ లయబిలిటీ గ్రూపులు, సెక్షన్-8 కంపెనీల నుంచి అర్హత ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాడి రైతులు, యువత పాల్గొన్నారు.