తుమ్మిందలో ఎందుకిలా..!
ABN , First Publish Date - 2023-11-06T01:02:45+05:30 IST
తుమ్మింద దళితవాడకు చెందిన మల్లిక(65) గురువారం వారి బంధువు చావుకు వెళ్లి రాత్రి వచ్చారు. అప్పటి నుంచి వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడ్డారు.
16 మందికి వాంతులు, విరోచనాలు
వీరిలో ఇద్దరి మృతి
చిత్తూరు రూరల్, నవంబరు 5: తుమ్మింద దళితవాడకు చెందిన మల్లిక(65) గురువారం వారి బంధువు చావుకు వెళ్లి రాత్రి వచ్చారు. అప్పటి నుంచి వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడ్డారు. శుక్రవారం గుడిపాల మండలంలోని ఆర్ఎంపీ వద్దకు వెళ్లి సెలైన్ పెట్టించుకొని వచ్చారు. ఆ తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. మల్లిక బంధువులు ఆమెను శనివారం రాత్రి చిత్తూరు ప్రభుత్వకు తీసుకెళ్లారు ఆమె అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందారు.
ఫ అదే గ్రామానికి చెందిన బోజప్ప(65) శుక్రవారం వాంతులు విరేచనాలతో చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. ఆయన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడని గుర్తించారు. అయితే ఆయన కిడ్నీ రోగంతో మృతి చెందాడా, లేక వాంతులు, విరోచనాలు రావడంతో తట్టుకులేక మృతి చెందాడా అని తెలియాల్సి ఉంది.
ఇలా, చిత్తూరు రూరల్ మండలం తుమ్మింద దళితవాడలో గురువారం నుంచి వాంతులు, విరోచనాలతో 16 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇద్దరు శని, ఆదివారాల్లో మృతిచెందారు. మరో ఐదుగురు చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి, రుయాలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారు గ్రామంలోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. వీరి ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. వీరంతా వివిధ కుటుంబాలకు చెందినవారు. వీరి అస్వస్థతకు కారణాలు అంతుబట్టడం లేదని తెలుస్తోంది. గ్రామంలో ఒక్కసారిగా వివిధ కుటుంబాలకు చెందిన వారు అస్వస్థతకు గురవడంతో అధికారులు నీళ్లు కలుషితం కారణమేమోనన్న అనుమానంతో నీటిని పరీక్షించారు. నీటి నుంచి ఈ అస్వస్థతకు కారణం కనిపించలేదని తేల్చారు. కాగా, తుమ్మింద పంచాయతీలో పారిశుధ్యం కార్మికులు(గ్రీన్ అంబాసిడర్స్) చెత్త తొలగించి కొని నెలలు గడుస్తోంది. వీరికి ఏళ్ల తరబడి ప్రభుత్వం వేతనాలు చెల్లించకపోవడంతో గ్రామంలో అపరిశుభ్రత నెలలకొంది. ఇక పంచాయతీ నిధులు కూడా ప్రభుత్వం వాడుకోవడంతో కనీసం శానిటేషన్ పనులు వెచ్చించేందుకు కూడా పంచాయతీలో చిల్లిగవ్వ కూడా లేక పోవడంతో అధికారులు చేతులెత్తాశారు. దీంతో అక్కడపడితే అక్కడ అపరిశుభ్రత నెలకొని గ్రామాల్లో ఇలాంటి వ్యాధులు రావడానికి దారి తీస్తున్నాయని స్థానికులు అవేదన వ్యక్తంచేస్తున్నారు. గ్రామంలో 16 మంది వరకు ఆస్వస్థకు గురికావడంతో శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మేలుకొంది. గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించింది. ఆదివారం ఈ క్యాంపును ఇన్చార్జ్ డీఎంహెచ్వో రాజశేఖర్ రెడ్డి సందర్శించారు.