పోలింగ్ కేంద్రాలు మార్చేదెందుకు?
ABN , First Publish Date - 2023-11-06T01:28:11+05:30 IST
పూతలపట్టు మండలంలో పోలింగ్ కేంద్రాలను మార్చడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని సౌకర్యాలతో ఉన్న కేంద్రాలను కాదని.. వైసీపీ నాయకుల సూచన మేరకు అధికారులు మార్చడం సరికాదంటున్నారు.
పూతలపట్టు, నవంబరు 5: పూతలపట్టు మండలంలో పోలింగ్ కేంద్రాలను మార్చడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని సౌకర్యాలతో ఉన్న కేంద్రాలను కాదని.. వైసీపీ నాయకుల సూచన మేరకు అధికారులు మార్చడం సరికాదంటున్నారు. ఎర్రచెరువుపల్లి పోలింగ్ కేంద్రాన్ని ఈసీపల్లి దళితవాడకు, వడ్డేపల్లి బూత్ను నూతనంగా నిర్మించిన రైతుభరోసా కేంద్రానికి, కమ్మగుట్టపల్లి పోలింగ్ బూత్ను పేటపల్లి గ్రామానికి, అండ్రవారిపల్లి బూత్ను ఎస్టీకాలనీ వద్దకు మార్చడంపై విమర్శలు తలెత్తుతున్నాయి. ఇలా అధికారులు మార్చిన పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి సౌకర్యాలు లేవని అంటున్నారు. ఉదాహరణకు కమ్మగుట్టపల్లి పోలింగ్ బూత్ను పేటపల్లిలోని ఎంపీపీ పాఠశాలకు మార్చారు. కమ్మగుట్టపల్లి గ్రామంలో రెండు పాఠశాల భవనాలు, అంగన్వాడీ కేంద్రం, పశువైద్యకేంద్రాలు కూడా ఖాళీగా, చాలా విశాలంగా ఉన్నాయి. మంచినీటి సౌకర్యంతో పాటు ఓటర్లు వేచివుండేందుకు విశాలమైన భవనాలు, కల్యాణ మండపం కూడా ఖాళీగా ఉన్నాయని స్థానికులు గుర్తుచేస్తున్నారు. అధికారులు మాత్రం పేటపల్లి గ్రామానికి మార్చారు. పేటపల్లిలోని ఎంపీపీ పాఠశాలలో ఒకే గది ఉంది. ఆ గదిలో సరిగ్గా 20 మంది కూడా సరిపోరు. కనీసం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చి నిలబడేందుకు కూడా ఇబ్బందే. స్కూల్ పక్కనే రోడ్డు ఉండటంతో వాహన రాకపోకలు అధికంగా ఉండటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తాగునీటి వసతి లేదని స్థానికులు అంటున్నారు. ఇన్ని అసౌకర్యాలతో ఉన్న ఈ పాఠశాలను అధికారులు పోలింగ్ కేంద్రంగా ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నిస్తున్నారు. మిగిలిన కేంద్రాల పరిస్థితీ ఇదే. ఇదిలా ఉండగా తప్పులతడకగా ఉన్న ఓటరు జాబితాను సరిదిద్దేందుకు తాము ప్రయత్నిస్తున్నా బీఎల్వోలు అందుబాటులో ఉండడం లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కమ్మగుట్టపల్లి బీఎల్వో రెండురోజులుగా అందుబాటులో లేరని వారు ఆరోపించారు.