మాడవీధుల్లో విష్వక్సేనుడి విభవం
ABN , First Publish Date - 2023-09-18T01:07:13+05:30 IST
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్ర్తోక్తంగా అంకురార్పణ

తిరుమల, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి) : తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిదిరోజుల పాటు జరగనున్న బ్రహ్మోత్సవాలకు శాస్ర్తోక్తంగా అంకురార్పణ కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి నిర్వహించారు.శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షుడైన విష్వక్సేనుడు రాత్రి 7 గంటలకు విశేష అలంకరణలో చేత గదతో తిరుచ్చి వాహనంపై ఆలయం నుంచి వెలుపలకు వచ్చారు. మహాద్వారం వద్ద హారతి అందుకుని మాడవీధుల్లో ఊరేగుతూ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అంకురార్పణ కార్యక్రమంలో భాగంగా ఆలయంలోని యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజ నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడమే ఈ ఘట్టం ఉద్దేశం.యాగశాలకు సమీపంలో అంకురార్పణ జరిగే ప్రదేశాన్ని ముందుగానే పేడతో అలంకరించారు. రాత్రి సేనాధిపతి ఊరేగింపు అనంతరం ఆ ప్రదేశంలో బ్రహ్మపీఠాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం మంట ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ తదితర దేవతలను ఉత్సవాలకు ఆహ్వానించారు. అనంతరం భూమాతను ప్రార్ధిస్తూ అందులో ముందుగానే సేకరించిన మట్టిని కుండల్లో వేసి శాలి, వ్రహి, యువ, ముద్గ, మాష, ప్రియంగు వంటి నవధాన్యాలను చల్లి నీరు పోశారు. ఆ పాలికలను నూతన వస్త్రంతో అలంకరించి పుణ్యాహవచనం నిర్వహించారు. తర్వాత సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం పఠించారు. ప్రతిరోజూ ఈ పాలికల్లో కొద్దిగా నీరు పోస్తూ మొలకలు వచ్చేలా చర్యలు తీసుకుంటారు.ఈ కార్యక్రమాల్లో టీటీడీ చైర్మన్ కరుణాకర రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహ కిషోర్, డిప్యూటీఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు.