వరదరాజు వెళ్లిపోయాడు!
ABN , First Publish Date - 2023-08-22T01:33:58+05:30 IST
తనకిచ్చిన భూమిని వేరొకరు ఆక్రమించారు. దీనిపై ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 15 ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నాడు వరదయ్యపాళెంకు చెందిన వరదరాజు. చివరకు తన సమస్య పరిష్కారం కాకనే తనువు చాలించాడు.
- భూమి కోసం 15 ఏళ్లుగా పోరాడిన దివ్యాంగుడు
- సమస్య పరిష్కారం కాకనే తనువు చాలించాడు
తనకిచ్చిన భూమిని వేరొకరు ఆక్రమించారు. దీనిపై ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 15 ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నాడు వరదయ్యపాళెంకు చెందిన వరదరాజు. చివరకు తన సమస్య పరిష్కారం కాకనే తనువు చాలించాడు.
వరదయ్యపాళెం, ఆగస్టు 21: వరదయ్యపాళెంకు చెందిన వరదరాజు (55) కాళ్లు లేకుండా పుట్టాడు. జీవనోపాధి కోసం స్థానిక ఆర్టీసీ బస్టాండు వద్ద మరుగుదొడ్ల నిర్వహణతో వచ్చే చాలీచాలని ఆదాయంతో వృద్ధురాలైన తల్లి మునెమ్మని పోషించుకునేవాడు. తన దయనీయ పరిస్థితిని అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్కు విన్నవించగా ఆయన మానవతా దృక్పథంతో దివ్యాంగ కోట కింద జీవనోపాధి కోసం భూ పంపిణీ చేయాలని ఆదేశాలిచ్చారు. ఆ ఆదేశాల మేరకు 2004లో కురుంజలం రెవెన్యూలో సర్వే నెంబరు 104/4లో 1.5 ఎకరాల సాగు భూమిని వరదరాజుకు కేటాయించారు. శారీరక వైకల్యానికితోడు ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఆ భూమిని సాగు చేయలేకపోయాడు. దీన్ని అదనుగా తీసుకుని మూడేళ్ల తర్వాత అదే గ్రామానికి చెందిన వడ్ల రవి ఆ భూమిని ఆక్రమించి, సాగు చేపట్టాడు. ఇదేంటని అప్పటి నుంచే వరదరాజు పోరాటం మొదలుపెట్టాడు. 2018లో కొందరు రెవెన్యూ అధికారుల సహకారంతో ఈ భూమిని రవి తన పేరిట ఆన్లైన్లో నమోదు చేయించుకున్నాడు. దీనిపై అధికారులను వరదరాజు ప్రశ్నించడంతో వారు 2020లో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆపై రవికి నోటీసులు ఇవ్వడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలో వరదరాజుకు పక్కనే ఉన్న మరోభూమిని అధికారులు చూపించారు. అయితే సాగుకు పనికిరానిభూమిని చూపించారని, గతంలో కేటాయించిన భూమినే ఇవ్వాలని చిత్తూరు, తిరుపతి, వరదయ్యపాళెంలోని రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం లేకపోయింది. దాదాపు 15ఏళ్లుగా పోరాటం చేస్తూ.. చివరకు ఆదివారంరాత్రి హఠాన్మరణంతో తనువు చాలించాడు. సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఇప్పటి వరకు అండగా ఉన్న బిడ్డ మృతితో ఆయన తల్లి ఒంటరిగా మారారు. ఈ వృద్ధురాలికి మరో ఇద్దరు బిడ్డలున్నారని.. వారి ఆర్థిక పరిస్థితి అంతంగా మాత్రంగా ఉందని.. ఈమెను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.