గోడ కూలి ఇద్దరు కూలీల మృతి
ABN , Publish Date - Dec 29 , 2023 | 01:56 AM
గోడ కూలడంతో శిథిలాల కిందపడి ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు.
తిరుపతి(నేరవిభాగం), డిసెంబరు 28: గోడ కూలడంతో శిథిలాల కిందపడి ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. వెస్ట్ సీఐ జయనాయక్ తెలిపిన వివరాల ప్రకారం... మంచాల వీధికి చెందిన షబ్బీర్ తనకు చెందిన ఓ పాత రేకుల ఇల్లు పాడై పోవడంతో పునర్ నిర్మించాలని అనుకున్నారు. నాలుగుకాళ్ల మండపం వద్ద కూలి పనుల కోసం వేచి ఉండే వారిలో ఐదుగురు పురుషులు, ఓ మహిళా కూలీని మాట్లాడుకుని ఇంటిని తొలగించే పనిని ప్రారంభించారు. గురువారం ఇంటిపైనున్న రేకులను తొలగించారు. గోడలను తొలగించేందుకు ప్రయత్నం చేస్తుండగా అకస్మాత్తుగా ఓ గోడ కూలిపోయింది. దాని కింది భాగంలో పనులు చేస్తున్న కూలీలు నారాయణ (40), నరసింహులు (50)పై శిథిలాలు పడటంతో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో కూలీ ఖాదర్బాషాకు స్వల్ప గాయాలయ్యాయి. తోటి కూలీలు, ఇంటి యజమాని కలిసి క్షతగాత్రులను రుయా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నారాయణ, నరసింహులు మృతిచెందారు. ఖాదర్బాషా ఆరోగ్యం నిలకడగానే ఉందని, ప్రమాదమేమీ లేదని సీఐ జయనాయక్ తెలిపారు. కదిరికి చెందిన నారాయణ రెండేళ్లుగా భార్యతోపాటు తిరుపతిలోనే నివాసం ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నరసింహులు వ్యక్తిగత వివరాలు లభ్యం కాలేదని సీఐ చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.