268 మంది పోలీసు సిబ్బందికి స్థాన చలనం

ABN , First Publish Date - 2023-06-01T01:51:48+05:30 IST

రెండు రోజుల పాటు నిర్వహించిన తిరుపతి జిల్లా పోలీసు సిబ్బంది సాధారణ బదిలీల ప్రక్రియ బుధవారంతో ముగిసింది.

268 మంది పోలీసు సిబ్బందికి స్థాన చలనం

తిరుపతి(నేరవిభాగం), మే 31 : రెండు రోజుల పాటు నిర్వహించిన తిరుపతి జిల్లా పోలీసు సిబ్బంది సాధారణ బదిలీల ప్రక్రియ బుధవారంతో ముగిసింది. ఎస్పీ పరమేశ్వర రెడ్డి ఏఎస్పీ వెంకటరావుతో కలిసి జిల్లా పోలీసు కార్యాలయంలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఒకే స్టేషన్‌లో ఐదేళ్ల కాలం పూర్తి చేసుకున్న సిబ్బందిని బదిలీ చేశారు. జిల్లావ్యాప్తంగా 268 మందికి స్థాన చలనం కలిగింది. ఏఎస్‌ఐలు 21 మంది, హెడ్‌కానిస్టేబుళ్లు 60మంది, కానిస్టేబుళ్లు 187 మంది వివిధ ప్రాంతాలకు బదిలీ అయ్యారు. తొలిరోజు మంగళవారం చిత్తూరు, నెల్లూరు జిల్లాల నుంచి తిరుపతి జిల్లాలో కలిసిన ప్రాంతాలకు చెందిన 75 మందిని బదిలీ చేశారు. మిగిలిన 193 మందికి బుధవారం పోస్టింగులు ఇచ్చారు. ఎస్పీ మాట్లాడుతూ ఇతర జిల్లాలకు చెందిన సిబ్బంది ఇష్టపూర్వకంగానే తిరుపతి జిల్లాకు వచ్చారని తెలిపారు. తిరుపతిలో పనిచేయడం కత్తిమీద సాములాంటిదని, కష్టపడి నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు కార్యాలయ పరిపాలనాధికారి కిషోర్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-06-01T01:51:48+05:30 IST