ఎస్బీఐ ఏటీఎంలో చోరీ
ABN , First Publish Date - 2023-09-15T02:29:13+05:30 IST
తిరుపతిలో ఓ ఎస్బీఐ ఏటీఎం నుంచి పెద్దమొత్తంలో నగదును దొంగలు చోరీ చేశారు. కేవలం 13 నిమిషాల్లో చోరీని పూర్తిచేశారు. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్కు అత్యంత సమీపంలోని వైకుంఠపురం రోడ్డులో గురువారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకుంది.
రూ.18.26 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు
తిరుపతి(నేరవిభాగం), సెప్టెంబరు 14: తిరుపతిలో ఓ ఎస్బీఐ ఏటీఎం నుంచి పెద్దమొత్తంలో నగదును దొంగలు చోరీ చేశారు. కేవలం 13 నిమిషాల్లో చోరీని పూర్తిచేశారు. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్కు అత్యంత సమీపంలోని వైకుంఠపురం రోడ్డులో గురువారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ఉదయం ఏటీఎంకు వచ్చిన స్థానికులు ఏటీఎం మిషన్ కట్చేసి ఉండటంతో విషయాన్ని పక్కనే ఉన్న తిరుపతి రూరల్ పోలీసులకు తెలియజేశారు. నేరవిభాగ ఏఎస్పీ విమలకుమారి, డీఎస్పీ రవికుమార్, ూరల్ డీఎస్పీ యశ్వంత్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్టీమ్ను రప్పించి వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. సీసీ ఫుటేజిని పరిశీలించారు. పోలీసులు తెలిపిన మేరకు...వైకుంఠపురం మెయిన్ రోడ్డులో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలోకి గురువారం వేకువజామున 3.10 గంటలకు మంకీ క్యాప్లు వేసుకున్న ఇద్దరు వ్యక్తులు ప్రవేశించారు. సీసీ కెమెరాలపై నల్లరంగు పెయింట్ను స్ర్పే చేశారు. గ్యాస్ కట్టర్తో ఏటీఎం మిషన్ చుట్టూ ఉన్న ఐరన్ సేఫ్ను కట్చేసి తొలగించారు. ఉన్న డబ్బంతా తీసుకుని సరిగ్గా 3.23 గంటలకు ఏటీఎం నుంచి వెళ్లిపోయారు. 18,26,500 రూపాయలను దుండగులు దోచుకెళ్లినట్టు తిరుపతి రూరల్ సీఐ సుబ్రహ్మణ్యంరెడ్డి తెలిపారు. వారు వెళ్లిన మార్గాన్ని గుర్తించి, ప్రత్యేక పోలీసు బృందం గాలిస్తోంది. కాగా, ఎస్బీఐ చోరీ జరిగిన ఏటీఎం నిర్వహణను సీఎంఎస్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చింది. సాధారణంగా ఏటీఎంను ఎవరైనా ధ్వంసం చేయాలని ప్రయత్నిస్తే ఏటీఎంలో, ఏటీఎంకు చెందిన ఎస్బీఐ బ్రాంచిలో అలారం మోగేలా ఏర్పాటుచేసి ఉంటుంది. అయితే నిర్వాహకులు అలాంటి ఏర్పాటేమీ చేయకుండా నిర్లక్ష్యం వహించినట్టు తెలుస్తోంది. సీఎంఎస్ కంపెనీ ప్రతినిధి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.