మెట్టు దిగని టీడీపీ శ్రేణులు
ABN , First Publish Date - 2023-09-26T01:59:10+05:30 IST
తమ అధినేత చంద్రబాబు విడుదల కోసం నిరసనలు, ఆందోళనలు చేపట్టిన టీడీపీ శ్రేణులు ఏమాత్రం మెట్టు దిగడం లేదు. వరుసగా 13వ రోజైన సోమవారం కూడా జిల్లావ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు, కొవ్వొత్తులతో ప్రదర్శనలు, కరపత్రాలతో ఇంటింటి ప్రచారాలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు వంటివి కొనసాగించారు.

తిరుపతి, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): తమ అధినేత చంద్రబాబు విడుదల కోసం నిరసనలు, ఆందోళనలు చేపట్టిన టీడీపీ శ్రేణులు ఏమాత్రం మెట్టు దిగడం లేదు. వరుసగా 13వ రోజైన సోమవారం కూడా జిల్లావ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు, కొవ్వొత్తులతో ప్రదర్శనలు, కరపత్రాలతో ఇంటింటి ప్రచారాలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు వంటివి కొనసాగించారు. తిరుపతిలో తెలుగు యువత ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష కొనసాగింది. టీడీపీ నాయకులు నరసింహ యాదవ్, సుగుణమ్మ, ఊకా విజయ్కుమార్, ఆర్సీ మునికృష్ణ, మబ్బు దేవనారాయణరెడ్డి, సింగంశెట్టి సుబ్బరామయ్య, పుష్పావతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. చంద్రగిరిలో టీడీపీ రిలే దీక్షా శిబిరంలో ఎస్సీ సెల్ విభాగం కార్యకర్తలతో కలసి ఇన్చార్జి పులివర్తి నాని పాల్గొన్నారు. గూడూరు టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్కుమార్ చేపట్టిన రిలే దీక్షకు చిల్లకూరు మండల నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. వెంకటగిరి నియోజకవర్గం డక్కిలిలో స్థానిక నేతలు, కార్యకర్తలు నిరాహార దీక్ష చేపట్టారు. సత్యవేడులో రిలే నిరాహార దీక్షా శిబిరంలో ఇన్చార్జి డాక్టర్ హెలెన్, మాజీ ఎమ్మెల్యే హేమలత, కార్యకర్తలు పాల్గొన్నారు. కేవీబీపురం మండలం అంజూరులో బాబుతో మేము పేరిట కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. శ్రీకాళహస్తి టీడీపీ కార్యాలయంలో స్థానిక నేతలు, కార్యకర్తలు నిరాహార దీక్ష కొనసాగించారు. తొట్టంబేడు శివాలయంలో చంద్రబాబు కోసం గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించగా.. ఏర్పేడు మండలం నచ్చనేరి పంచాయతీ దుర్గిపేరిలో టీడీపీ వర్గీయులు కొవ్వొత్తుల ప్రదర్శన జరిపారు. సూళ్లూరుపేటలో స్థానిక నేతలు రిలే దీక్ష కొనసాగించారు.