బకాయిల కోసం రోడ్డెక్కిన చెరకు రైతులు
ABN , First Publish Date - 2023-08-22T01:22:23+05:30 IST
నేతమ్స్ షుగర్స్ కర్మాగారం యాజమాన్యం బకాయిలు చెల్లించాలంటూ చెరకు రైతులు సోమవారం తిరుపతి- చెన్నై జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు.
నిండ్ర, ఆగస్టు 21: నేతమ్స్ షుగర్స్ కర్మాగారం యాజమాన్యం బకాయిలు చెల్లించాలంటూ చెరకు రైతులు సోమవారం తిరుపతి- చెన్నై జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. దీంతో ఇరువైపులా వాహనాలు బారులు తీరాయి. పోలీసులు ఎంత నచ్చచెప్పినా రైతులు శాంతించలేదు. ఒక దశలో పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ రైతులు నినాదాలు చేశారు. అనంతరం నగరి రూరల్ సీఐ శ్రీనివాసంతి, నిండ్ర తహసీల్దార్ అమరేంద్రబాబు, ప్రస్తుతం జరుగుతున్న పరిమాణాలను ఆర్ఆర్ యాక్టు ద్వారా యాజమాన్యానికి నోటీసులు అందించిన విషయాన్ని రైతులకు వివరించి ధర్నా విరమింపచేశారు. అనంతరం రైతులతో తహసీల్దార్, సీఐ సమావేశమయ్యారు. ఈ సమస్యపై ఫోను ద్వారా కలెక్టర్తో రైతులను మాట్లాడించారు. ‘మాకు జిల్లా కేన్ కమిషనర్ న్యాయం చేయడం లేదు. ఆయన స్థానంలో జాయింట్ కలెక్టర్ హోదా కలిగిన అధికారిని నియమించాలి. ఆర్ఆర్ యాక్టు వల్ల రైతులకు న్యాయం జరగడంలో ఆలస్యం అవుతోంది. దానికి బదులుగా ఈ నెల 28న ముఖ్యమంత్రిని కలిసే అవకాశం కల్పించండి. రైతు సంక్షేమ నిధి నుంచి నిధులు చెల్లించాలని సీఎంను కోరతాం. యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి’ అని వారు కలెక్టరుకు వివరించారు. వీటిని పరిశీలించి తగు న్యాయం చేస్తామని కలెక్టరు షన్మోహన్ చెప్పినట్లు రైతు సంఘం నాయకులు తెలిపారు. అంతకుముందు చెరకు రైతు సంఘ నాయకులు మాట్లాడుతూ ప్రతిసారి ధర్నాలు, నిరసనలు, దీక్షలు చేపట్టినా కోర్టుకు వెళ్లినా, న్యాయం జరగడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి నేతమ్స్ యాజమాన్యం నందకుమార్ను అరెస్టు చేయాలన్నారు. కర్మాగారం ఆస్తులను వేలం వేసి బకాయిలు చెల్లించాలన్నారు. ప్రస్తుతం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అధికారులు అమలు చేయాలని కోరారు. ఈ ఆందోళనలో చెరకు రైతుసంఘ నాయకులు ఆదినారాయణరెడ్డి, శ్రీనివాసయాదవ్, రఘునాథరెడ్డి, గుణశేఖర్రెడ్డి, సుదర్శనం నాయుడు, కులశేఖర్, నాగభూషణంనాయుడు, జనార్దన్నాయుడు, రైతులు రమే్షరెడ్డి, లక్ష్మణరాజు, శంకర్నాయుడు, ప్రకా్షనాయుడు తదితరులు పాల్గొన్నారు.