Share News

ఒక్కోచోట.. ఒక్కోవిధంగా..!

ABN , Publish Date - Dec 23 , 2023 | 02:00 AM

పలమనేరు పట్టణంలో ఒక్కోచోట విధంగా.. ఒక్కోవిధంగా జాతీయ రహదారి విస్తరణ పనులు చేశారు.

ఒక్కోచోట.. ఒక్కోవిధంగా..!
పలమనేరులో దండపల్లి రహదారి కలిసే మలుపులో ఇరుకుగా ఉన్న జాతీయరహదారి

పలమనేరులో అస్తవ్యస్తంగా జాతీయరహదారి విస్తరణ పనులు

విస్తరణ జరిగినా అవసరమున్న చోట పాత రహదారే

పలమనేరు, డిసెంబరు 22: పలమనేరు పట్టణంలో ఒక్కోచోట విధంగా.. ఒక్కోవిధంగా జాతీయ రహదారి విస్తరణ పనులు చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఇరుకుగా ఉండి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. రెండేళ్ల కిందట పలమనేరు- హైదరాబాదు జాతీయరహదారిని నాలుగులేన్లుగా విస్తరించడానికి పనులు చేపట్టారు. ఈ పనులు పర్యవేక్షించిన అధికారులు ఎందువల్లో తెలియదు గానీ పట్టణంలోని అంబేడ్కర్‌ సర్కిల్‌ నుంచి దండపల్లి రోడ్డు కలిసే మలుపు వరకు ఉన్న సుమారు కిలోమీటరు లోపు ఉన్న ఈ రహదారిలో ఒక్కోచోట ఒక్కో విధంగా విస్తరణ పనులు చేపట్టారు. ఒక చోట ఈ జాతీయరహదారిని దాదాపు 150 అడుగుల వెడల్పు వచ్చేవిధంగా విస్తరించారు. మరికొన్ని చోట్ల పాతరహదారిని అలాగే ఇరుగ్గా వదిలి పెట్టేశారు.

ఫ అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద హైదరాబాద్‌ నుంచి మదనపల్లె మీదుగా వచ్చే వాహనాలు పట్టణంలోని బెంగళూరు- చెన్నె జాతీయ రహదారిపై కలుస్తాయి. రెండు జాతీయ రహదారులు కలిసే ఈ ప్రాంతంలోనే వాస్తవానికి రోడ్డు తప్పని సరిగా విస్తరించాల్సి వుంది. అయితే అధికారులు ఒత్తిళ్లకు తలొగ్గి.. రాజకీయ నాయకుల ప్రమేయంతో పాతరోడ్డును అలాగే విడిచిపెట్టేశారు. దీంతో తరచూ ఈ సర్కిల్‌ వద్ద వాహనాలు అధిక సంఖ్యలో వచ్చినప్పుడు ట్రాఫిక్‌ స్తంభిస్తోంది.

ఫ రంగమహల్‌ మీదుగా వచ్చే రహదారి కలిసే రెక్కమాను వద్దకూడా పాతరోడ్డును అలాగే వదిలి పెట్టేశారు.

ఇలా వదిలేయడం.. ఎంత ప్రమాదమో?

గుండుబావి సమీపంలో గంగవరం మండలం దండపల్లి నుంచి వచ్చే రహదారి వద్ద మలుపు కూడా ఉంది. ఈ మలుపు ఎన్నో ఏళ్లుగా ప్రమాదాలకు నిలయంకూడా. ఇక్కడ కూడా ఏమాత్రం జాతీయరహదారి అధికారులు రోడ్డు విస్తరణ పనులు చేయకుండా అలాగే విడిచిపెట్టేశారు. ఈ మలుపు వద్ద మురుగునీటికాలువ వెళ్తోంది. రోడ్డుకు అన్నిచోట్ల పాదచారులు వెళ్లేందుకు వీలుగా ఫుట్‌పాత్‌ ఉంటుంది. ఇది జాతీయ రహదారిలో అయితే తప్పనిసరి. ఇక్కడి మలుపులో ఫుట్‌పాత్‌ లేదు. ఇక మురుగునీటి కాలువే రోడ్డుకు ఆనుకొని ఉంది. దీంతో ఈ మలుపు వద్ద వాహనదారులు, ద్విచక్రవాహనదారులు ఏమాత్రం అదుపు తప్పినా ప్రమాదమే. ఈ రహదారిలో ఉదయం, సాయంత్రం రద్దీ అత్యధికంగా ఉంటుంది. ఈ జాతీయ రహదారిని ఆనుకొనే పట్టణ పొలిమేరల్లో సుమారు 5 కిలోమీటర్ల మేర ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థలు ఉన్నాయి. ఈ విద్యాసంస్థల్లో వేలాది మంది విద్యార్థులు ఈ రహదారిగుండా బస్సుల్లోను, ద్విచక్రవాహనాల్లోను, ఆటోల్లోను వెళ్తుంటారు. పలమనేరు నుంచి గంగవరం, పెద్దపంజాణి మండలాల్లోని వివిధ గ్రామాలకు వందల సంఖ్యలో ఆటోలు ఈ జాతీయ రహదారి గుండానే వెళ్తుంటాయి. రైతులు పండించిన టమోటా, బీన్సు, క్యాబేజి, ముల్లంగి, చిక్కుడు, సొర, బీర వంటి కూరగాయలను లగేజి ఆటోల్లో ఈ జాతీయ రహదారి గుండానే పలమనేరు మార్కెట్‌కు తీసుకొస్తుంటారు. ఇంత రద్దీగా ఉండే ఈ జాతీయరహదారిని ఒక్కోచోట ఒక్కోవిధంగా అలైన్‌మెంట్‌తో విస్తరించి ప్రమాద కరమైన మలుపుల్లో, ప్రదేశాల్లో పాత ఇరుకు రోడ్డును అలాగే విడిచిపెట్టడంలో ఆంతర్యం ఏమిటో జాతీయరహదారి అధికారులకే తెలియాలి. రోడ్డు విస్తరణలో పాత రోడ్డును అలాగే విడిచి పెట్టడంతో ఈ మలుపు వద్ద పెద్ద పెద్ద భవంతులు, షాపింగ్‌ గదుల నిర్మాణాలు కూడా జరిగిపోయాయి. ఇకనైనా అధికారులు ఈ జాతీయరహదారిలో నిబంధనల మేరకు అన్ని చోట్ల రోడ్డు అలైన్‌ మెంట్‌ ఒకే విధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Dec 23 , 2023 | 02:00 AM