ఒక్కోచోట.. ఒక్కోవిధంగా..!
ABN , Publish Date - Dec 23 , 2023 | 02:00 AM
పలమనేరు పట్టణంలో ఒక్కోచోట విధంగా.. ఒక్కోవిధంగా జాతీయ రహదారి విస్తరణ పనులు చేశారు.
పలమనేరులో అస్తవ్యస్తంగా జాతీయరహదారి విస్తరణ పనులు
విస్తరణ జరిగినా అవసరమున్న చోట పాత రహదారే
పలమనేరు, డిసెంబరు 22: పలమనేరు పట్టణంలో ఒక్కోచోట విధంగా.. ఒక్కోవిధంగా జాతీయ రహదారి విస్తరణ పనులు చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఇరుకుగా ఉండి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. రెండేళ్ల కిందట పలమనేరు- హైదరాబాదు జాతీయరహదారిని నాలుగులేన్లుగా విస్తరించడానికి పనులు చేపట్టారు. ఈ పనులు పర్యవేక్షించిన అధికారులు ఎందువల్లో తెలియదు గానీ పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్ నుంచి దండపల్లి రోడ్డు కలిసే మలుపు వరకు ఉన్న సుమారు కిలోమీటరు లోపు ఉన్న ఈ రహదారిలో ఒక్కోచోట ఒక్కో విధంగా విస్తరణ పనులు చేపట్టారు. ఒక చోట ఈ జాతీయరహదారిని దాదాపు 150 అడుగుల వెడల్పు వచ్చేవిధంగా విస్తరించారు. మరికొన్ని చోట్ల పాతరహదారిని అలాగే ఇరుగ్గా వదిలి పెట్టేశారు.
ఫ అంబేడ్కర్ సర్కిల్ వద్ద హైదరాబాద్ నుంచి మదనపల్లె మీదుగా వచ్చే వాహనాలు పట్టణంలోని బెంగళూరు- చెన్నె జాతీయ రహదారిపై కలుస్తాయి. రెండు జాతీయ రహదారులు కలిసే ఈ ప్రాంతంలోనే వాస్తవానికి రోడ్డు తప్పని సరిగా విస్తరించాల్సి వుంది. అయితే అధికారులు ఒత్తిళ్లకు తలొగ్గి.. రాజకీయ నాయకుల ప్రమేయంతో పాతరోడ్డును అలాగే విడిచిపెట్టేశారు. దీంతో తరచూ ఈ సర్కిల్ వద్ద వాహనాలు అధిక సంఖ్యలో వచ్చినప్పుడు ట్రాఫిక్ స్తంభిస్తోంది.
ఫ రంగమహల్ మీదుగా వచ్చే రహదారి కలిసే రెక్కమాను వద్దకూడా పాతరోడ్డును అలాగే వదిలి పెట్టేశారు.
ఇలా వదిలేయడం.. ఎంత ప్రమాదమో?
గుండుబావి సమీపంలో గంగవరం మండలం దండపల్లి నుంచి వచ్చే రహదారి వద్ద మలుపు కూడా ఉంది. ఈ మలుపు ఎన్నో ఏళ్లుగా ప్రమాదాలకు నిలయంకూడా. ఇక్కడ కూడా ఏమాత్రం జాతీయరహదారి అధికారులు రోడ్డు విస్తరణ పనులు చేయకుండా అలాగే విడిచిపెట్టేశారు. ఈ మలుపు వద్ద మురుగునీటికాలువ వెళ్తోంది. రోడ్డుకు అన్నిచోట్ల పాదచారులు వెళ్లేందుకు వీలుగా ఫుట్పాత్ ఉంటుంది. ఇది జాతీయ రహదారిలో అయితే తప్పనిసరి. ఇక్కడి మలుపులో ఫుట్పాత్ లేదు. ఇక మురుగునీటి కాలువే రోడ్డుకు ఆనుకొని ఉంది. దీంతో ఈ మలుపు వద్ద వాహనదారులు, ద్విచక్రవాహనదారులు ఏమాత్రం అదుపు తప్పినా ప్రమాదమే. ఈ రహదారిలో ఉదయం, సాయంత్రం రద్దీ అత్యధికంగా ఉంటుంది. ఈ జాతీయ రహదారిని ఆనుకొనే పట్టణ పొలిమేరల్లో సుమారు 5 కిలోమీటర్ల మేర ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థలు ఉన్నాయి. ఈ విద్యాసంస్థల్లో వేలాది మంది విద్యార్థులు ఈ రహదారిగుండా బస్సుల్లోను, ద్విచక్రవాహనాల్లోను, ఆటోల్లోను వెళ్తుంటారు. పలమనేరు నుంచి గంగవరం, పెద్దపంజాణి మండలాల్లోని వివిధ గ్రామాలకు వందల సంఖ్యలో ఆటోలు ఈ జాతీయ రహదారి గుండానే వెళ్తుంటాయి. రైతులు పండించిన టమోటా, బీన్సు, క్యాబేజి, ముల్లంగి, చిక్కుడు, సొర, బీర వంటి కూరగాయలను లగేజి ఆటోల్లో ఈ జాతీయ రహదారి గుండానే పలమనేరు మార్కెట్కు తీసుకొస్తుంటారు. ఇంత రద్దీగా ఉండే ఈ జాతీయరహదారిని ఒక్కోచోట ఒక్కోవిధంగా అలైన్మెంట్తో విస్తరించి ప్రమాద కరమైన మలుపుల్లో, ప్రదేశాల్లో పాత ఇరుకు రోడ్డును అలాగే విడిచిపెట్టడంలో ఆంతర్యం ఏమిటో జాతీయరహదారి అధికారులకే తెలియాలి. రోడ్డు విస్తరణలో పాత రోడ్డును అలాగే విడిచి పెట్టడంతో ఈ మలుపు వద్ద పెద్ద పెద్ద భవంతులు, షాపింగ్ గదుల నిర్మాణాలు కూడా జరిగిపోయాయి. ఇకనైనా అధికారులు ఈ జాతీయరహదారిలో నిబంధనల మేరకు అన్ని చోట్ల రోడ్డు అలైన్ మెంట్ ఒకే విధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.